13, జూన్ 2013, గురువారం
హైదారాబాద్ లో హై టెన్షన్
తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపు ఇచ్చిన చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో అసెంబ్లీని మిలిటెంట్ పోరాటంగా మార్చాలని మావోయిస్టులు లేఖ రాయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది. హైదరాబాద్ శివార్లలో సభ పెట్టుకుంటామంటే అనుమతిస్తామని చెప్పింది. అయితే, ప్రభుత్వం,పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా చలో అసెంబ్లీని నిర్వహించి తీరతామని జేఏసీ, దానికి మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. దీంతో, ముందు జాగ్రత్తగా హైదరాబాద్ వైపు వచ్చే తెలంగాణ రోడ్లపై పోలీసులు భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాలో జేఏసీ నేతలను కూడా అరెస్ట్ చేసి బైండోవర్ చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టూ కూడా ఎప్పుడూ లేనంతగా భారీగా బలగాలను మోహరించారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసినట్లు ముళ్లకంచెనూ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్క విద్యార్థిని కూడా బయటకు రానివ్వడం లేదు. హైదరాబాద్ లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. రేపు ఉదయంగానీ, ఇవాళ రాత్రి గానీ జేఏసీ ముఖ్యనేతలను, టీఆర్ఎస్ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నా, జేఏసీ నేతలు మాత్రం ఏదో రకంగా అసెంబ్లీని ముట్టడిస్తామని చెబుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి