4, ఏప్రిల్ 2013, గురువారం
బెజవాడ సీటు కోసం తమ్ముళ్ల కీచులాట
Categories :
devineni uma . gadde . kesineni nani . POLITICS . tdp . TOP . vamshi . vijayawada
పార్టీ ఇమేజ్ ను పెంచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాళ్లరిగేలా జనంలో తిరుగుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం సీట్ల కోసం కీచులాడుకుంటున్నారు. ముఖ్యంగా బెజవాడ పార్లమెంట్ సీటు కోసం నేతల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఓ రకంగా చంద్రబాబే ఈ వివాదానికి ఆజ్యం పోశారని చెప్పాలి. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేశారు. అయితే, ఈ మధ్య పార్టీలో చేసిన మార్పులతో విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవినుంచి వంశీని తప్పించిన చంద్రబాబు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కేశినేని ట్రావెల్స్ అధినేత నానిని నియమించారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన నానికి ఈ పదవి కట్టబెట్టడంపై వంశీవర్గం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, గతంలో విజయవాడ ఎంపీగా గెలిచి, అనంతరం రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గద్దె రామ్మోహన్, ఈసారి విజయవాడ ఎంపీ స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కేశినేని నానిని ఇంఛార్జ్ గా నియమించడంతో, ఇక ఆ స్థానం తనకు దక్కదనుకున్న ఆయన, నేరుగా చంద్రబాబు దగ్గరే పంచాయతీ పెట్టారు. విజయవాడ ఎంపీసీటు తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన గద్దె, పనిలో పనిగా, విజయవాడ నుంచి దేవినేని నెహ్రూపై, ఆయన సోదరుడు దేవినేని ఉమను పోటీకి దింపాలని కూడా బాబుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు వంశీ కూడా తనను అర్బన్ అధ్యక్ష పదవినుంచి తొలగించడంపై అసంతృప్తితో ఉన్నారు. నేతల మధ్య తగవుతో విజయవాడలో టీడీపీ పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళనలో పార్టీ కార్యకర్తలున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి