4, ఏప్రిల్ 2013, గురువారం
మరో ఐదుగురికి ఉరి వేసిన ప్రణబ్
Categories :
death centence . news . president . TOP
ఉరిశిక్షల పెండింగ్ కేసుల దుమ్ముదులపడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతి భవన్ లో కుప్పలుకుప్పలుగా ఏళ్లతరబడి ఈ కేసులు పెండింగ్ లో ఉండడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఒక్క పెండింగ్ కేసూ లేకుండా అన్నింటినీ క్లియర్ చేసేశారాయన. కసబ్, ఆప్జల్ గురు, వీరప్పన్ అనుచరులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సంచలనం సృష్టించిన బెంగాల్ దాదా, తాజాగా తన దగ్గర పెండింగ్ లో ఉన్న ఏడు కేసుల్లో ఐదుగురికి ఉరిశిక్షను ఖరారు చేశారు. మరో రెండు కేసుల్లో మాత్రం ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు. దీంతో, రాష్ట్రపతి భవన్లో ఉరిశిక్షపై ఒక్క పెండింగ్ కేసు కూడా లేకుండా పోయింది.
రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న ఏడు కేసులు
1. ఉత్తర ప్రదేశ్ కు చెందిన గుర్మీత్ సింగ్ (ఆగస్టు 17, 1986లో ఓ కుటుంబానికి చెందిన 13 మందిని హత్య చేశాడు)
2. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సురేశ్, రాంజీ (తమ సోదరుడి కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు)
3. హర్యానాకు చెందిన ధర్మపాల్ (1993లో తాను రేప్ చేసిన అమ్మాయి కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశాడు)
4. హర్యానా మాజీ ఎమ్మెల్యే కుమార్తె సోనియా, ఆమె భర్త సంజీవ్ ( సోనియా కుటుంబానికి చెందిన 8 మందికి మత్తుమందు ఇచ్చి హత్య చేశారు)
5. ఉత్తరాఖండ్ కు చెందిన సుందర్ సింగ్ (రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు)
6. ఉత్తర ప్రదేశ్ కు చెందిన జాఫర్ అలీ (భార్యను, ఐదుగురు కూతుళ్లను హత్య చేశాడు)
7. కర్నాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ (ఓ కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో నిందితుడు)
ఈ ఏడు కేసుల్లో ఐదు కేసుల్లో ఉరిశిక్షను ప్రణబ్ ఖరారు చేశారు. మరో రెండు కేసుల్లో మాత్రం నిందుతులను జీవితాతం జైల్లోనే గడిపేలా శిక్షను మార్చారు. అయితే.. ఎవరెవరి కేసుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారన్నది రాష్ట్రపతి భవన్ గానీ, హోంమంత్రిత్వ శాఖ గానీ ఇంతవరకూ వెల్లడించలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి