16, మార్చి 2013, శనివారం
బెజవాడలో బాబాయ్ తో అబ్బాయ్ ఢీ
Categories :
balakrishna . bezawada . entertainment . ntr . POLITICS . TOP . vijayawada . war
ఒకరు బాబాయి , మరొకరు అబ్బాయి. బాబాయికి అబ్బాయంటే ఎప్పుడూ పడదు. అబ్బాయేమో బాబాయి పేరును, తాతపేరును చెప్పుకుంటూ ఇండస్ట్రీలో ఎదిగాడు. ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాతకు తగ్గ మనువడిని తానేనని నిరూపించుకున్నాడు. దాంతో బాబాయి కూడా అబ్బాయితో చేతులు కలపక తప్పలేదు. అంతా సరిగ్గా జరుగుతున్న తరుణంలో నందమూరి కుటుంబంలో మళ్లీ భూకంపం వచ్చింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విడిపోయారు. ఇప్పుడు ఎవరి బలమెంతో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. దీనికి వేదికవుతోంది.. రౌడీ రాజకీయాలకు కేంద్రమైన బెజవాడ. బాలయ్యకు తన బలం చూపించాలని ఎన్టీఆర్, జూనియర్ సత్తా ఎంతో తెలుసుకోవాలని బాలయ్య, ఇద్దరూ సిద్ధమవడంతో, ఇవాళ బెజవాడలో జరిగే ఎన్టీఆర్ టూర్ ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో యాక్సిడెంట్ అయినా వెనకడుగు వేయకుండా బెడ్ పైనే పడుకుని తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు ఎన్టీఆర్. తాత స్థాపించిన పార్టీని అధికారంలోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆయన ఆశల నెరవేరలేదు. ఎన్టీఆర్ వివాహం అయిన తర్వాత క్రమంగా పార్టీకి, అతనికి దూరం పెరుగుతూ వచ్చింది. బాలయ్య టీడీపీ లో చక్రం తిప్పుతుండడం, లోకేశ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండడంతో, ఎన్టీఆర్ ను పక్కకు తప్పించారు. కోడాలి నాని వ్యవహారంలోనూ జూనియర్ తీరుపై గుర్రుగా ఉన్న బాలయ్య, పార్టీలో ఎక్కడా ఎన్టీఆర్ పేరు వినిపించకూడదంటూ హుకూం జారీచేశారు. పామర్రులో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో కనిపించిన ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తీయించివేశారు. దీంతో బాబు పాదయాత్రలో ఎక్కడా జూనియర్ పేరన్నదే వినిపించకుండా అయిపోయింది. దీన్నంతా గమనిస్తూ టైమ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ టైగర్, దానికి బెజవాడ టూర్ ను వేదిక చేసుకున్నారు.
బెజవాడలో మల్ బార్ గోల్డ్ వారి వెడ్డింగ్ జ్యూయలరీ కార్యక్రమంలో జూనియర్ ఇవాళ పాల్గొననున్నారు. శుక్రవారం విశాఖలోనూ ఇదే తరహా కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఎక్కడా ఎలాంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమం జరిగిపోయింది. కానీ, విజయవాడ విషయానికి వచ్చే సరికి జూనియర్ ప్లాన్ మార్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ దాకా పెద్ద ఎత్తున అభిమానాల ర్యాలీతో రాబోతున్నారు. దాదాపు నాలుగువందలకు పైగా బైక్స్, కార్లు ఈ ర్యాలీలో పాల్గొననున్నాయి. దీనికోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఇక్కడే అసలు గొడవ మొదలవుతోంది. ఎన్టీఆర్ యాత్రలో ఎక్కడా బాలయ్య ఫోటో గానీ, టీడీపీ సింబల్ గాని లేకుండా జాగ్రత్త పడ్డారు. దారిపొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ పేరు గానీ, బాలయ్య పేరు గానీ ఎక్కడా వినిపించకూడదని అభిమానులకు ఆదేశాలు జారీ చేశారట ఎన్టీఆర్. దీంతో, ఇది కంప్లీట్ గా ఎన్టీఆర్ షోగానే జరగనుంది. ఈ దెబ్బతో తనకంటూ ప్రత్యేకంగా ఎంత బలం ఉందో నిరూపించుకోవాలనుకుంటున్నారు జూనియర్. అటు బాలయ్య కూడా ఈ టూర్ పై పెద్దగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలెవరూ జూనియర్ ర్యాలీ లో పాల్గొనడానికి వీల్లేదంటూ ఆర్డర్ వేశారట ఆయన. ఇంతకాలం తమ పేరుతోనే నెట్టుకొచ్చిన తారక్ కు సొంతగా ఎంత బలం ఉందో ఈ దెబ్బతో తేలిపోతుందంటున్నారట బాలయ్య. అటు పార్టీకి, ఇటు జూనియర్ కు సన్నిహితంగా ఉండేవాళ్లు మాత్రం ఇప్పుడు ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకుంటున్నారు. కొంతమంది కీలక నేతలు ఎందుకొచ్చిన గొడవంటూ, బెజవాడలో లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
బెజవాడలో జరుగుతున్న నందమూరి వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారోనని అటు బాలయ్య, ఇటు జూనియర్ ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి