9, ఫిబ్రవరి 2013, శనివారం
షిండే ఆనాటి మాటల వెనుకున్న లెక్క ఇదేనా!
Categories :
afzal guru . death . hindutva terrorism . POLITICS . shinde . TOP
రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరులే అంటే.. ఇదే కాబోలు. పైకి మాట్లాడేది ఒకటైతే.. లోపల జరిగేది మరొకటి. మన రాజకీయాలను, మన పొలిటికల్ లీడర్లను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. తాజాగా అఫ్జల్ గురును ఉరి తీసే విషయంలోనూ ఇదే జరిగింది. హిందుత్వ ఉగ్రవాదంపై కామెంట్లు చేసి.. దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించిన షిండే.. అదే సమయంలో ఆఫ్జల్ గురును ఉరి తీసే ఫైల్పైనా సంతకం చేయడమే... యూపీఏ పొలిటికల్ స్ట్రాటజీకి అద్దం పడుతోంది.
పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి సూత్రధారి ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష వ్యవహారాన్ని చాపకిందనీరులా చక్కబెట్టారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడంకోసం మరో తేనెతుట్టెను కదిపారాయన. ఆఫ్జల్ గురు కు క్షమాభిక్ష తిరస్కరిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న జనవరి 21కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతకు ముందు మూడు రోజుల పాటు, జైపూర్లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబర్ను నిర్వహించింది. చివరి రోజు అంటే.. జనవరి 20న షిండే హిందుత్వ ఉగ్రవాదంపై వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త దుమారాన్ని సృష్టించారు. బీజేపీ , ఆరెస్సెస్లు ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నాయని, హిందుత్వ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయనీ చింతన్ శిబిర్లో ఆరోపించారు షిండే. పైగా, నిఘా వర్గాల సమాచారమూ తమ దగ్గర ఉందని దాన్ని సమర్థించుకున్నారు.
షిండే వ్యాఖ్యలపై హిందుత్వవాదులు విరుచుకుపడ్డారు. ఆర్ఎస్సెస్, బీజేపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. షిండేను పదవినుంచి దింపాలంటూ డిమాండ్ చేశాయి. జైపూర్లో హిందుత్వ ఉగ్రవాద చిచ్చు రగిలించి.. ఢిల్లీకి చేరుకున్న షిండే.. చాలా ప్రశాంతంగా జనవరి 21న ఆఫ్జల్ గురును ఉరితీయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. ఫైల్పై సంతకం చేసి రాష్ట్రపతికి పంపించారు.
హిందుత్వ ఉగ్రవాదం విమర్శలు చేసిన మరుసటి రోజే.. ఆఫ్జల్ గురును ఉరి తీయాలని షిండే ఎందుకు డిసైడ్ అయ్యారన్నదే ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఆఫ్జల్ గురును ఉరితీయాలని ముందే డిసైడ్ అయిన షిండే, ఆ పని చేస్తే, మైనార్టీల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే, దేశంలో హిందుత్వ ఉగ్రవాదం రాజ్యమేలుతోందంటూ విమర్శలు చేశారు. అటు హిందుత్వ ఉగ్రవాదం ఉందని ప్రకటించడం.. ఇటు ఆఫ్జల్ గురును ఉరి తీయమని సంతకం చేయడం.. రెండింటికీ లెక్క సరిపోయిందనుకున్నారాయన. హిందుత్వ ఉగ్రవాదంపై మాట్లాడినందుకు మైనార్టీల్లోనూ.. ఆఫ్జల్ను ఉరితీయడం వల్ల మిగిలిన వర్గాల్లోనూ కాంగ్రెస్కు ఇమేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు షిండే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి