9, ఫిబ్రవరి 2013, శనివారం
ఆఫ్జల్ గురును ఉరి తీశారు
Categories :
afzal guru . death centence . hang . news . terrorist . tihar jail . TOP
పార్లమెంట్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్జల్ గురును ఎట్టకేలకు ఉరి తీశారు. ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లో ఉన్న ఆఫ్జల్ గురును, అదే జైల్లో ఉరి తీశారు. ఉరిశిక్ష అమలు విషయం తెలుసుకుని గురు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందారు. అతని మృతదేహాన్ని తమకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఆఫ్జల్ గురును బయటెక్కడ ఖననం చేసినా, అది తీవ్రవాదులకు, మతోన్మాదులకు పవిత్రస్థలంగా మారిపోతుందని, ఉగ్రవాదులను మరింతగా రెచ్చగొడుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే, కసబ్ తరహాలోనే తీహార్ జైల్లోనే ఓ ప్రాంతంలో ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. కసబ్ వ్యవహారంలానే ఈ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యవహరించింది. కసబ్ కు క్షమాభిక్ష ఇవ్వకూడదని కేంద్ర హోంశాఖ నిర్ణయించుకున్నప్పటి నుంచి.. దానికి రాష్ట్రపతి ఆమోదం.. జైలు అధికారులకు ఆదేశాలు.. చివరకు ఉరిశిక్ష అమలు వరకూ చిన్న విషయాన్ని కూడా బయటకురాకుండా జాగ్రత్త పడింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
కేసు పూర్వాపరాలు
డిసెంబర్13, 2001 లో పార్లమెంట్ పై దాడికి జైషే -ఈ - మహమ్మద్ టెర్రరిస్ట్ అయిన ఆఫ్జల్ గురు కుట్ర పన్నాడు. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు డిసెంబర్ 18, 2002న ఉరి శిక్ష విధించింది. అక్టోబర్ 29, 2003న ఢిల్లీ హైకోర్టు దీన్ని సమర్థించింది. ఉరిశిక్షను రద్దుచేయాలన్న అప్పీల్ ను సుప్రీంకోర్టు ఆగస్టు 4, 2005న తిరస్కరించడంతో.. ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష ఖరారయ్యింది. అయితే.. దాదాపు ఏడేళ్ల పాటు దీనిపై నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఇటీవల కసబ్ ను ఉరితీసిన ప్రభుత్వం.. గురు వ్యవహారంలోనూ నిర్ణయం తీసుకుంది. ఉరి తీయాలన్న ఫైల్ ను రాష్ట్రపతికి జనవరి 21న పంపించింది కేంద్ర హోంశాఖ. ఫిబ్రవరి 3న దీనిపై సంతకం చేశారు ప్రణబ్ ముఖర్జీ. అప్పటినుంచి ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన కేంద్రం.. ఫిబ్రవరి 9న ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లోనే ఆఫ్జల్ గురును ఉరి తీసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి