18, ఫిబ్రవరి 2013, సోమవారం
కేసీఆర్ ఫ్యామిలీ ప్లానింగ్
తెలంగాణ వాదంతో ఉద్యమకారులకు తాను చెప్పిందే వేదంగా మార్చుకున్న కేసీఆర్ కు అంతా బాగానే ఉంటున్నా, ఎన్నికల సమయంలోనే పరిస్థితి తారుమారు అవుతోంది. ప్రధాన ఎన్నికల్లో ఆశించినంతగా ఫలితాలను రాబట్టుకోలేకపోతోంది టీఆర్ఎస్. ఎన్నికల వరకూ కాంగ్రెస్ తెలంగాణ విషయాన్ని తేల్చేలా కనిపించకపోవడంతో ..టీఆర్ఎస్ కు వచ్చే సీట్ల ఆధారంగానే రాష్ట్ర భవిష్యత్ ఉండే అవకాశాలున్నాయి. ఈసారి ఉద్యమం తారాస్థాయిలో సాగిన నేపథ్యంలో, కేంద్రం మాట మార్చిన నేపథ్యంలో టీఆర్ ఎస్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు పైకైతే చెబుతున్నారు గానీ, గతాన్ని తలచుకొని లోలోన ఆందోళనకూ గురవుతున్నారు.
పైగా, ఈ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి, తన ఫ్యామిలీ మొత్తాన్ని పాలిటిక్స్ లో సెట్ రైట్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కుమారుడు కేటీఆర్ ను ఎమ్మెల్యేను చేసుకున్న ఆయన, ఈ సారి కొడుకును, కూతుర్ని ఎంపీలుగా చూడాలనుకుంటున్నారు. దానికి ఇప్పటి నుంచే వేదిక సిద్ధం చేస్తున్నారు.
అందుకే ఈసారి అసెంబ్లీ సీట్ల సంగతి ఎలా ఉన్నా, పార్లమెంట్ సీట్లను మాత్రం కచ్చితంగా ఎక్కువ మొత్తంలో దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ప్రాంతాన్ని మారుస్తున్న కేసీఆర్, ఈ సారి కూడా మహబూబ్ నగర్ నుంచి మరో సీటుకు వలసవెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నల్గొండ నుంచి గానీ, జహీరాబాద్ నుంచి గానీ పోటీ చేయడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డిని పోటీకి దించే సూచనలున్నాయి. అటు మెదక్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయశాంతిని భువనగిరికి పంపొచ్చు. కరీంనగర్ నుంచి కేటీఆర్, నిజామాబాద్ నుంచి కవిత, వరంగల్ నుంచి విజయరామారావులను పోటీ చేయించే అవకాశాలున్నాయి. పొలిటికల్ జేఏసీలో కీలకపాత్ర పోషిస్తున్న టీఆర్ ఎస్ సానుభూతి పరులకు కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నుంచి కొంతమంది తెలంగాణ ఎంపీలు టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు ఉండడంతో, వారికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలనే కేటాయింటే అవకాశాలున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి