21, ఫిబ్రవరి 2013, గురువారం
తప్పైపోయిందన్న కేంద్ర హోంమంత్రి షిండే
నెల రోజుల క్రితం జైపూర్లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్లో ఆవేశంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి షిండే ఎట్టకేలకు మెట్టుదిగారు. బీజేపీ, ఆరెఎస్సెస్ శిబిరాలు హిందూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, దీనిపై తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందన్న షిండే.. బడ్జెట్ సమావేశాలకు ముందు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఏదో ఓ మతానికి ముడిపెట్టడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడినవారికి పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ.. ఓ లేఖను విడుదల చేశారు షిండే.
నెలరోజులగా ఈ విషయంపై నోరు మెదపకుండా ఉన్న హోంమంత్రి ఇప్పుడు సడన్గా పశ్చాతాప పడడానికి పెద్ద కారణమే ఉంది. బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం కోసం లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తింది. షిండే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్. తమ పార్టీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంటే, తనను, తమ పార్టీ ఎంపీలను సభలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవాలన్నారామె. అఖిలపక్ష సమావేశం పూర్తైన తర్వాత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్, సుష్మాస్వరాజ్తో ప్రత్యేకంగా సమావేశమై సంధియత్నాలు చేశారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో షిండే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సభలో ఇదేవిషయంపై ఆయన ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
హిందూ ఉగ్రవాద వ్యాఖ్యలపై షిండే చింతిస్తున్నానని ప్రకటించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. హోంమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. వివాదం పరిష్కారం కావడంతో, బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని పేర్కోంది కమలం పార్టీ. షిండేకు, బీజేపీకి మధ్య వివాదం పరిష్కారం కావడంపై ఎన్డీఏ పక్షాలు కూడా సంతృప్తిని వ్యక్తం చేశాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి