27, ఫిబ్రవరి 2013, బుధవారం
పదేళ్లలో పదింతలు పెరిగిన వెంకన్న సంపద
Categories :
divotional . lord balaji . news . tirumala . tirupati . TOP . ttd . venkanna
సిరిగలవాడికి సంపద సమకూరునన్నట్లు.. లక్ష్మీ దేవిని హృదయాంతరాళాల్లో బంధించిన, వడ్డీకాసుల వాడి ఆదాయం వడివడిగా పెరుగుతోంది. భక్తులు ఇచ్చే కానుకలతో పాటు బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న సంపద పదేళ్లతో పోల్చితే గణనీయంగా పెరిగింది. అంతేకాదు.. డిపాజిట్ల రూపంలో ఉన్న శ్రీవారి సంపద ఏకంగా ఐదువేల కోట్లను దాటేసింది. 2002 నాటికి ఇది కేవలం 629 కోట్లు మాత్రమే కావడం విశేషం.
శ్రీవారి ఆదాయాభివృద్ధి పద్దులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి తాజాగా వెల్లడించింది. ప్రధానంగా సామాన్యభక్తులు సమర్పించే ముడుపులు, కానుకలు నగదు రూపంలో ఉన్నవి ఎప్పటికప్పుడు జాతీయ బ్యాంకుల్లో జమ అవుతుంటాయి. ఇలా స్వామి ఆదాయం రూ.లక్షల్లో ఉన్న 1950వ దశకం నుంచే దేవస్థానం నిధులు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.
2002-03లో రూ.629 కోట్ల పెట్టుబడులు ఉండగా, ఇది ఆ ఏడాది వచ్చిన వడ్డీ, తాజా పెట్టుబడులు కలుపుకుని రూ.740.81 కోట్లకు చేరింది. 2005-06 నాటికి ఇవి వెయ్యికోట్లను దాటాయి. ప్రస్తుతం ఈ పెట్టుబడులు, డిపాజిట్లు 2012-13 బడ్జెట్లో రూ.4,674 కోట్లయ్యాయి. వడ్డీ, తాజా పెట్టుబడి రూ.533 కోట్లు కలుపుకుని రూ.5,207 కోట్లకు శ్రీవారి పెట్టుబడులు చేరాయి. రానున్న ఆర్ధిక సంవత్సరంలో మరో వంద కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని టీటీడీవర్గాలు అంచనావేస్తున్నాయి. శ్రీవారి దూకుడు చూస్తుంటే, వచ్చే రెండుమూడేళ్లలోనే ఈ సంపద పదివేల కోట్లు దాటిపోయేలా కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి