10, ఫిబ్రవరి 2013, ఆదివారం
అదంతా మోడిని తట్టుకోవడానికేనా..?
Categories :
afzal guru . congress . election . hang . modi . POLITICS . rahul gandhi . sonia . TOP
మొన్న కసబ్.. నిన్న ఆఫ్జల్ గురు.. ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారు చేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఎవరూ ఊహించని దూకుడును ప్రదర్శిస్తోంది. ఉరిశిక్షల విషయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పైళ్ల దుమ్ము దులుపుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్న సమయంలో మైనార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాహసోపేతమైన చర్యే. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టైనా సరే మైనార్టీలకు కొమ్ము కాయడమే లౌకికవాదమనుకునే కాంగ్రెస్ ఇంతటి తెంగుపు ప్రదర్శిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అసలు యూపీఏ ఇంత సాహసాన్ని ఎందుకు ప్రదర్శిస్తోంది..?
జైపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో రాహుల్ ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసింది సోనియా. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థని ప్రకటించినట్లయ్యింది. అటు గుజరాత్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన నరేంద్రమోడి బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఎదుగుతున్నాడు. దేశంలోని హిందూసంస్థలన్నీ మోడీ పేరునే బలపరుస్తున్నాయి. వీహెచ్ పీ ఆరెస్సెస్ లాంటి సంస్థలూ బీజేపీపై ఈ విషయంలో వత్తిడి తెస్తున్నాయి. బీజేపీలో దీనిపై భిన్నవాదనలు ఉన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే మోడిమంత్రం జపించక తప్పని పరిస్థితి. ప్రస్తుతం దేశంలో మోడికి ఉన్న పాపులారిటీ, మరే లీడర్ కు లేదన్నది వాస్తవం. మీడియా జరుపుతున్న సర్వేల్లోనూ ప్రధాని అభ్యర్థిగా మోడినీ ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ కూడా మోడి కన్నా వెనుకబడే ఉన్నారు. సరిగ్గా ఇదే కాంగ్రెస్ పై ప్రభావం చూపించి ఉండొచ్చు.
చిన్న చితకా పార్టీలు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తప్పిస్తే, దేశవ్యాప్తంగా మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఇక బీజేపీకి ప్రధాన బలమైన హిందుత్వ ఓటు బ్యాంకును కొల్లగొడితే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలిచి, రాహుల్ ను ప్రధానిని చేసే అవకాశాలు రాకపోవచ్చు. పైగా, ఆఫ్జల్ గురు వ్యవహారాన్ని, హిందుత్వ ఉగ్రవాదం విషయాన్ని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అస్త్రంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే, బీజేపీకి ఆ అవకాశం లేకుండా చేయడానికే, ప్రభుత్వం హడావుడిగానే ఆఫ్జల్ గురును ఉరితీసినట్లు తెలుస్తోంది. దేశభద్రతకు సవాల్ విసురుతున్న ఉగ్రవాదంపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తామని ఈ రకంగా ఎన్నికలకు ముందు చెప్పుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.
హిందూ ఓట్లను ఆకర్షించడానికే కాంగ్రెస్ ఆఫ్జల్ గురును ఉరి తీయించి ఉండొచ్చనడానికి కళ్లముందే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 2006 లో ఆఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆయన భార్య రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకుంది. కానీ, అంతకు ముందు నుంచి పెండింగ్లో ఉన్న వాటిపై నిర్ణయం తీసుకోకుండానే, ఈ ఫైల్ ను క్లియర్ చేయశారు. వాటిలోనూ ముఖ్యంగా రాజీవ్ గాంధీ హంతకులు ఉండడం గమనార్హం. భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష పడ్డ మురుగన్, శాంతన్, అరివులకు.. 1999 మే నెలలో సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రెండువేల సంవత్సరంలో మెర్సీ పిటిషన్ను వీరు పెట్టుకున్నారు. ఈ కేసులో ఫైనల్ రికమండేషన్ను హోంశాఖ జూన్ 21, 2005న పంపించింది. ఈ పైల్ పెండింగ్ లోనే ఉంది. ఇక 1993 సెప్టెంబర్లో ఢిల్లీలో బాంబులు పేల్చిన ఖలిస్తాన్ (సిఖ్) తీవ్రవాది దేవిందర్ పాల్ సింగ్కు డిసెంబర్ 2002 లో సుప్రీం మరణశిక్ష విధించింది. 2003లో కరుణించమంటూ రాష్ట్రపతిని ఆయన వేడుకున్నాడు. ఆగస్టు 9, 2005న హోంశాఖ నుంచి సిఫార్సులు అంచాయి. అయినా.. ఈ ఫైల్కూ మోక్షం కలగలేదు. గంధపుచెక్కల దొంగ వీరప్పన్ అనుచరుడు సైమన్, మరో ముగ్గురుకి 2004 జనవరి 29న ఉరిశిక్ష పడింది. అదే ఏడాది రాష్ట్రపతిని శిక్ష తగ్గించమని ఆశ్రయించారు. 2005 మే2న హోంశాఖ ఈ ఫైల్ను రాష్ట్రపతి సెక్రటేరియెట్కు పంపించింది. దీన్ని కూడా పెండింగ్లోనే పెట్టారు. ఈ తీవ్రవాదులనందరినీ పెండింగ్ లో పెట్టి ఆఫ్జల్ గురు ఉరిపైనే నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి, యూపీఏ వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. కేవలం హిందువుల ఓట్లు సంపాదించడానికే ఈ ప్రయత్నం చేసిందనుకోవచ్చు. అలా కాదనుకుంటే, ఎన్నికల్లోగానే మిగిలిన వారి ఉరిశిక్షలపైనా రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి