25, జనవరి 2013, శుక్రవారం
బాబు గతేమిటి..?
తెలంగాణపై ఎప్పటిలానే కాంగ్రెస్ పార్టీ తప్పించుకొంటోంది. నెల రోజులంటూ తమకు తామే విధించిన గడువును కూడా హేళన చేస్తూ, మాటమార్చేసింది. ఇప్పుడు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందో లేదో తెలియడం లేదు. వీలైనంతవరకూ వచ్చే ఎన్నికలదాకా ఇదే సందిగ్ధతను కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గించడానికే, కాంగ్రెస్ హైకమాండ్ వరస భేటీలను నిర్వహిస్తుందే తప్ప, నిర్ణయం తీసుకోవడానికి కాదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పైగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదంటున్నారు.
తెలంగాణలో పాదయాత్ర చేస్తూ, అఖిలపక్షానికి లేఖ పంపించిన చంద్రబాబు, తెలంగాణ ఏర్పాటుకు తనకు అభ్యంతరం లేదనే చెప్పారు. అఖిలపక్షంలో అన్ని పార్టీలు తెలంగాణకే మద్దతు ఇస్తాయి కాబట్టి, కాంగ్రెస్ పార్టీనే ఇరుకున పడుతుందని ఆయన భావించిఉండొచ్చు. తొలిదశలో అదే జరిగింది. కానీ, తమదైన శైలిలో రాజకీయాలను రక్తి కట్టించే కాంగ్రెస్ నేతలు సీన్ మొత్తాన్ని మార్చేశారు. ఇటు చంద్రబాబు పాదయాత్ర కోస్తా జిల్లాల్లోకి అడుగుపెట్టింది. అటు విభజన విషయంపై మరింత ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ నేతలంతా సమైక్య ఉద్యమమంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేసి, జనంలో పేరు తెచ్చుకుంటుంటే, అధినేత మాటకు కట్టుబడ్డ తెలుగు తమ్ముళ్లు మాత్రం మౌనంగానే అంతా చూడాల్సి వస్తోంది. రాష్ట్రాన్ని చంద్రబాబు విభజించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు రాష్ట్ర విభజన జరగకపోతే తెలంగాణలో టీడీపీకి మైలేజీ రావడం కష్టమే, ఉద్యమాన్ని సాకుగా చేసుకుని టీఆర్ ఎస్ ఎక్కువ స్థానాలను దక్కించుకోవచ్చు. ఇటు సీమాంధ్రలోనూ కాంగ్రెస్ కే మైలేజీ దక్కొచ్చు. సెంటిమెంట్ తో జగన్ పార్టీ కూడా భారీగానే స్థానాలు దక్కించుకోవచ్చు. అటు ఇటూ చూస్తే.. అడకత్తెరలో పోకచక్కలా ఇరుక్కుపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీనే అనేవాదన వినిపిస్తోంది. ఇప్పటికే అధికారంలోకి రావడానికి అష్టకష్టాలు పడుతున్న చంద్రబాబునాయుడు, ఈ విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో మరి..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి