24, జనవరి 2013, గురువారం
చేసిందంతా కేవీపీనే
రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు కుమ్మరించింది అధిష్టానం. ఇప్పటికిప్పుడు ఈ సమస్యను తేల్చలేమని, దానికి మరింత సమయం పడుతుందంటూ ప్రకటించింది. ఎప్పటివరకూ తేల్చతారో కూడా చెప్పకుండా అనిశ్చితిని మరింతగా పెంచేసింది. ఈనెల 28 కల్లా తేల్చేస్తామని ప్రకటించిన కేంద్రమే, ఇప్పుడు తాజాగా మాటమార్చడం వెనుక సీమాంధ్ర నేతల లాబీయింగ్ బలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. అందులోనూ.. సీమాంధ్ర నేతల లాబీయింగ్ పనిచేయడం వెనుక...వైఎస్ ఆత్మగా పేరొందిన కేవీపీ రామచంద్రరావే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
సీమాంధ్రనేతలు ఢిల్లీకి రాగానే ప్రధాని అపాయింట్ మెంట్ దొరికింది, రాష్ట్రపతి నుంచీ కబురొచ్చింది. తాజాగా రాహుల్ కూడా వారితో భేటీకి సమయం కేటాయించారు. మిగిలిన హైకమాండ్ పెద్దలు కూడా సీమాంధ్ర నేతల వాదనలు సావధానంగా విన్నారు. అదే సమయంలో ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ మంత్రులకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదు, రాష్ట్రపతి నుంచి కూడా ఎలాంటి పిలుపు రాలేదు. రాహుల్ సంగతి సరేసరి. ఈ విషయంలో తెలంగాణ నేతలపై సీమాంధ్ర నేతలు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సీమాంధ్ర నేతలకు, తెలంగాణ నేతలకు మధ్య ఉన్న తేడా అల్లా.. కేవీపీ రామచంద్రరావే.
సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో పెద్దల అపాయింట్ మెంట్లన్నీ ఫిక్స్ చేయించింది కేవీపీనే. గతంలో కావూరి ఈవిషయంలో కీలక పాత్ర పోషిస్తే, ఈసారి అన్నీ తానై నడిపించారు కేవీపీ. అధిష్టానం దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి, సీమాంధ్ర నేతల వాదనలను వినిపించేలా చేశారు. తద్వారా రేపోమాపో వచ్చేస్తుందనుకున్న తెలంగాణ ప్రకటనకు అడ్డుకట్ట వేయగలిగారు. షిండే నెలరోజుల గడువు తర్వాత, ఏదో ఓ స్పష్టమైన ప్రకటన వస్తుందని చూసిన రాష్ట్ర ప్రజలందరికీ, తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన పూర్తి నిరాశనే కలిగించిదని చెప్పాలి. కనీసం స్పష్టమైన కాలవ్యవధిని ప్రకటించినా పరిస్థితి మరోలా ఉండేది. ఓ రకంగా కాంగ్రెస్ తీరు చూస్తుంటే తెలంగాణ అంశాన్ని తేల్చకుండా, సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి