23, జనవరి 2013, బుధవారం
తెలంగాణపై మళ్లీ కాంగ్రెస్ మోసం చేస్తోందా..?
త్వరలోనే తెలంగాణపై నిర్ణయం వచ్చేస్తోందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవారందరిపై కాంగ్రెస్ హైకమాండ్ నీళ్లు జల్లింది. హోంమంత్రి సుశీల్ కుమార్ చెప్పినట్లు నెల రోజుల గడువులోగా.. అంటే ఈ నెల 28లోగా తెలంగాణ సమస్యను తేల్చలేమని చెప్పేసింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పెద్దలతో సమావేశమైన సోనియాగాంధీ.. తెలంగాణ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో.. సమావేశం ముగియగానే బయటకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్.. తెలంగాణ లాంటి సున్నిత అంశాన్ని నెలరోజుల్లోగా తేల్చలేమని చెప్పారు. అంతేకాదు, హోంమంత్రి విధించిన గడువును తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. వారం అంటే ఏడు రోజులు కాదని, నెలంటే 30 రోజులు కాదని, గడువుకు కొత్త భాష్యం చెప్పారు. తెలంగాణ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తామన్నది కూడా చెప్పలేమన్నారు. దీంతో, ఢిల్లీలో మోహరించిన సీమాంధ్రనేతలు, తెలంగాణ నేతల్లో ఉత్కంఠ ఏర్పడింది. ఓ రకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా హైకమాండ్ వ్యవహరిస్తోందంటూ సీమాంధ్ర నేతలు సంబరపడుతున్నారు. ఇదంతా, సీమాంధ్ర నేతలు చేసిన లాబీయింగ్ కుట్రేనంటూ విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అటు కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణను కాంగ్రెస్ తేల్చదని, అఖిలపక్షం పనికిమాలిందని తాను ఇదివరకే చెప్పానంటూ ప్రకటన ఇచ్చారు కేసీఆర్. అటు ఉద్యమాన్ని ఉధృతం చేయడంపై టీజేఏసీ మంతనాలు జరుపుతోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే, మళ్లీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి