6, డిసెంబర్ 2012, గురువారం
తెలంగాణ విషయంలోనూ ఏకాభిప్రాయానికి అదే అర్థమా?
Categories :
లోక్ సభలో ఎఫ్.డిఐపై ఓటింగ్ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఓ ఊహించని వివరణ ఇచ్చారు. "ఎన్నికైన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. దాన్నెవరూ అడ్డుకోజాలరు. ఏకాభిప్రాయం అంటే ఎక్కువ మంది ఆమోదం పొందడమే కాని ఏకగ్రీవం అని అర్థం కాదు" అన్నారు ఆనంద్ శర్మ. దేశంలోని 18 పార్టీల్లో 14 పార్టీలు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐలను వ్యతిరేకించినా.. కాంగ్రెస్ మాత్రం పట్టుబట్టి, లోకసభనుంచి ఎస్పీ, బీఎస్పీలను పంపించేసి మరీ, ఓటింగ్ లో నెగ్గుకొచ్చింది.
ఇంతవరకూ బాగానే ఉంది, కానీ, దాదాపు నాలుగేళ్లుగా తెలంగాణ విషయంలో సాగుతున్నపోరాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే స్థాయిలో ఎందుకు చొరవ చూపించడం లేదు. ఏకాభిప్రాయం వచ్చే వరకూ తెలంగాణపై నిర్ణయం తీసుకోలేమని చెప్పుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎఫ్.డి.ఐల విషయంలో నిర్వచించిన ఏకాభిప్రాయ అర్థాన్ని.. ఎందుకు ఆపాదించదు. ?
రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 8 పార్టీల్లో ప్రధానంగా తెలంగాణపై ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించాల్సింది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీనే ముందుగా తన నిర్ణయాన్ని(ఎఫ్.డి.ఐ ల తరహాలో) ప్రకటించాలి. తెలుగుదేశం పార్టీ కూడా రెండు సిద్ధాంతాలను కట్టిబెట్టి ఏదో ఓ సిద్ధాంతాన్నే నమ్ముకోవాలి. పాము చావకుండా, కర్ర విరగకుండా అన్న రీతిలో వ్యవహరిస్తే, వచ్చే ఎన్నికల్లో అందుకు తగిన పాఠాన్నే నేర్చుకోవాల్సి వస్తుంది. ఎనిమిది పార్టీల్లో టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు స్పష్టంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణకు స్పష్టంగా వ్యతిరేకంగా ఉన్నది సీపీఎం ఒక్కటే. వైఎస్సార్ సీపీ, లోక్ సత్తాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటున్నాయి. ఎంఐఎం రాయల తెలంగాణకు ఓకే అంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకే ఎక్కువ మెజార్టీ ఉన్నట్లు.
ఏకాభిప్రాయమంటే లోక్ సభ సాక్షిగా కేంద్రమంత్రి ఇచ్చిన వివరణకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కట్టుబడి ఉండాలి. డిసెంబర్ 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో వచ్చే అభిప్రాయాల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించారు. అన్ని పార్టీలు ఒప్పుకుంటాయని కాకుండా, రాష్ట్ర విభజనకు మెజార్టీ ఉందా లేదా అనే లెక్కచూడాలి. ఈ విషయంలో అటు తెలంగాణ ఎంపీలు, తెలంగాణకు మద్దతు పలుకుతున్న బీజేపీ, అనుకూలంగా వ్యవహరిస్తామంటున్న టీడీపీ, వైఎస్సార్ సీపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఎన్నికైన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే హక్కుందని, దాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాబట్టి, తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి