6, డిసెంబర్ 2012, గురువారం
బాబు, జగన్ ఇరుక్కుపోయారా..?
తెలంగాణపై ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న అఖిలపక్ష సమావేశాన్ని డిసెంబర్ 28న ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఏం చెబుతుందన్నది పక్కన పెడితే, ఇప్పుడు అతిపెద్ద సమస్య టీడీపీ, వైఎస్సార్ సీపీలకే. అఖిలపక్ష సమావేశాన్ని పెడితే, తమ పార్టీ తరపున ఒక్కరినే పంపి స్పష్టమైన అభిప్రాయం చెబుతామంటూ పాదయాత్రకు ముందే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాద్యత ఆయనపై ఉంది. మాట తప్పుదామంటే, తెలంగాణలో పాదయాత్ర చేస్తూ చంద్రబాబు ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లో సాగుతున్న ఆయనయాత్ర డిసెంబర్ 28 నాటికి ఇంకా తెలంగాణలోనే కొనసాగే అవకాశం ఉంది. అలాంటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అఖిలపక్షంలో నిర్ణయం ప్రకటిస్తే, పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అటు చంద్రబాబు రూట్లోనే పాదయాత్ర చేసుకొస్తున్న షర్మిల కూడా ఆ సమయానికి తెలంగాణలోనే ఉండొచ్చు. వైఎస్సార్ సీపీ కూడా అఖిలపక్షంలో సమైక్యమంటే, ఇక్కడ యాత్రకు బ్రేక్ వేయాలి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తెలంగాణలో పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదు. దీన్ని టీఆర్ఎస్ సొమ్ము చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. లేదంటే షర్మిల కోసం జగన్ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటిలానే, టీడీపీ వైఖరి స్పష్టం చేశాకే తాము చెబుతామంటూ తప్పించుకోవచ్చు. నెపాన్ని టీడీపీ, వైఎస్సార్ సీపీలపైకి నెట్టేయవచ్చు. ఒకవేళ తెలంగాణకు ఈ రెండు పార్టీలు అనుకూలంగా వ్యవహరిస్తే, ఆ తర్వాత సీమాంధ్రలో సాగే పాదయాత్రల పరిస్థితి ఏమిటన్నది సందేహమే. ఏ రకంగా చూసినా అటు జగన్, ఇటు చంద్రబాబులకు ఇప్పుడు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి