రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశానికి ముందు కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అఖిలపక్ష సమావేశాన్ని టార్గెట్ చేసుకుని అటు టీఆర్ ఎస్ , ఇటు తెలంగాణ జేఏసీలు పావులు కదుపుతున్నాయి. షిండేతో జరిగే సమావేశంలో ఒకే అభిప్రాయాన్ని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నాయి. అటు పాదయాత్రలు తెలంగాణలో సాగుతుండడంతో టీడీపీ, వైఎస్సార్ సీపీలు కూడా రాష్ట్రవిభజనకు సానుకూలంగానే చెప్పే అవకాశం ఉంది. అఖిలపక్షంలో ఏం చెబుతామన్నది చెప్పకపోయినా.. సమావేశానికి ఒక్కరినే పంపిస్తామని, తమ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే.. స్వయంగా చంద్రబాబే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని టీడీపీలోని తెలంగాణ ప్రాంత నేతలు కోరుతున్నారు. అటు టీఆర్ఎస్ కూడా దీన్నే డిమాండ్ చేస్తోంది. అయితే.. చంద్రబాబు మాత్రం ఇంతవరకూ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు.
వైఎస్సార్ సీపీ కూడా అఖిలపక్షంలో తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతామంటోంది. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీనే. అఖిలపక్షంలో కార్నర్ అయ్యేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని తెలుస్తోంది. కాంగ్రెస్ వైఖరి చెప్పకుండా, మిగిలిన పార్టీల అభిప్రాయం కోరడం సరికాదని అన్ని పార్టీలు వాదిస్తున్నాయి. మిగిలిన పార్టీలో అఖిలపక్షంలో చెప్పాల్సిన విషయంపై కాస్త స్పష్టత వచ్చినా.. కాంగ్రెస్ లో మాత్రం ఈ విషయంపై పెద్ద వాగ్వాదమే జరుగుతోంది. మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో రగిలిపోతున్న కావూరి.. సీమాంధ్రలో విపరీతంగా పర్యటిస్తున్నారు. విద్యార్థి జేఏసీలు ఏర్పాటు చేస్తున్న సభల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదంటున్నారు. సీమాంధ్ర నేతలంతా కూడా విభజనకు వ్యతిరేకంగానే కనిపిస్తున్నారు. అఖిలపక్షంలో రెండు అభిప్రాయాలు చెప్పాల్సిందేనంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఒక్క అభిప్రాయాన్నే చెప్పాలంటున్నారు. దీంతో అఖిలపక్షంలో కాంగ్రెస్ ఇరుకున పడడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే తప్ప.. రాష్ట్ర నాయకత్వానికి ఈ తలనొప్పి తగ్గేలా లేదు. ఒకవేళ అన్ని పార్టీలు స్పష్టత ఇచ్చి, కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే మాత్రం.. తెలంగాణ ప్రాంతంలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుదన్న వాదన వినిపిస్తోంది.
18, డిసెంబర్ 2012, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి