23, డిసెంబర్ 2012, ఆదివారం
ఆ నమ్మకం లేకే సచిన్ రిటైర్ అయ్యాడా..?
క్రికెట్ నుంచి తనరిటైర్మెంట్ పై కొన్నాళ్లుగా సాగుతున్న చర్చకు తెరదించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే సచిన్ టీట్వంటీలు ఆడడం లేదు. దీంతో ఇకపై సచిన్ పూర్తిగా టెస్ట్ క్రికెట్ కే పరిమితం కానున్నాడు. కొంతకాలంగా వన్డేల్లోనూ, టెస్టుల్లో సచిన్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ సచిన్ ఏమాత్ర రాణించలేదు. దీంతో ప్రస్తుతానికి వన్డేల నుంచి రిటైర్ అయ్యి.. టెస్ట్ క్రికెట్ పైనే దృష్టి పెట్టాలని సచిన్ భావించినట్లు తెలుస్తోంది. అయితే.. పాకిస్తాన్ తో మరికొన్ని రోజుల్లో జరగనున్న వన్డే సిరిస్ నేపథ్యంలో సచిన్ ఈ ప్రకటన చేయడం సంచలనం కలిగిస్తోంది. చిరకాల ప్రత్యర్థులైన పాక్ తో ఆడకుండానే సచిన్ రిటైర్ అవ్వడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది. 1989లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తోనే సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు.. వన్డేల్లో మరో సెంచరీ చేస్తే.. సెంచరీల హాఫ్ సెంచరీని చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా సచిన్ చరిత్రలో నిలిచిపోయేవాడు. అయితే.. పాక్ సిరీస్ ఈ సెంచరీ సాధిస్తానన్న నమ్మకం లేకపోవడం వల్లే బహుశా సచిన్ రిటైర్ అయ్యి ఉండొచ్చు.
ఇప్పటివరకూ 463 వన్డేలు ఆడిన టెండుల్కర్, 18426 పరుగులు సాధించాడు. 49 సెంచరీలు,96 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ సాధించింది కూడా సచినే. వన్డే రిటైర్మెంట్ ప్రకటనతో మరికొంత కాలమైనా టెస్ట్ క్రికెట్లో ఆడే అవకాశం ఉంటుందని సచిన్ భావిస్తున్నట్లు సమాచారం. సచిన్ నిర్ణయంతో 23ఏళ్ల సుదీర్ఘ వన్డే కెరీర్ ముగిసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి