నిజం నిష్టూరంగా ఉండొచ్చు. చాలామందికి ఇబ్బంది కలిగించవచ్చు. కాని నిజం నిజమే. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు.. తన హయాంలో అందరినీ నీళ్లిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ మద్యం ఇస్తోందని నిజామాబాద్ జిల్లా పాదయాత్రలో అన్నారు. నాదీ నిజామాబాద్ జిల్లానే. మా ఊరి పక్కగానే నిజాంసాగర్ ప్రధాన కాలువ వెలుతుంది. ఆ కాలువ ఆధారం చేసుకునే, వేలాదిమంది రైతులు వరి, చెరుకు, మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేసుకుంటున్నారు. నిజామాబాద్ పట్టణానికి తాగునీరు అందించేది కూడా ఈ కాలువే. బాబుగారు వచ్చాక, నిజాంసాగర్ కాలువ ఎండిపోయింది. ఆయన పాలనలో చివరిరెండు మూడు ఏళ్లలో ఒక్కసారైనా కాలువ విడుదల చేసిన దాఖలాలు లేవు. నిజాం సాగర్ లో పేరుకున్న పూడికను తీయడానికి ప్రయత్నించిన సందర్భాలూ లేవు. గ్రామాలకు గ్రామాలు కరవుతో అల్లాడిపోయాయి. బతుకుదెరువు కోసం జనం వలసబాటలు పట్టారు. నిజాం షుగర్స్ ప్రైవేటీ కరణ పుణ్యమా అని చెరుకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. అంతెందుకు, ఆయన హయాంలోనే గ్రామాల్లోకి మద్య ప్రవాహం మొదలయ్యింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు అది పరవళ్లు తొక్కుతూ వరదలా గ్రామాలను ముంచెత్తుతుందన్నది నిజం. కానీ, గ్రామాల్లో బెల్టుషాపులు మొదలైంది మాత్రం బాబుగారి పాలనలోనే. మహానుభావుడు ఎన్టీఆర్ విధించిన సంపూర్ణ మద్యపాననిషేధాన్ని ఎత్తివేసింది కూడా చంద్రబాబే అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మద్యాన్నే ప్రధాన ఆధారంగా చేసుకుని పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు తిట్టడం ఏమాత్రం తప్పుకాదు. కానీ, ఆయన చేసిందేమిటన్నది కూడా గుర్తు పెట్టుకుంటే మంచిది.
29, నవంబర్ 2012, గురువారం
బాబు మాటలు నిజమేనా..?
Categories :
chandrababu . padayatra . POLITICS . tdp . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి