4, అక్టోబర్ 2012, గురువారం
కేసీఆర్ తొందరపడ్డారా..?
సెప్టెంబర్ నెలాఖరులోగా తెలంగాణ అంటూ వీరలెవల్లో ప్రకటన చేసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం సంగతి అటుంచితే, కనీసం తెలంగాణపై సానుకూల ప్రకటనను కూడా చేయించలేకపోయారు. తనకు స్పష్టమైన సంకేతాలున్నాయని చెప్పుకొంటూ వెళ్లి.. నెలరోజుల పాటు ఢిల్లీలో ఉండి.. వాయలార్ ను, ఆజాద్ ను తప్ప మరొకరిని కలవలేకపోయిన కేసీఆర్.. వట్టి చేతులతోనే తిరిగివచ్చారు. పైగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో కీలకమైన కవాతు జరుగుతున్న సమయంలోనూ ఢిల్లీకే కేసీఆర్ పరిమితమయ్యారు. హైదరాబాద్ లో ఉండి.. కవాతులో చురుగ్గా పాల్గొని ఉంటే, ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా కేసీఆర్ ఇమేజ్ మరింత పెరిగేది. కేసీఆర్ లేకపోతేనే అంత మంది వచ్చినప్పుడు.. కేసీఆర్ ఉంటే మరింత మంది హైదరాబాద్ ను చుట్టుముట్టి ఉండేవారు. కానీ, టీజేఏసీ తీరుపై గుర్రుగా ఉన్న గులాబీ బాస్.. ఢిల్లీ నుంచి కాలు కదపలేదు. తెలంగాణ మార్చ్ సక్సెస్ అవడం, టీఆర్ఎస్ తో పోల్చితే, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీలు యాక్టివ్ గా పాల్గొనడం, తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీలు గుర్తింపు తెచ్చుకున్నాయి. ఓ రకంగా మార్చ్ తో బీజేపీకే ఎక్కువ లాభం చేకూరినట్లు కనిపిస్తోంది. అటు తెలంగాణ తెస్తానని బీరాలు పోయిన కేసీఆర్, ఉస్సూరుమంటూ వెనక్కి రావడాన్ని... బీజేపీ భారీగానే ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఇవ్వాలంటే కేంద్రంలో బీజేపీతోనే సాధ్యమన్న విషయాన్ని కమలనాథులు మరింత గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. అటు మార్చ్ నుంచి లబ్ధి పొందలేక, నెలరోజులు పాటు ఢిల్లీలో ఉండి ఏమీ సాధించలేదన్న రిమార్క్ కేసీఆర్ పై పడింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. కేసీఆర్ అనవసరంగా తొందరపడ్డారనే అనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి