13, అక్టోబర్ 2012, శనివారం
గంగూలీనే ముంచిన ఘనుడు
Categories :
cheating . news . one nation one card . sai kumar . TOP
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నమ్మిమోసపోయాడు. వాట్ యాన్ ఐడియా అంటూ, బ్రాండ్ అబాసిడర్ గా ఉండడానికి ఒప్పుకుని, తన ఇమేజ్ కే మచ్చ తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో జరిగిన మైనార్టీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన చుండూరి సాయి కుమార్, మాస్టర్ ప్లాన్ కు గంగూలీతో పాటు వేలాది మంది నష్టపోయారు.
పైసా పెట్టుబడి లేకుండా 500 కోట్లు సంపాదించాలన్న ఆలోచనతో మొదలైన సాయి స్కెచ్.. చాలా వరకూ పకడ్బందీగా సాగింది. మరో ఐదు నెలల పాటు మైనార్టీ కార్పొరేషన్ ఫిక్స్డ్ డ్ డిపాజిట్ల గురించి పట్టించుకోకపోతే, సాయి కుమార్ ఇండియాలోనే అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకడిగా మారి ఉండేవాడు. అప్పటికి నాలుగైదు వందల కోట్లకు అధిపతి అయ్యేవాడు.
ప్లాన్ సాగిందిలా..!
బేగంపేటలో సాల్వ్ అనే కంప్యూటర్ సంస్థను పెట్టి నిరుద్యోగులను ముంచిన సాయి కుమార్, కోట్లాధిపతి కావడానికి చాలా పెద్ద స్కెచ్చే వేశాడు. మైనార్టీ కార్పొరేషన్లో నిధులపై పెద్దగా నిఘా ఉండదని గ్రహించి.. బ్రోకర్ కేశవరావుతో కలిపి భారీగా నిధులను రాబట్టాడు. ఇందుకోసం కార్పొరేషన్ అధికారులకు ఒక శాతం కమిషన్ ను కూడా చెల్లించాడు. మొత్తం 68 కోట్లకు గానూ.. 68 లక్షల రూపాయలను లంచంగా ఇచ్చారు. ఫిక్స్డ్ డ్ డిపాజిట్లు వచ్చిన తర్వాత అందులో 55 కోట్ల రూపాయలను తమ ఖాతాల్లో మళ్లించారు.
ఈ స్కామ్ అంతా జరిగింది.. వన్ నేషన్ వన్ కార్డ్ అనే సంస్థను ప్రారంభించడానికి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులన్నింటినీ కలిపి ఒకే కార్డుగా మార్చే పద్దతే.. ఈ వన్ నేషన్ వన్ కార్డ్. అంతర్జాతీయ సంస్థ స్థాయిలో దీని కార్యకలాపాలను మొదలుపెట్టారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లోనూ దీని ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేశారు. ఏకంగా గంగూలీనే బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవడంతో, దీనిపై చాలా మందికి గురి కుదిరింది. ప్రచారానికే దాదాపు 6 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాడు సాయి కుమార్. ఈ డబ్బు కూడా మైనార్టీ కార్పొరేషన్ దే.
ఇంత భారీగా ఖర్చు పెట్టడానికి కారణం ఉంది. ఈ బిజినెస్ లో ఎక్కువ కాలం ఉండదలుచుకోలేదు సాయికుమార్. కేవలం తాను ఎదగడానికి ఓ మెట్టుగా మాత్రమే మార్చుకోవాలనుకున్నాడు. గంగూలీ బ్రాండింగ్ ను, భారీ పబ్లిసిటీని చూపించి, వన్ నేషన్ వన్ కార్డ్ సంస్థను దాదాపు 400 కోట్లకు వేరెవరికైనా అమ్మేయాలనుకున్నాడు. దీనికోసం ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నాడు. ఇన్నోవేటివ్ ఐడియా కావడంతో.. చాలా సంస్థలు దీనిపై మక్కువ చూపించినట్లు తెలుస్తోంది.
మిగిలిన డబ్బుల్లో 30 కోట్లతో మహబూబ్ నగర్ జిల్లాలో 200 ఎకరాలను కొనుగోలు చేశారు. కొత్తగా ప్రారంభమవుతున్న న్యూస్ ఛానల్ లో పార్టనర్ షిప్ కోసం 8 కోట్లు చెల్లించారు. తాను చేసే పనులకు మీడియా సపోర్ట్ గా ఉండడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ, ఈ విషయం బయటపడడంతో ఆ ఛానల్ లోని మిగిలిన పార్టనర్లు అవాక్కయ్యారు. సాయికుమార్ చెల్లించిన డబ్బును.. కోర్టులో డిపాజిట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వన్ నేషన్ తో పాటు మరో 16 బోగస్ సంస్థలను పెట్టిన సాయి.. వాటి ద్వారా బ్యాంకుల నుంచి వందకోట్ల రూపాయలను రుణాలుగా పొందడానికి ప్రయత్నించాడు. కానీ, ఇవింకా సక్సెస్ కాలేదు. వన్ నేషన్ సంస్థను అమ్మేసి వచ్చిన డబ్బుతో.. మైనార్టీ కార్పొరేషన్ నుంచి కొల్లగొట్టిన సొమ్మును తిరిగి డిపాజిట్ చేయాలనుకున్నాడు. అది జరిగిపోతే, ఇక స్కామ్ విషయం బయటకు రాదు. తాను పైసా పెట్టుబడి పెట్టకుండానే ఐదు వందల కోట్లు సంపాదించవచ్చు. ఇదీ సాయి ప్లాన్. అంతా బాగానే జరిగింది కానీ, మధ్యలోనే కార్పొరేషన్ అధికారులు డబ్బులు తీసుకోవాలనుకోవడంతో.. సీన్ రివర్స్ అయ్యింది. సాయి బతుకు జైలు పాలయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి