27, సెప్టెంబర్ 2012, గురువారం
మార్చ్ ను మంత్రులే నడిపిస్తారా?
తెలంగాణ మార్చ్ పై ఉత్కంఠ క్షణక్షణానికి పెరిగిపోతోంది. హైదరాబాద్ లో ఒక్కడిని కూడా అడుగుపెట్టనివ్వమని పోలీసులు కరాఖండీగా చెప్పేస్తే, సెప్టెంబర్ 30న ఆరునూరైనా కవాతు చేసి తీరతామని తెలంగాణ జేఏసీ చెబుతోంది. పోలీసులను అనుమతి కోరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మంత్రులే ముందుండి మార్చ్ కు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేసింది. బయో డైవర్సిటీ సదస్సు, నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో మార్చ్ వాయిదా వేసుకోవాలన్న హోంమంత్రి సబితారెడ్డి విన్నపాన్ని జేఏసీ ఇప్పటికే తిరస్కరించింది. దీంతో.. మార్చ్ కు మద్దతు పలకడం మినహా మరో ప్రత్యామ్నాయం మంత్రుల ముందు లేదు
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, మంత్రి సుదర్సన్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. మార్చ్ పరిణామాలను చర్చించారు. తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇస్తే శాంతి యుతంగా జరుగుతుందని భావించిన మంత్రులు.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పాలని చూస్తున్నారు.
మంత్రులొస్తే సమస్యే ఉండదు
ఓ రకంగా మంత్రులే ముందుండి మార్చ్ ను నడిపిస్తే.. ఎలాంటి సమస్యా రాకపోవచ్చు. నక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పై భారీ బందోబస్తు ఎలాగూ ఉంటుంది. శాంతియుతంగా ర్యాలీ చేసుకోమని పోలీసులు తెలంగాణవాదులను వదిలిపెడితే.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే సమస్యే ఉండదు. జిల్లాల నుంచి ఎవరూ రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టం ఎలాగూ చేస్తున్నారు. అలాంటప్పుడు హైదరాబాద్ వాళ్లుతప్ప మిగిలినవాళ్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొంటే వాళ్ల వెనుకే నిరసన కారులు కదులుతారు తప్ప.. ప్రత్యేకంగా ఆందోళనలకు దిగే అవకాశాలు ఉండవు.
నేతలను బలవంతంగా అరెస్టులు చేసినా, లాఠీ ఛార్జీలకు దిగినా, ముళ్లకంపలను అడ్డుగా పెట్టినా పరిస్థితి మరోలా ఉండొచ్చు. ఆ ఆగ్రహంలో ఆందోళనకారులు ఎంతకైనా తెగిస్తారు. మిలియన్ మార్చ్ సమయంలో జరిగింది అదే. ఇప్పుడున్న మార్గం.. మంత్రులే మార్చ్ ను శాంతియుతంగా నడిపించడం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి