9, మే 2012, బుధవారం
సీఎంల ప్రాణాలతో హెలికాప్టర్ల చెలగాటం
Categories :
cm . crash . helicopter . news . TOP
హెలికాప్టర్.. గాల్లో ఎగిరే హెలికాప్టర్.. నేతలను గజగజలాడిస్తోంది.. ఎక్కితే.. త్వరగా గమ్యాన్ని చేరడం సంగతేమో గానీ.. గాల్లో కలిసిపోతామేమోనన్న భయం.. రాజకీయనేతలను వణికిస్తోంది. ముఖ్యంగా.. ముఖ్యమంత్రులకు.. హెలికాప్టర్లకు మధ్య సమ్థింగ్ జరుగుతోంది.. అందుకే.. వరసగా ప్రమాదాలు.. కీలక నేతల మరణాలు.. తాజాగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జార్ఘండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అర్జున్ ముండా, ఆయన భార్య మీరా, మరో ముగ్గురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో టేకాఫ్ కాగానే.. అందులో సాంకేతిక లోపం ఏర్పడింది.. పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగానే.. ఎనిమిది ఫీట్ల ఎత్తునుంచి రన్వే పై క్రాష్ అయ్యింది.. చాఫర్కు నిప్పంటుకోకపోవడంతో.. అందులో ఉన్నవారంతా గాయాలతో బయటపడ్డారు.. కీలకమైన నేతలు ప్రయాణించే హెలికాప్టర్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. అంతేకాదు.. గగనతల ప్రయాణాలను నియంత్రించే DGCA నిర్లక్ష్య వైఖరిని సైతం ఇది ఎత్తిచూపుతోంది.. అర్జున్ ముండా పెనుప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు కానీ.. మరో ఇద్దరు సీఎంలు.. ఇలానే హెలికాప్టర్ల కారణంగా అకాలమృత్యువును చవిచూశారు..
హెలికాప్టర్ల ప్రమాదాల్లోనే అత్యంత దారుణమైంది.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రమాదం. సెప్టెంబర్ 2, 2009న రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ .. ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యల మధ్య చిక్కుకుని.. నల్లమల కొండల్లో కూలిపోయింది. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం సంచలనం సృష్టించింది.
ఈ ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం, DGCA ఎంతో హడావిడి చేసినా.. ఏమాత్రం ఫలితం లేదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తూ.. మరో సీఎం ప్రాణం వదిలారు. ఏప్రిల్ 30, 2011న అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. క్రాష్ కావడంతో.. ఆయన దుర్మరణం పాలయ్యారు. దీంతో హడావిడి పడ్డ DGCA, హెలికాప్టర్ల సేఫ్టీని పర్యవేక్షించాడనికి ఓ స్పెషల్ సెల్ను ఏర్పాటు చేసింది. వాస్తవానికి వైఎస్సార్ను పొట్టన పెట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేసిన బృందం.. ఎన్నో విలువైన సూచనలను చేసింది. ముఖ్యంగా హెలికాప్టర్ల నిర్వహణకు ప్రత్యేక నియమనిబంధనలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తేల్చి చెప్పింది. దేశంలో మొత్తం 263 హెలికాప్టర్లు ఉండగా.. అందులో సగం కూడా పూర్తి స్థాయిలో నిబంధనలను పాటించడం లేదు. ప్రమాద సమయంలో సిగ్నల్స్ అందించే అత్యాధునిక ELTలను అమర్చుకోవడానికి మార్చి30,2010ని డీజీసీఏ డెడ్లైన్గా విధించినప్పటికీ.. దాన్ని పాటించినవి చాలా తక్కువ. అయినా.. DGCA చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాతే.. డోర్జీ ఖండూ ప్రమాదం జరిగింది.
డోర్జీ మరణం తర్వాత కూడా మనవాళ్లలో మార్పు రాలేదు. ఈ ప్రమాదం జరిగిన కొన్నాళ్లకే బిజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. జూన్ 19, 2011న ఉత్తరాఖండ్లో ఆయన్ను వదిలి వెనుదిరిగిన హెలికాప్టర్ కూలిపోయింది. జూన్ 22, 2011న కేంద్ర హోంమంత్రి చిదంబరం శ్రీనగర్ పర్యటనలో హెలికాప్టర్లోని ఓ ఇంజన్ మొరాయించింది. దీంతో.. హఠాత్తుగా హెలికాప్టర్ను ల్యాండ్ చేసి.. మరో దానిలో ఆయన్ను పంపించాల్సి వచ్చింది. నవంబర్ 20, 2011న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెళుతున్న ఛాపర్ రోటరీ బ్లేడ్ డ్యామేజ్ అయ్యింది. పైలెట్ చాకచక్యంగా హెలికాప్టర్ను దించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఏప్రిల్ 16, 2012న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాల్లోకి లేవగానే.. డోర్లు తెరుచుకున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండిగ్ సేఫ్గా జరగడంతో.. చౌహాన్ ప్రాణాలతో బయటపడ్డారు.. ఇప్పుడు జార్ఖండ్ సీఎం విషయంలోనూ.. ఇలానే జరిగింది. దీంతో.. మనదేశంలో.. ముఖ్యంగా పరిపాలనలో ఎంతో కీలకమైన ముఖ్యమంత్రులు ప్రయాణించే హెలికాప్టర్లు ఎంత సేఫ్గా ఉన్నాయో అర్థమవుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి