30, ఏప్రిల్ 2012, సోమవారం
వంశీకి షోకాజ్ వెనుక బాలయ్య హస్తం?
విజయవాడ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి చంద్రబాబు నాయుడు షోకాజ్ నోటీస్ జారీ చేయడం వెనుక బాలయ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో బహిరంగంగా జగన్ ను కలుసుకోవడంతో పాటు, వంశీ అతన్ని కౌగలించుకోవడం ఇప్పటికే పెద్ద వివాదాన్ని సృష్టించింది. పార్టీలో పట్టుపెంచుకోవడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్న బాలకృష్ణ ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. దీనిపై చంద్రబాబు దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే వెంటేనే షోకాజ్ ఇవ్వాలని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అసలు గొడవ దమ్ముదేనా..!
ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా రిలీజ్ కు.. వంశీ జగన్ ను కలవడానికి మధ్య లింకు ఉన్నదన్నది బాలయ్య అనుమానం. సినిమా రిలీజ్ రోజునే కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు సాధన కోసం బంద్ నిర్వహించారు. రిలీజ్ నేపథ్యంలో దీన్ని వాయిదా వేసుకోవాలంటూ కొడాలి నాని, వంశీలు కోరినా.. టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు దీనికి అంగీకరించలేదు. అఖిలపక్షంతో కలిసి బంద్ నిర్వహించారు. అయితే.. కొడాలి నాని మాత్రం గుడివాడలో థియేటర్ల యజమానులతో మాట్లాడి సినిమాను విడుదల చేయించారు. విజయవాడలో మాత్రం ఉదయాన్నే సినిమా విడుదల కాలేదు. కొడాలి నాని, వంశీలు బందర్ పోర్ట్ బందుకు దూరంగానే ఉన్నారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తో నాని, వంశీలు చర్చించారు. కృష్ణాజిల్లా టూర్ లో ఉన్న జగన్ ను పబ్లిక్ గా కలవడం ద్వారా.. పార్టీ నాయకత్వంలో కల్లోలం పుట్టించాలని ఎన్టీఆర్ చెప్పిన మేరకే, వంశీ ధైర్యం చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ.. చంద్రబాబుతో సీరియస్ గానే చర్చించినట్లు తెలుస్తోంది. "పార్టీని ధిక్కరించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.జూనియర్ల మీద (ఎన్టీఆర్) మనం ఏమాత్రం ఆధారపడకూడదు. పార్టీకన్నా పెద్దవాళ్లమనుకునేవారి పనిపట్టాల్సిందే" అని బాలయ్య.. బాబుతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వంశీని జగన్ కౌగిలిపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందో.. చూడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి