11, మార్చి 2012, ఆదివారం
వార్త పేపర్ మూసేశారా..?
ఈనాడుకు పోటీగా మొదలై సంస్థాగత లోపాలతో దిగజారిపోయిన సంచలన దినపత్రిక వార్త.. మూతపడిందా..? రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. భారీగా బకాయిలు పడి దివాళా తీసిన సంఘీ ఇండస్ట్రీస్ ను బ్యాంకులు సీజ్ చేయడం.. ఆదివారం రోజు వార్త పత్రిక వెలువడకపోవడంతో.. అందరిలోనూ ఈ అనుమానాలు కలుగుతున్నాయి. దాదాపు 2వేల కోట్ల రూపాయలు బకాయి పడడంతో అలహాబాద్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం.. కోర్టు ఆదేశాలను ఆధారంగా చేసుకొని శనివారం రోజు సీజ్ చేసింది. ఆరునెలలుగా బకాయిపడ్డ తమ జీతాలను చెల్లించిన తర్వాతే, సంఘీ ఇండస్ట్రీస్ ను సీజ్ చేయాలంటూ కార్మికులు ఆందోళన చేసినా, పోలీసు బలాన్ని ఉపయోగించి బ్యాంకులు కంపెనీని సీజ్ చేశాయి. దీంతో సంఘీ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అసలే అరకొర నిధులతో నడుస్తున్న వార్త పత్రికపై కూడా దీని ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పూర్తి కారణాలు తెలియకపోయినా.. ఆదివారం సంచిక మాత్రం హైదరాబాద్లో కనిపించలేదు. దీనికి తోడు.. ఇంటర్నెట్ ఎడిషన్ కూడా అప్ డేట్ కాకపోవడం, ఈ పేపర్ ను కూడా పెట్టకపోవడంతో.. వార్త పత్రిక పనైపోయిందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయితే, దీనిపై వార్త పత్రిక యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే ఆ పత్రిక ఇబ్బందులను తొలగించుకుని, మళ్లీ పాఠకుల ముందుకు వస్తుందని ఆశిద్దాం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి