10, ఆగస్టు 2011, బుధవారం
జగన్ జైలుకెళ్లాల్సిందేనా..?
జగన్ కు మూడినట్లే కనిపిస్తోంది. జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి సీబీఐ విచారణకు హైకోర్టు బుధవారం ఆదేశించింది. మంత్రి శంకర్రావు కోర్టుకు రాసిన లేఖ, టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, కడప న్యాయవాది షేర్వాణీలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విడివిడిగా విచారణ జరిపి పై విధంగా ఆదేశించింది. జగన్ ఆస్తుల కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు భావిస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ పిటిషన్ను దాఖలు చేశారన్న జగన్ న్యాయవాదుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు, అసలు సీబీఐ తన ప్రాథమిక నివేదికలో ఏం పేర్కొందో తెలుసుకోవాలన్న జగన్ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ నివేదికను ఇవ్వడానికి కోర్టు అనుమతించలేదు. సీబీఐ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో జగన్ కు కష్టకాలం మొదలైనట్లే. ఈకకు ఈక పీకి మరీ జగన్ అవినీతి చరిత్రను సీబీఐ బయటకు లాగాలనుకొంటోంది. కోర్టు ఆదేశాలతో అవినీతినిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాల కింద దర్యాపు చేయబోతోంది. క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది కాబట్టి, అదీ త్వరలోనే అమలవుతుంది. ఇప్పటికే ప్రముఖ రాజకీయ వేత్తలు ఎ.రాజా, సురేశ్ కల్మాడి, కనిమొళిలు కటకటాల వెనక్కి వెళ్లిన నేపథ్యంలో, జగన్ కూ అదే గతి పట్టొచ్చన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి