5, ఆగస్టు 2011, శుక్రవారం
సావధాన తీర్మానంతో వచ్చిన లాభమేమిటి?
తెలంగాణపై బీజీపీ లోక్సభలో సావధానతీర్మానం ప్రవేశపెట్టింది. వాడీవేడిగా ప్రసంగాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు అన్నీ సభాముఖంగా బాగానే వినిపించాయి. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ బలంగానే వినిపించారు. ఇక సభలో ఉన్న తెలంగాణ ప్రాంత ఎంపీ సర్వే సత్యనారాయణ కూడా తానూ తెలంగాణ వాదినేనని నిరూపించుకున్నారు. సభలో మాట్లాడడం కోసమే రాజీనామా చేయలేదంటూ తన పద్దతిని సమర్ధించుకున్నారు. సీపీఐ కూడా తెలంగాణకు మద్దతిస్తామంటూనే, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తామంటూ వింతవాదన వినిపించింది. దీనిపైనా సర్వే సత్యనారాయణ, సీపీఐ నేత గుర్ దాస్ దాస్ గుప్తాకు కౌంటర్ వేశారు. ఇక సమైక్యవాదన వినిపించాలనుకున్న కావూరికి మాత్రం మొండిచెయ్యి కనిపించింది. ఆవేశంగా మాట్లాడుతున్న సమయంలో ఆయన గొంతును స్పీకర్ మీరాకుమార్ నొక్కేశారు. కూర్చొనేది లేదంటూ కాసేపు కావూరి బెట్టు చేసినా, సభ్యుల జోక్యంతో సర్దుకోక తప్పలేదు. ఇక చివరగా సమాధానం ఇచ్చిన హోంమంత్రి పాత చింతకాయ పచ్చడినే రుబ్బారు. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నామని, రాజకీయ పార్టీలు చీలిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భుజాలు దులుపుకున్నారు. అయితే.. అన్ని పార్టీలు ముందు ఏకాభిప్రాయాన్ని సాధించమని ఓ ఉచిత సలహాను పడేశారు. ఎప్పటివరకూ పరిష్కారం లభిస్తుందన్న విషయాన్ని మాత్రం చెప్పలేమన్నారు. అందరూ అప్పటివరకూ ఓపిక పట్టాలన్నారు. ఎవరి వాదనలను వారు వినిపించుకోవడం తప్పితే.. ఈ సావధాన తీర్మానం వల్ల ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి