21, ఆగస్టు 2011, ఆదివారం
జెండా ఎత్తేశారు
ఊహించిందే అయ్యింది. రెండు పడవల ప్రయాణం చేస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇక ఒక పడవలోకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది. సీబీఐ విచారణ, జగన్ కంపెనీల చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు, ఎఫ్ ఐ ఆర్ లో వైఎస్సార్ పేరు.. ఇలా అన్నీ కలగలపి జగన్కు మద్దతిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పదవులు వదులుకునేందికు ప్రేరేపించాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ గ్రూప్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ కోసం జగన్ గ్రూపులోని కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతిలు రాజీనామాలు సమర్పించారు. తాజాగా 22 మంది జగన్ పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపునకు నిరసనగా రాజీనామా చేస్తునట్లు చెప్పారు. రేపు స్పీకర్ కు రాజీనామాలు సమర్పించనున్నారు. వీరితో పాటు ఎంపీ సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా తమ పదవులను వదులుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పడేయడానికే జగన్ శిబిరం ఈ ఎత్తుగడను వేసింది. అయితే, పీఆర్పీ చేరికతో కిరణ్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదు. కానీ, వీరందరి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయం ముదిరి పాకాన పడుతుంది. ఆ తర్వాత వచ్చే బై ఎలక్షన్లలో జగన్ వర్గం జయకేతనం ఎగరవేస్తే మాత్రం అసెంబ్లీలో కిరణ్ సర్కారుకు చిక్కులు తప్పకపోవచ్చు. కానీ, వరస రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరై తప్పించుకోవడానికి ఊరూరు తిరుగుతున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్, వీరి రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి