17, ఆగస్టు 2011, బుధవారం
గాంధీ వారసులకు నచ్చని గాంధీగిరి
Categories :
anna hazare . news . TOP
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది ఎవరు...? రెండు వందల ఏళ్ల భారత మాత దాస్య శృంఖలాలను తెంచి పడేసిన సంఘటన ఏది...? కత్తులు, కటార్లా... ఇంకా భయంకర మారణాయుధాలా...?
సత్యం....అహింస...
ఇంకా... సత్యాగ్రహం...
అవును...ఇవే...
సత్యాగ్రహం... రెండు వందల ఏళ్ల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ... అహింసాయుత ఆయుధం... భారతమాత బానిసత్వాన్ని రూపుమాపేందుకు... నాటి స్వాతంత్ర్య పోరాటంలో... ఎందరో విప్లవ వీరులు దురాక్రమణదారుల్లో వణుకుపుట్టించి అసువులు బాస్తుంటే... మరోవైపు... చేతిలో ఆయుధం పట్టకుండా... సత్యం, అహింసే ఆయుధాలుగా... అలుపెరగని పోరాటం చేసి... ప్రపంచానికి భారతీయుల అసలు సిసలు పోరాట రూపం ప్రదర్శించారు మహాత్మాగాంధీ. పోరాటం అంటే... కావాల్సింది మారణాయుధాలు మాత్రమే అని తెలిసిన ప్రపంచానికి.. పోరాటమంటే... శాంతియుతంగా ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు... అంటూ ఓ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ.
దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి మహోద్యమాలు... మరోవైపు క్షీణించే ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా..ఆమరణదీక్షలు... ఇవి బ్రిటిష్ పాలకుల కంటి మీద కునుకులేకుండా చేశాయి... ఆఖరికి... దేశాన్ని వదిలి పారిపోయేందుకు కారణమయ్యాయి...
ఒకనాడు మనకు స్వాతంత్ర్యాన్ని సముపార్జించిపెట్టిన పోరాట రూపం... మనకు స్వేచ్ఛా వాయువుల్ని ప్రసాదించిన... సత్యాగ్రహానికి... మన ఏలినవారు ఇస్తున్న విలువెంతో తెలుసా...? ముందస్తు అరెస్టులు.
ఉద్యోగులో... లేదంటే తమ డిమాండ్లు తీర్చాలంటున్న కార్మికులో, రైతులో కాదు... ఈ దేశాన్ని , ఈ దేశ భవిష్యత్తును కాపాడమంటూ మొరపెట్టుకుంటున్న సామాజిక కార్యకర్తలు... అవినీతి విషవృక్షాన్ని కూకటివేళ్లతో సహా పెకిలేయాలని ఆక్రోశిస్తున్న దేశభక్తులు... అధికారం అడ్డుగా పెట్టుకుని అవినీతిని పెంచిపోషిస్తూ కోట్లు సంపాదిస్తున్నవారు దేశాన్ని ఏలుతుంటే... దేశ సంక్షేమం కోసం, దేశ ప్రగతి కోసం పోరాడుతున్న ఓ పండుముసలిని జైలుకు పంపించారు. అన్నా హజారేను అక్రమంగా అరెస్టు చేసి, అవినీతిపరులు, దోపిడీదొంగలు,కరుడుగట్టిన నేరస్థులున్న తీహార్ జైల్లో పెట్టారు..ఎందుకీ అరెస్టులు... జైళ్లలో పెట్టడాలు... ఎందుకంటే... వీళ్లు చేసిన నేరమంతా ఒక్కటే... శాంతియుతంగా నిరాహార దీక్ష చేయటం... అదికూడా... జాతిపిత బాపూజీ చూపిన బాటలో... తమ భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకోవటం... దానికి గాంధీజీ వారసులమని చెప్పుకునే... నేతల దాష్టీకమే ... ఈ అరెస్ట్లు...
ఇంతకీ ... అన్నాహాజరే వంటి వాళ్లు దీక్షలు చేయటం తప్పా...? నాడు గాంధీజీ బోధించిన సత్యాగ్రహం తప్పా...? ఇంతకీ ఈ దేశాన్ని పాలిస్తోంది... గాంధీజీ వారసులేనా...? గాడ్సే వారసులా...? ఏలినవారే తేల్చుకోవాలి....? జాతిపితకు... ఆయన చూపిన బాటకు.. తామిస్తున్న విలువెంతో... విచక్షణ ఉంటే... వాళ్లే గ్రహించాలి....! గాంధీయిజాన్ని... జైళ్లలో పెడుతున్న నేటి నేతలు... తమకు...నాటి బ్రిటిష్ పాలకులకు తేడా ఏంటో కనీసం గుర్తించగలగాలి.
(Article by K.Rammohan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి