1, ఆగస్టు 2011, సోమవారం
స్కాంల్లో సౌత్ స్కాంలు వేరయా..!
దక్షిణ భారతం.. మన దేశంలో అన్ని రకాలుగా కీలకమైన ప్రాంతం. అపారమైన వనరులు.. అద్భుతమైన మేథోసంపద.. సువిశాల మైన పంటభూములు.. మైమరిపింపజేసే పర్యాటక ప్రాంతాలు.. ఇవన్నీ దక్కను పీఠభూమికే సొంతం. అయితే.. వీటికన్నా మనకు పేరుతెచ్చిపెడుతోంది.. మన ప్రాంతాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తోంది మరొకటి ఉంది.. అదే స్కాం. అవును.. సౌత్ ఇండియా ఇప్పుడు స్కాంలకు కేరాఫ్ అడ్రస్..
అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు ఏనాడో రాశాడు.. పాలనలో మెలకువులను ప్రపంచానికి నేర్పించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా.. చాణక్యతంత్రాన్ని మించిన సూత్రం లేదు. కానీ.. మన దక్షిణాది నేతలు అందర్నీ మించిపోయారు. అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరించాలో.. చాణుక్యుడికే నేర్పేటంతటి వాళ్లయ్యారు. అవును.. మన నేతలు వేసే స్కెచ్లు చూస్తే.. అపర చాణుక్యుడికీ మతి పోవడం ఖాయం..
మన దేశంలో పాలిటిక్స్ హడావిడి ఎక్కువగా ఉండేది ఉత్తరాదిలోనే. దక్షిణం ఎప్పుడూ కూల్గా కామ్గా ఇంకా చెప్పాలంటే.. ఉత్తరాది నేతల ఆదేశాలకు అనుగుణంగా సాగిపోతుంటుంది. దేశాన్ని కుదిపేసే రాజకీయ సంఘటనలూ ఎక్కువగా ఉత్తరాదిలోనే చోటుచేసుకునేవి. ఈ పరిస్థితిలోనూ ఇప్పుడు మార్పు వచ్చేసింది. ఏది జరిగినా దక్షిణంలోనే జరుగుతోంది. దేశాన్ని కుదిపేసే సంఘటనలు.. ప్రభుత్వాల్ని పడగొట్టే కుంభకోణాలకు దక్షిణంలోనే బీజం పడుతోంది. ప్రభుత్వాన్ని పగబట్టిన పాములా వెంటాడుతున్న 2 జి స్కాంలో కీలకవ్యక్తులు తమిళనాడు నేతలు.. అక్రమ మైనింగ్తో లక్షల కోట్లు కొల్లగొట్టింది కర్నాటక నేతలు... అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని అక్రమమార్గాల్లో కంపెనీల్లోకి నిధులను ప్రవహింపజేశారని ఆరోపణలు ఎదుర్కొంటోంది మన రాష్ట్ర నేతలు..
ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనికాదు.. ఏరాష్ట్రం చూసినా, అధికారం అందిందే తడవుగా, రాజకీయ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్లు కొల్లగొడుతున్నారు. దక్షిణ భారతాన్ని కుంభకోణాలకు పుట్టినిల్లుగా మార్చేశారు. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న మేజర్ స్కాంల్లో మెయిన్ రోల్ పోషిస్తున్నవారంతా.. మన దక్షిణాది నేతలే. ఆర్థికవేత్తలకే అంతుబట్టని రీతిలో నిధులు కొల్లగొట్టిన మహాఘనులూ మనవాళ్లే. అందుకే.. సౌత్ అంటే స్కామ్స్కు కేరాఫ్ అడ్రస్ అవుతోంది.
2జి స్కీం.. అబ్బో పెద్ద స్కాం..
చేసిన పని ఎవరికీ తెలియకూడదు. అంతా ప్రజాప్రయోజనంలానే కనిపించాలి. కానీ, సొంత ప్రయోజనాలే ఎక్కువగా నెరవేరాలి. ఇదీ మన రాజకీయనేతల కొత్త సిద్ధాంతం. స్కాముల్లో సౌత్ లీడర్లు పాటిస్తున్న నయా మంత్రం. అందుకే.. అంతా బహిరంగంగానే జరిగినా, 2జి స్కాం విషయం రెండేళ్ల వరకూ ఎవరికీ తెలియలేదు. అంతటి గొప్పోళ్లు మన లీడర్లు. ఇందులో ప్రధాన సూత్రధారి తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా.
ఒకటీ రెండూ కాదు.. లక్షా 76 వేల కోట్ల రూపాయలు. టెలికాం మంత్రిగా రాజా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా పోయాయి. ఆమేరకు ప్రైవేటు కంపెనీలు లబ్ధి పొందాయి. 2001లో నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే, 2008లోనూ 2జి లైసెన్సులు కేటాయించాలని రాజా నిర్ణయం తీసుకొని, దానిపై వచ్చిన అభ్యంతరాలనూ తోసిపుచ్చిమరీ ఈ స్కాంకు పాల్పడ్డారు. తనకు అనుకూలమైన కంపెనీలకు లైసెన్సులు కట్టబెట్టడానికి నిబంధనలను సైతం మార్చి పాడేశారు. దాని ఫలితమే, టెలికాం రంగంలో ఏమాత్రం అనుభవం లేని యూనిటెక్,స్వాన్ లాంటి కంపెనీలకు అనూహ్యంగా లైసెన్సులు దక్కాయి. 3జి లైసెన్సుల వేలంతో భారీగా ఆదాయం రావడంతో.. రంగంలోకి దిగిన కాగ్.. 2జీ స్కాం గుట్టును రట్టు చేసింది. లక్షా 76వేల కోట్ల లాస్ను ఎత్తి చూపించింది. సీబీఐ ప్రవేశం, సుప్రీం జోక్యంతో రాజా పదవి ఊడింది.. ఆయన జీవితం జైలుపాలయ్యింది. సంకీర్ణంలో ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న నమ్మకమే.. ఇంత భారీ స్కాంకు పునాది వేసింది
రాజా మాత్రమే కాదు.. ఈ 2జీ కుంభకోణానికి మరో కీలక సూత్రధారి ఉన్నారు. రాజాను నడిపించింది, 2జీ లైసెన్సుల కేటాయింపుతో భారీగా లబ్దిపొందిన నేత... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి. రాజ్యసభ ఎంపీగా ఉన్న కనిమొళి.. 2జీ కుంభకోణంలో కొన్ని కంపెనీలకు అనుకూలంగా పావులు కదిపారు. వాటికి లైసెన్సులు దక్కడానికి లాబీయింగ్ చేశారు. తమ పార్టీ నేతే టెలికాం మంత్రి కావడంతో.. డీబీరియాల్టీ గ్రూప్ కంపెనీ స్వాన్ టెలికాంకు 2జీ స్పెక్టమ్ లైసెన్సులు అందేలా చేశారు. దీనికి ప్రతిఫలంగా దాదాపు 200 కోట్ల రూపాయలను కనిమొళికి చెందిన కళైంజర్ టీవీలోకి డీబీ రియాల్టీ నుంచి వచ్చిపడ్డాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి దీనికి రుణమన్న పేరునూ పెట్టుకున్నారు. కానీ, 2జీ స్కాంలో ఒక్కో ఆధారాన్ని లాగుతూ వెళ్లిన సీబీఐ ఈ వ్యవహారాన్ని బయటకు లాగింది. కనిమొళిని జైలుకు పంపించింది.
అధికారం చేతిలో ఉంటే ఎంతగా దోచుకోవచ్చో నిరూపించిన కుంభకోణం ఇది. చెప్పాలంటే భారత దేశ చరిత్రలో అదిపెద్ద కుంభకోణం. తమకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు, తమ జేబులు నింపే కంపెనీలకు పనులు ఎలా చేసిపెట్టాలో నేర్పించే మహా కుంభకోణం. పైకి పైసా లాస్ కనిపించదు. కానీ, కోట్లకు కోట్లు పక్కదారి పడతాయి. అందుకే ఇదీ కుంభకోణాలకే కుంభకోణం. మనవాళ్లు ప్రపంచానికి నేర్పుతున్న కొత్త పాఠం.
కనిపించినంత మంచోడు కాదు..
టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు దయానిధి మారన్. యూపీఏ సంకీర్ణంలో కీలక పార్టీ కావడంతో.. తామేం చేసినా చెల్లుబాటవుతుందన్న తీరులో ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని.. అడ్డగోలుగా సంపాదించారు. తమిళనాడుకు చెందిన శివశంకరన్ కంపెనీ ఎయిర్ సెల్కు లైసెన్స్లు ఇవ్వడంలో పక్షపాతాన్ని చూపించారు. నిబంధనలను సాకుగా చూపించి లైసెన్సులను జారీ కాకుండా అడ్డుకున్నారు. చివరకు, శివశంకరన్ పై ఒత్తిడి తెచ్చి, ఆ కంపెనీని మలేషియాకు చెందిన ఆనంద కృష్ణన్కు అమ్మించారు. ఈయన దయానిధి మారన్కు సన్నిహితుడు. ఆనంద కృష్ణన్ కంపెనీ మాక్సిస్.. ఎయిర్ సెల్ను టేకోవర్ చేయడంతోనే, లైసెన్సుల పైళ్లను ఆగమేఘాల మీద కదిలించారు. అప్పటివరకూ పెండింగ్లో ఉన్న లైసెన్సులను ఆనంద కృష్ణన్ నేతృత్వంలోని ఎయిర్సెల్కు కేటాయించారు.
అయితే.. కేవలం ఎయిర్ సెల్ను అమ్మించడంతోనే ఈ కథ అయిపోలేదు. ఎయిర్సెల్ను టేకోవర్ చేసిన నాలుగు నెలలకే మలేషియాకు చెందిన ఆస్ట్రో కంపెనీ మారన్ల సన్ డైరెక్ట్లో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. దీనికోసం దాదాపు 675 కోట్ల రూపాయలను మారన్లకు చెల్లించింది. వాస్తవానికి సన్ డైరెక్ట్ నేతృత్వం వహిస్తోంది దయానిధి మారన్ సోదరుడు కళానిధిమారనే అయినప్పటికీ, దయానిధికీ అందులో భాగస్వామ్యముంది. అంతేకాదు.. ఈ పెట్టుబడి పెట్టిన మలేషియా కంపెనీ ఆస్ట్రో కూడా.. ఎయిర్సెల్ను కొనుగోలు చేసిన ఆనంద్ కృష్ణన్దే. దీన్ని బట్టి చూస్తే.. ఎయిర్సెల్ను తక్కువ ధరలో ఇప్పించినందుకు ఆనంద్ కృష్ణన్ ప్రతిఫలం చెల్లించుకున్నట్లు కనిపించడం లేదూ..! అదే నిజం కూడా..
2జీ కుంభకోణంపై దర్యాప్తు మొదలవడంతో, ఎయిర్ సెల్ అసలు యజమాని శివశంకరన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ దయానిధికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరించింది. దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి శివశంకరన్తో కంపెనీని అమ్మించారని అభియోగాలు మోపింది. సీబీఐ ప్రాథమిక విచారణలో దోషిగా తేలడంతో, కేంద్ర మంత్రి పదవిని దయానిధి మారన్ వదులుకోవాల్సి వచ్చింది.
అంతేకాదు.. టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు సన్ టీవీ కోసం ప్రభుత్వ ఫోన్ లైన్లను విచ్చలవిడిగా వాడేశారు. మారన్ల నివాసం నుంచి సన్ టీవీ ఆఫీసుకు ప్రత్యేకంగా కేబుల్స్ వేయించుకున్నారు. 323 టెలిఫోన్ లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని సన్ టీవికోసం వాడుకొన్నారు. వీటన్నింటినీ బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పేరిటే ఉంచి.. ఒక్క పైసాను కూడా కట్టకుండా తప్పించుకున్నారు. దీనివల్ల సన్ టీవికి వందల కోట్లు మిగిలాయి. ఇలా అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని భారీగా అవినీతికి పాల్పడ్డారు దయానిధి మారన్. ఓరకంగా ఈయన చూపించిన బాటలోనే... రాజా-కనిమొళిలు నడిచారని చెప్పొచ్చు.
మహా ఘనులు
ఇక కర్నాటకం సంగతి.. ఇనుప గనులను మింగేస్తూ.. కోట్లకు కోట్లు సంపాదించారు అక్కడి రాజకీయనేతలు. అధికారాన్ని చేతిలో పెట్టుకుంటే.. ఎంతగా దోచుకోవచ్చో నిరూపించారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా గత ఆరేళ్లుగా అధికారంలో ఉన్నవారంతా ఇనుప ఘనులను దోచుకున్నారు. తమవాళ్లకు అనుకూలంగా వ్యవహరించారు. .కోట్లు సంపాదించుకున్నారు. కర్నాటకలో అక్రమ మైనింగ్... దీని విలువ 16 వేల కోట్ల రూపాయల పైమాటే. ఇందులో దోషులు.. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, రాష్ట్ర మాజీ మంత్రులు గాలి సోదరులు. కర్నాటక లోకాయుక్త నిగ్గుతేల్చిన నిజమిది.
గనులను అడ్డంగా పెట్టుకొని కర్నాటక రాజకీయనేతలు భారీగా దండుకున్నారు. అనుమతులు ఇవ్వడం కోసం భారీగా పైరవీలకు పాల్పడ్డారు. ఈ పాపమే ఇప్పుడు యడ్యూరప్పను చుట్టుకొంది. ముఖ్యమంత్రి పదవి పోయేలా చేసింది. గనుల తవ్వకానికి అనుమతినిచ్చినందుకు.. యడ్యూరప్ప కుటుంబానికి చెందిన ట్రస్ట్కు ఓ మైనింగ్ కంపెనీ, 10 కోట్ల రూపాయలు విరాళాన్ని ఇచ్చింది. యడ్యూరప్పకు చెందిన కోటి 40 లక్షలు విలువచేసే భూమిని, ఏకంగా 20 కోట్లకు కొనుగోలు చేసింది.. దీన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులివ్వడం కోసం నేతలు ఎంతగా దిగజారారో ఊహించవచ్చు. కర్నాటకలో సాగిన అక్రమాల్లో అక్రమమైనింగ్ అన్నది ఓ పార్శ్వం మాత్రమే. కర్నాటకలో సీఎం పదవిలో కూర్చుకున్నవారంతా.. ఒక్కో తరహా ఆరోపణలతో పదవులను వదులుకున్నారు.
ఇనుప ఖనిజం తవ్వకాలు, అక్రమ రవాణా ద్వారానే కోట్లకు అధిపతులయ్యారు గాలి సోదరులు. ఒకప్పుడు అత్యంత సామాన్య జీవితం గడిపిన గాలి బ్రదర్స్.. కర్నాటక రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారంటే దానికి కారణం ఇనుప గనులే. విదేశాలకు కూడా అక్రమంగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతులు చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. కర్నాటక ప్రభుత్వంలోనే మంత్రులుగా కొనసాగడం, అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టగలిగే శక్తి కూడా ఉండడంతో.. వీరు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ముందు బెట్టు చేసినా, చివరకు గాలి రూట్లోకే సీఎం యడ్యూరప్ప కూడా రావాల్సి వచ్చింది. అంతా కలిసిరావడంతో.. మరింతగా రెచ్చిపోయారు గాలి సోదరులు. నిబంధనలను గాలికి వదిలి.. అడ్డగోలుగా ఇనుపఖనిజాన్ని తవ్వి పడేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా నిబంధనలను తుంగలో తొక్కి మరీ ఇనుప గనుల తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఇలా ఎవరు అధికారంలో ఉన్నా దోచుకోవడం.. సొంత జేబులు నింపుకోవడమే పరమావధన్నట్లు వ్యవహరించారు. సౌత్ స్కామ్స్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
జగమెరగని స్కాం...
జగన్ ఆస్తులపై.. ఎమార్ అక్రమాలపై రాష్ట్ర మంత్రి శంకర్రావు వేసిన పిటిషన్.. జగన్కు చికాకులు తెచ్చిపెట్టింది. వైఎస్ అధికారంలో ఉండగా జగన్ ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం.. ఆయన కంపెనీల్లోకి పెట్టుబడుల వరద ప్రవహించడంపై విచారణ సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ... పూర్తిస్థాయి విచారణకు ఎదురుచూస్తోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించి CBI ప్రాథమిక విచారణ జూలై 12న హైకోర్టు ఆదేశాలతో ప్రారంభమైంది. DIG లక్ష్మీనారాయణ నేతృత్వంలో హైకోర్టు నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న CBI అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు వాటిని పరిశీలించి, ఆ తర్వాత కార్యరంగంలోకి దూకారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన 30 కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన వారితో పాటు మొత్తం 54 మందిని రెండువారాల పాటు సీబీఐ విచారించింది. జగన్ సంస్థల్లోకి అక్రమంగా నిధులు వచ్చినట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహరం హై కోర్టు పరిధిలో ఉండడంతో సిబిఐ అధికారులు ధృవీకరించడం లేదు. భారతి, పెన్నా, జూబ్లీ మీడియా, జగతి పబ్లికేషన్స్, హెటేరో డ్రగ్స్, హెటేరో హెల్త్కేర్ , హెటేరో ల్యాబ్స్, మ్యాట్రిక్ ప్రసాద్ కంపెనిలు, పివిపి వెంచర్స్, సండూర్ పవర్ ప్రాజెక్ట్స్, కార్మెల్ ఏషియా, ఇందిర టెలివిజన్, లార్స్కో, తదితర కార్పోరేట్ కంపెనీల ప్రతినిధులు, ఐఏఎస్ అధికారుల నుంచి సిబిఐ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. అంతే కాకుండా ఐటీ అధికారులు, బ్యాంక్ అధికారుల సహకారంతో వీరి లావాదేవీలకు సంబంధించిన పూర్తి డేటాను సేకరించింది. భారతి, జగతి, ఇందిర కంపెనీల్లో దాదాపు మూడు వేల కోట్ల అక్రమ నిధులు ఉన్నట్లు సిబిఐ అధికారులు ప్రిలిమనరీ ఎంక్వైరీలో అనుమానించారు. అంతేకాకుండా మాట్రిక్స్, కోల్కత కంపెనీల నుంచి కూడా జగన్ సంస్థల్లో నిధులు దాదాపు 350 కోట్లు వచ్చినట్లు విచారణలో తేలింది. వీటన్నింటిపైనా నివేదికను హైకోర్టుకు సీబీఐ సమర్పించింది.
అయితే.. జగన్పై కేసు నమోదవుతుందా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సీబీఐ నివేదికను ప్రామాణికంగా తీసుకొని హైకోర్టు ఆదేశాలిస్తే.. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. అయితే.. జగనే ఈ నిధులను దారిమళ్లించి, ఆయన కంపెనీల్లోకి పెట్టుబడులుగా తెప్పించుకున్నాడని ఎవరైనా వెల్లడిస్తే మాత్రం.. జగన్పైనా కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే, అవినీతి నిరోధక చట్టం, ఫారిన్ మనీ రెగ్యులేటరీ యాక్ట్, మనీ లాండరింగ్ తో పాటు మరి కొన్ని ఆర్థిక నేరాల కింద అభియోగాలను సీబీఐ మోపవచ్చు. మనీ లాండరీంగ్ యాక్ట్లో జగన్ అరెస్టైతే సత్యం రామలింగరాజు తరహాలో సంవత్సరాల పాటు జైళ్ళో ఉండాల్సి వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జగన్పై అభియోగాలు నిజమని హైకోర్ట్ విశ్వసిస్తే.. పూర్తి స్థాయి విచారణకు సీబీఐను ఆదేశించవచ్చు. అంతేకాదు.. కేసు కూడా నమోదు చేయమని సూచించవచ్చు. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్కు పోటీగా కొత్త పార్టీతో దూసుకువెళ్లాలనుకుంటున్న జగన్ రాజకీయ భవితవ్యం ఏమవుతుంది..?
ఎత్తులు.. పైఎత్తులు... వ్యూహాలు ... ప్రతివ్యూహాలు.. అటు కాంగ్రెస్.. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్. వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ నేపథ్యంలో రెండు వర్గాలు వేగంగా పావులు కదుపుతున్నాయి. జగన్ బలపడితే ఎప్పటికైనా ముప్పే అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఆర్థికంగా జగన్ను దెబ్బ తీయాలనుకొంటోంది. అందుకే.. సీబీఐ విచారణకు మార్గం సుగమం చేసింది. ఆర్థిక లావాదేవీల కూపీని లాగుతోంది. అయితే.. ఒకవేళ నిజంగానే వైఎస్ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే.. దానికి వైఎస్తో పాటు.. రాష్ట్ర మంత్రులూ జవాబుదారీ అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ పార్టీ పెట్టినప్పటినుంచి... ఆయన కాంగ్రెస్ నేతలకు ప్రధాన టార్గెట్ అయిపోయారు. జగన్ ను ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిపైనా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగానే విమర్శల వర్షం మొదలుపెట్టారు. తాజాగా సీబీఐ ఎంక్వైరీతో.. జగన్ జైలుకు వెళ్లడమూ ఖాయమేనంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై కాంగ్రెస్ పార్టీ ఓ కన్నేసింది. పెట్టుబడులను ఉపసంహరించుకునేలా చేయడానికి వ్యూహం పన్నుతోంది. టీడీపీ కూడా జగన్ వ్యతిరేక ప్రచారానికి దిగడంతో రెండువైపుల నుంచి దాడి మొదలయ్యింది. దీన్ని జనక్షేత్రంలో ఎదుర్కోవాలనుకుంటున్నారు జగన్. అందుకు.. ఓదార్పు యాత్రనే వేదిక చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో సీబీఐ విచారణను ప్రస్తావిస్తున్నారు. ప్రజాబలం ఉంటే.. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తట్టుకోగలమని జగన్ శిబిరం భావిస్తోంది. అందుకే.. జనంలో సానుభూతిని పెంచుకునే ప్రయత్నాలకు దిగింది. ఒక వేళ జగన్ను జైలుకు పంపింస్తే.. ఆయన మాతృమూర్తి విజయమ్మను జనం మద్యకు తీసుకువచ్చే అవకాశం ఉంది. విజయమ్మే జనంలో తిరిగితే ఆ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నది వైఎస్సార్ పార్టీ వ్యూహం.
సీబీఐ ఎంక్వైరీని న్యాయపరంగా ఎదుర్కొంటూనే.. రాజకీయంగానూ ఎదుర్కోవాలనుకుంటున్నారు వైఎస్ జగన్. అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానంతోనే ఈ విషయంలో నేరుగా తలపడాలనుకుంటున్నారు. దానికీ ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి