18, జులై 2011, సోమవారం
ఐదుగురి బలితీసుకున్న జలపాతం.. గగుర్పొడిచే వీడియో
ఇండోర్ సమీపంలో ఉన్న పాతాళపాని జలపాతం దగ్గర హృదయవిదారకర సంఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో, ఆ జలపాతం విషాధాన్ని నింపింది. చంద్రశేఖర్ రాతి అనే 55 ఏళ్ల పెద్ద మనిషి తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి పాతాళపాని జలపాతం దగ్గరకు పిక్నిక్ వెళ్లాడు. వాటర్ లెవల్ తక్కువగా ఉండడంతో జలపాతం అంచుకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారు. వారితో పాటు ఆ సమయంలో మరో పదిహేను, ఇరవై మంది వరకూ అక్కడ ఉన్నారు. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది. వరదను గమనించి ఒడ్డున ఉన్నవాళ్లు ఒక్కసారిగా కేకలు పెట్టారు. ఆ హెచ్చరికలు విని నీటిలో ఉన్నవారంతా పరుగులు తీస్తూ ఒడ్డుకువచ్చారు. అదే సమయంలో వరద వారిని చుట్టుముట్టింది. కొంతమంది పడుతూ లేస్తూ ఒడ్డున పడ్డా, చంద్రశేఖర్ ఫ్యామిలీ మాత్రం మధ్యలోనే చిక్కుకుపోయింది. నీటిప్రవాహం తగ్గుతుందనుకుని ఆగిపోయిన వారు, అదెంత పెద్ద పొరపాటో కాసేపట్లోనే తెలిసి వచ్చింది. చంద్రశేఖర్ కుటుంబంతో పాటు మరో యువకుడు కూడా నీటిలో చిక్కుకుపోయాడు. ఒకరినొకరు పట్టుకొని ఉన్నా.. నీటి ఉధృతిని తట్టుకోలేకపోయారు. ఒకరు జారి పడిపోవడంతో.. అందరూ కిందపడ్డారు. అంతే, మాయదారి వరద వారిని జలపాతంలోకి తోసేసేంది. ఈ సంఘటనలన్నీ కేవలం నిమిషం వ్యవధిలోనే జరిగిపోయాయి. వారిని కాపాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే.. నీటిలో కొట్టుకుపోయిన తర్వాత స్థానికులు రంగంలోకి దిగి ఇద్దరు యువకులను మాత్రం ప్రాణాలతో కాపాడగలిగారు. ఓ అమ్మాయి మృతదేహాన్ని వెలికితీశారు. ఒడ్డున ఉన్న ఓ టూరిస్ట్ తీసిన వీడియోతో ఈ ఘోర ప్రమాదం ప్రపంచానికి తెలిసింది. మధ్యప్రదేశ్ లో వరసగా వరదల్లో చిక్కుకుపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది. అసలే వర్షాకాలం, నదుల సమీపంలోకి వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది ప్రాణాలపైకి తెస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి