12, జులై 2011, మంగళవారం
టీం మార్చుకున్న మన్మోహన్
కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఐదుగురు మంత్రులపై వేటు పడింది. ఇద్దరి రాజీనామాలకు ఆమోదం లభించింది. పదకొండు మందికి కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు లభించింది. రాష్ట్రం నుంచి కిశోర్ చంద్రదేవ్కు మాత్రమే కేబినెట్ ఛాన్స్ లభించింది. కేబినెట్ హోదా ఉన్న పంచాయతీరాజ్, గిరిజనాభివృద్ధి శాఖలను కిశోర్ చంద్రదేవ్కు కట్టబెట్టారు ప్రధాని మన్మోహన్. పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న జైరాం రమేశ్కు ప్రమోషన్ ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను అప్పజెప్పారు. కేబినెట్లోకి కొత్తగా బేణీ ప్రసాద్ వర్మ-ఉక్కుశాఖ, దినేశ్ త్రివేది - రైల్వేశాఖలు చేరారు. కొత్తగా తీసుకున్నవారికి ఎక్కువగా సహాయమంత్రి పదవులే దక్కాయి. సుదీప్ బందోపాధ్యాయ -హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ , వ్యవసాయం - చరణ్ దాస్ మహంత్, జితేంద్రసింగ్- హోం వ్యవహారాలు, మిలింద్ దేవ్రా -ఐటీ కమ్యూనికేషన్స్, రాజీవ్ శుక్లా- పార్లమెంట్ వ్యవహారాలు లభించాయి. ఇండిపెండెంట్ ఛార్జ్ విభాగంలో శ్రీకాంత్ జెన - ఎరువులు,రసాయనాలు, పబన్ సింగ్ ఘటోవర్- ఈశాన్య ప్రాంత అభివృద్ధి, గురుదాస్ కామత్ - తాగునీరు, పారిశుద్ధ్యం పోర్ట్ ఫోలియోలు దక్కాయి. గతంలో మంత్రిగా పనిచేసిన జయంతినటరాజన్కు మరోసారి అవకాశం కల్పించారు మన్మోహన్. ఇండిపెండెంట్ ఛార్జ్తో పర్యావరణ శాఖను అప్పజెప్పారు. కేబినెట్లో ఐదుగురిపై వేటు పడింది. రాష్ట్రం నుంచి ఉక్కు సహాయమంత్రిగా పనిచేస్తున్న సాయిప్రతాప్ పై వేటు పడింది. ఎం.ఎస్ .గిల్, హండిఖీ, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్లకూ ప్రధాని ఉద్వాసన పలికారు. దయానిధి మారన్, మురళీదేవ్రాలు రాజీనామాలు చేయడంతో వాటి ఆమోదం కోసం రాష్ట్ర పతికి పంపించారు. విస్తరణతో పాటు మంత్రుల బెర్తుల్లోనూ మార్పులు చేర్పులూ చేశారు పీఎం. విలాస్రావ్ దేశ్ముఖ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ, వీరప్పమొయిలీకి కార్పొరేట్ వ్యవహారాలు, పవన్ కుమార్ బన్సాల్కు పార్లమెంటరీ అఫైర్స్, సల్మాన్ ఖుర్షీద్కు మైనార్టీ వ్యవహారాలు, న్యాయశాఖ, ఆనంద్ శర్మకు టెక్స్టైల్స్, పరిశ్రమలను కేటాయించారు. సహాయ మంత్రుల్లో, అహ్మద్కు మానవవనరులు, విదేశీ వ్యవహారాలు, వి.నారాయణ్ సామికి పీఎంఓ, పెన్షన్లు, హరీశ్ రావత్కు పార్లమెంటరీ వ్యవహరాలు, వ్యవసాయం, అశ్విని కుమార్కు సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించారు. ముకుల్ రాయ్ ను షిప్పింగ్ కు పరిమితం చేశారు. ఇంతవరకూ రైల్వేసహాయ మంత్రిగా ఉన్న ముకుల్రాయ్, అస్సాం రైలు ప్రమాదస్థలానికి వెళ్లాలని పీఎం ఆదేశించిన వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే మార్పు జరగడం విశేషం.
ప్రభుత్వానికి మచ్చ తెచ్చిన డీఎంకేను ఈ సారి విస్తరణకు దూరంగా పెట్టారు. రాజా,దయానిధి మారన్ ల రాజీనామాలతో రెండు మంత్రి పదవులను కోల్పోయినా, డీఎంకేకు ఈ సారి అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వంపై మళ్లీ ప్రజల్లో విశ్వాసం పొందడానికే మన్మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టి.ఆర్.బాలుకు మంత్రి పదవికోసం కరుణానిధి ఒత్తిడి చేసినా, గతంలో ఆరోపణల దృష్ణా పీఎం దానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వంలో ప్రధాన సంకీర్ణం కావడంతో డీఎంకేను శాంతింపజేయడానికి ప్రణబ్ ను ఇదివరకే చెన్నైకు రాయబారాన్ని పంపించారు. దీంతో మంత్రివర్గ మార్పులపై డీఎంకే పెద్దగా ఆశ్చర్యపడలేదు. డీఎంకేను కంట్రోల్ చేయగలిగినా తృణమూల్ ఒత్తిడికి మాత్రం మన్మోహన్ తలొగ్గాల్సి వచ్చింది. రైల్వే శాఖను మళ్లీ ఆ పార్టీకే కట్టబెట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి