9, జులై 2011, శనివారం
ఆయనకు శక్తి లేదంట!
తెలంగాణను తెచ్చే శక్తిగాని, అడ్డుకునే శక్తిగాని లేవంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో, టీడీపీ నేతల చేతుల్లోంచి లాక్కొని మరీ సమైక్యాంధ్ర ప్లకార్డును ప్రదర్శించిన జగన్.. కొత్త పార్టీ పెట్టగానే, తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామంటూ ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి పూర్తిగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కారణమంటూ విమర్శించారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించే హక్కు కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ కర్రవిరగకుండా.. పాము చావకుండా ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి, తెలంగాణపై జగన్ ప్రకటనకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలిరోజు పార్టీ ఎజెండాను, సంక్షేమపథకాలను ప్రకటించిన జగన్, తెలంగాణపై ఊసైనా చెప్పలేదు. దీంతో రెండోరోజు ప్లీనరీ ప్రారంభం కావడానికి ముందు నుంచే కార్యకర్తలు, నేతలు తెలంగాణ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీనికి పోటీగా సమైక్యనినాదాలు ప్రతిధ్వనించాయి. జగన్ వేదికపైకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగింది. ఉదయాన్నే, తెలంగాణ నేతలతో భేటీ అయిన జగన్, ఏ ప్రకటన చేయాలన్నదానిపై చర్చలు జరిపారు.
ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. జగన్ తో జై తెలంగాణ అనిపిస్తానంటూ గతంలో ప్రకటించిన కొండా సురేఖ మైక్ అందుకున్నారు. వైఎస్ కు దేవుడిచ్చిన చెల్లినంటూ ప్రకటించుకుంటూ, తెలంగాణలోనూ వైఎస్సార్ కు ఎంతోమంది అభిమానులున్నారని, ప్రత్యేక వాదం వల్లే వారు బయటకు రాలేకపోతున్నారని చెప్పారు. తెలంగాణ విషయంలో కొంతమంది నేతలు వైఎస్సార్ పై అపనింద వేయాలనుకొంటున్నారని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందనీ చెప్పారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామన్న హామీని ప్లీనరీ వేదికపైనుంచి జగన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ నేతలూ ఇదే డిమాండ్ చేశారు. నేతల ఒత్తిడి పేరుతో, ప్లీనరీ ముగిసే సమయంలో తెలంగాణపై తన విధానాన్ని ప్రకటించేశారు జగన్. తాను తెలంగాణ విషయంలో చేతగానివాడినంటూ చేతులెత్తేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి