2, జులై 2011, శనివారం
ఆట మొదలయ్యింది
రాష్ట్ర రాజకీయంలో అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. తెలంగాణ అంశాన్ని మరింత రంజుగా మార్చేసింది. జులై4నే రాజీనామాలు చేస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. హైకమాండ్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసేసింది. హైదరాబాద్ టూర్ లోనే ఉన్న ఆజాద్ నోట.. తన మాటను సోనియమ్మ పలికించింది. శ్రీకృష్ణ ఏర్పాటు వెనుకున్న గుట్టునూ విప్పింది. ఇంతకాలం త్వరలోనే తేల్చుతామని, ఏకాభిప్రాయమని, శ్రీకృష్ణ కమిటీ నిర్ణయమని, ఇలా రకరకాల కార్డులను ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మొత్తానికి ప్లేట్ నే మార్చేసింది. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఒకటో రెండో సూచనలుంటే.. వెంటనే అమలు చేసేవాళ్లమని, కానీ, ఆరు సూచనలు ఇచ్చారని, వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోగలమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఆజాద్ జనాముఖంగా ప్రకటించేశారు. అంతేకాదు.. ఇది మూడు ప్రాంతాల సమస్యని, అన్ని ప్రాంతాలు ఒప్పుకునే పరిష్కారాన్నే అమలు చేస్తామన్నారు. తద్వారా, తెలంగాణ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చేశారు.
ఆజాద్ మాటలే కాదు.. కొంతకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అత్యంత తెలివిగా తెలంగాణకు చెందిన దామోదర్ రాజనర్సింహకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గీతారెడ్డికి చెక్ చెప్పింది. పైగా, రాజనర్సింహ ఉద్యమంలో ఎప్పుడూ చురుగ్గా లేరు. దీన్ని బట్టి చూస్తే.. తెలంగాణ ఉద్యమం నుంచి బయటపడడంటూ కాంగ్రెస్ సీనియర్లకు సంకేతాలిచ్చింది. అంతేకాదు, ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంలోనూ దామోదర్ రాజనర్సింహ చేసిన ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం మాటగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మండలైనా ఓకే నంటూ ప్రకటించి కాంగ్రెస్ లోనూ, తెలంగాణ ఉద్యమకారుల్లోనూ కాక రగిల్చారు రాజనర్సింహ. దీని తర్వాత లగడపాటి వ్యాఖ్యలూ కలకలాన్నే పుట్టించాయి. 14 ఎఫ్ ను ఎత్తివేయడం సాధ్యమేకాదంటూ లగడపాటి తేల్చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ, ఈ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది.? ఇదీ అధిష్టానం పనే కావచ్చు. కావాలనే ఈ ప్రకటన చేయించిందా..?
జులై 4 వరకూ గడువును తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడో ప్రకటించారు. హైకమాండ్ నిర్ణయం కోసం దాదాపు నెలరోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. మధ్యలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని, హోంమంత్రి చిదంబరాన్ని, ప్రణబ్ ముఖర్జీని, అహ్మద్ పటేల్ ను కలిసొచ్చారు. గడువులోగా స్పందిచకపోతే, తమకు రాజీనామాలు తప్ప మరో దిక్కులేదనీ స్పష్టం చేశారు. అప్పుడు అభయమిచ్చిన కోర్ కమిటీ సభ్యులు, యధావిధిగా విషయాన్ని చెత్తబుట్టలో పడేశారు. నెలరోజులైనా సోనియా నుంచి దానిపై స్పందనే లేదు. కానీ, రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించిన వెంటనే, హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. కొంతమంది నేతలకు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఫోన్ చేసినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల మనసు మార్చడానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణలు మంత్రాంగాన్ని నడిపించారు. ఉదయాన్నే జానారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డిలతో సీఎం సమావేశమవగా, మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలతో బొత్స చర్చలు జరిపారు. రాజీనామాల నిర్ణయంపై వెనక్కి తగ్గాలన్నారు. అయితే.. సమావేశానికి హాజరైనవారు మాత్రం, తమ నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ అపాయింట్ మెంట్ కోరిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు ఇవ్వడానికి ఢిల్లీ వెళుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు దానం, ముఖేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహలు మాత్రం రాజీనామాలు చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడినైనందున తాను రాజీనామా చేసినా ఉపయోగం ఉండదని మరో తెలంగాణ వాది వి.హనుమంతరావు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక డెడ్ లైన్ ముగిసేసమయానికి మరికొంతమంది ఎమ్మెల్యేలూ వెనక్కు తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి రాజీనామాల ఆట మొదలవడం అయితే మొదలయ్యింది కానీ, ఎలా ముగుస్తుందన్నదే ఇప్పుడు సస్పెన్స్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి