2, జూన్ 2011, గురువారం
జూన్లో జగడం?
Categories :
జూన్ మొదలయ్యింది. తెలంగాణ ఉద్యమంలో ఈ నెలే కీలకం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అడపాదడపా చిన్నపాటి కార్యక్రమాలను నిర్వహించినా, పూర్తిస్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించడానికి తెలంగాణ జేఏసీ, తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇతర ఉద్యమ సంస్థలు ఎంచుకున్న నెల.. జూన్.
తెలంగాణ ఉద్యమానికి అడ్డుగా ఉన్న పరీక్షలు ముగిసిపోయాయి. జూన్ నెల కూడా మొదలయ్యింది.. ఇక ఉద్యమమే మిగిలింది. తెలంగాణ కోసం మరో విడత పోరాటం మొదలవుతుందా..? గతంలో జరిగినట్లు గ్రామగ్రామాన ఉధృతంగా సాగుతుందా..? పోరాటాన్ని సాగించడానికి తెలంగాణ వాదులు సిద్ధంగా ఉన్నారా..? పోరాటం చేస్తామని అందరూ చెబుతున్నా.. దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా.. ఈసారి జరిగే ఉద్యమంపై ఎన్నో అనుమానాలున్నాయి. తెలంగాణ ఉద్యమం ఇంతకు ముందులా జోరుగా సాగకపోవచ్చు. తెలంగాణ జేఏసీ కూడా ఇంతకు ముందులాకాక బలహీనపడే సూచనలే కనిపిస్తున్నాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా?
ఒకప్పుడు ఒకరికి ఒకరు.. ఇప్పుడు ఎవరికి వారు.. తెలంగాణ విషయంలో అందరిదీ ఒకటే అభిప్రాయం.. ఒకటే లక్ష్యం.. కానీ, ఒకరంటే ఒకరికి పడదు. ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఆధిపత్యం కోసం ఆతృతపడుతుంటారు. ఒకరినొకరు ఇబ్బందిపెట్టుకుంటారు.. తెలంగాణ రాజకీయ నేతల తీరిది. ఒకప్పుడు కలిసికట్టుగా రాష్ట్ర సాధనకోసం రోడ్డెక్కిన నేతలు.. ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. తెలంగాణ జేఏసీ పేరిట ఓ ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేసుకున్న నేతలు.. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి పోరాటానికి సిద్ధమవుతున్నారు.
తెలంగాణ రాజకీయనేతల మధ్య ఐక్యమత్యం లేనేలేదు. ఒకపార్టీకి మరో పార్టీకి ఏమాత్రం పొసగడం లేదు. అందుకే.. జేఏసీ నుంచి ఒక్కో పార్టీ బయటకు వచ్చేసింది. ఉద్యమం మొదలైన కొన్ని రోజులకే కాంగ్రెస్ ఉమ్మడి సంస్థకు దూరమ్యయింది. టీడీపీని జేఏసీనే బహిష్కరించింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా జేఏసీతో సంబంధం లేకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకొంటోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం గ్రామగ్రామాన తీవ్రస్థాయిలో సాగడానికి కారణం జేఏసీనే. రాజకీయ జేఏసీని స్ఫూర్తిగా తీసుకొని గ్రామస్థాయిల్లోనూ జేఏసీలు ఏర్పడ్డాయి. పోరాటాన్ని సాగించాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రం జేఏసీ కార్యకలపాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. టీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటించడంతో.. ఉద్యమం చల్లబడింది. మధ్యలో ట్యాంక్బండ్ ముట్టడి కూడా రసాభాసగా మారింది. ఆ విషయంలోనూ టీఆర్ఎస్ వైఖరి వివాదాస్పదమయ్యింది. ఆ తర్వాత పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశ్యంతో ఆందోళనలను జేఏసీ విరమించుకొంది. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాలనుకొంటోంది.
ప్రస్తుతం జేఏసీ గొడుగులో టీఆర్ఎస్, బిజేపీ, న్యూడెమోక్రసీలు మాత్రమే ఉన్నాయి. ఉద్యమం విషయంలో నిర్లయాలను టీఆర్ఎస్ తీసుకొని, వాటిని జేఏసీపై రుద్దుతుందన్న ఆరోపణలున్నాయి. జేఏసీ స్వతంత్రంగా పనిచేయాలంటూ బీజేపీ కూడా కోరుకొంటోంది. టీఆర్ఎస్ వల్లే జూన్ వరకూ ఉద్యమం వాయిదా పడిందన్న విమర్శలను కూడా ఇతర పార్టీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉద్యమాన్ని ఉధృతం చేయడం జేఏసీకి ఎంత ముఖ్యమో.. టీఆర్ఎస్కూ అంతే ముఖ్యం. అందుకే, పూర్తిస్థాయిలో జేఏసీకి టీఆర్ఎస్ నేతలు సహకారం అందించవచ్చు. ఇక, బీజేపీ కూడా తెలంగాణపై సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కన్నా తెలంగాణ విషయంలో తమకే చిత్తశుద్ధి ఉందని చెబుతోంది.
తెలంగాణలో కీలకమైన పార్టీలు జేఏసీకి సహకరించకుండా, తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో మళ్లీ నిర్మించడం జేఏసీ వల్ల కాదు. అందుకే.. ఉద్యమంలో కలిసొచ్చే వారందరినీ కలుపుకొని వెళ్లాలనుకొంటోంది. టీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగిలిన పార్టీలు కూడా జేఏసీకి సహకరిస్తే.. జూన్లో జరిగేది జగడమే. కానీ, అదెంతవరకూ సాధ్యం అన్నదే అసలు ప్రశ్న.
జేఏసీకి దూరంగా కాంగ్రెస్, టీడీపీ?
ఉద్యమం విషయంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు తొందరపడాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇంటాబయటా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ నేతలు, పోరాటంతోనే తేల్చుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ రణభేరి పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన సభకు, టీఆర్ఎస్ శ్రేణుల నుంచి నిరసనలు, అడ్డంకులు ఎదురైనా విజయవంతంగానే నిర్వహించగలిగింది. అదే ఉత్సాహంతో జూన్ 10న తాండూర్లో మరో బహిరంగ సభకు సిద్ధమవుతోంది.
టీడీపీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్ధనరెడ్డి ముందు నుంచీ తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు. పార్టీ పేరు, జెండాను వాడుకోకుండా ఉద్యమించాలన్నందుకు నాగంను టీడీపీ వెలివేసింది. నాగర్కర్నూల్,పరిగిల్లో ఇప్పటికే సభలను నిర్వహించిన నాగం గ్రూప్.. త్వరలోనే ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోనూ సభను నిర్వహించబోతోంది.
ఇక శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణకు ముందు హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత మాత్రం కనుమరుగయ్యారు. తెలంగాణ ఊసే ఎక్కడా ఎత్తలేదు. తెలంగాణ సాధన కోసం ఏమైనా చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావడమే మానేశారు. ఇక తెలంగాణ సాధన కోసమంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టిన యాత్ర కూడా వివాదాస్పదంగా మారింది. రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వడం ద్వారా.. కాంగ్రెస్ నేతల్లో అసలైన తెలంగాణ వాదినని చెప్పుకుంటున్నారు జూపల్లి.
అయితే.. మహబూబ్నగర్లో జూపల్లి చేస్తున్న పాదయాత్ర ఆధిపత్య పోరుకు దారితీసింది. తన నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ మంత్రి డీకే అరుణ అడ్డుకోవడం.. జూపల్లి కూడా వెనక్కి తగ్గకపోవడంతో, ఇది స్వలాభం కోసం చేస్తున్న యాత్రగా మారిపోయింది. కాంగ్రెస్ పెద్దలు వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినా అదీ సఫలం కాలేదు.
మళ్లీ ఉద్యమం పుంజుకోబోతుందని గమనించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ అధిష్టానానికి మరో నెలరోజుల గడువు ఇచ్చారు. జులై 1లోగా తెలంగాణపై ప్రకటన చేయకపోతే, కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కలిసికట్టుగా ఉద్యమించడం కన్నా, వేరువేరుగానే పోరాటం చేయాలనుకుంటున్నారు తెలంగాణ వాదులు. దీనివల్ల వారు ఆశిస్తున్న ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ సాధిస్తే.. తమవల్లే వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వాదాన్ని అడ్డుగాపెట్టుకొని ఇమేజ్ను పెంచుకోవచ్చు. కానీ, విడిపోయి ఉద్యమించడం వల్ల.. అసలు లక్ష్యం నెరవేరుతుందా ?
వాడి తగ్గిందా..? వేడి మొదలయ్యిందా?
తెలంగాణ ఉద్యమం ఏమాత్రం చల్లబడలేదంటోంది తెలంగాణ జేఏసీ. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా కార్యక్రమాలను తగ్గించినంత మాత్రాన ఉద్యమం వాడి తగ్గిపోలేదంటోంది. గతంలో కన్నా మరింత ఉధృతం చేస్తామంటోంది. మే నెలలోనే పోరుబాట పట్టాలనుకున్నప్పటికీ, కార్యాచరణను రూపొందించుకోవడంలో జేఏసీ వెనకబడింది. అందుకే.. జూన్ నెలోలో వీలైనంత త్వరగా బరిలోకి దిగాలనుకొంటోంది. అయితే.. పోరాటాన్ని ఎలా చేయాలనే దానిపై చర్చలు జరుపుతోంది.
పరిస్థితి చూస్తుంటే జూన్లో మళ్లీ జగడం మొదలయ్యేలానే కనిపిస్తోంది. రాష్ట్ర సాధన కోసం గ్రామస్థాయి నుంచి పోరాటం చేయాలనుకుంటున్న జేఏసీ.. తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలే అడ్డంకులని ప్రచారం చేయబోతోంది. ఆ రెండు పార్టీలనే లక్ష్యంగా చేసుకొంటూ ప్రచారం చేయబోతోంది.
అయితే.. తెలంగాణ ఉద్యమం కాస్తా.. పార్టీల మధ్య గొడవగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జేఏసీకి, కాంగ్రెస్-టీడీపీలకు మధ్య ముదురుతున్న వివాదం ప్రభావం తెలంగాణ ఉద్యమంపైనా పడొచ్చు. గతంలో కలసికట్టుగా పనిచేసిన అన్ని పార్టీల తెలంగాణ వాదులు.. ఇకపై పార్టీల వారీగా చీలిపోవచ్చు. ఈ వర్గాల మధ్య గొడవలు జరిగితే కష్టమే. ఓ రకంగా తెలంగాణలో యుద్ధవాతావరణం ఏర్పడడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ పార్టీలను జేఏసీ అడ్డుకుంటే.. దానివల్ల శాంతిభద్రతల సమస్యకూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా ఉద్యమమే పక్కదారి పట్టొచ్చు. దీనికి తోడు నాగం లాంటి నేతలూ కాంగ్రెస్ ,టీడీపీలకు వ్యతిరేకంగా పోటాపోటీగా సభలనూ నిర్వహిస్తే ఏమవుతుందన్నదీ సస్పెన్సే.
రాజకీయపార్టీల దాటవేత ధోరణిని ఎండగట్టాలని జేఏసీ నిర్ణయించుకోవడం వరకూ బాగానే ఉన్నా, ఆ పార్టీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడంపై మాత్రం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి