1, జూన్ 2011, బుధవారం
వివాహేతర సంబంధాలపై మహిళల మోజు
Categories :
పెద్దలు కుదిర్చిన సంబంధం.. ఈడు జోడు అదిరిపోయింది.. అందమైన జంట అని అంతా అనుకున్నారు..
ప్రేమపెళ్లి. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఒకరికొకరు తోడుగా ఉండాలనుకున్నారు.
పెద్దలు కుదిర్చినదైనా, ఎదిరించి చేసుకునేదైనా.. పెళ్లికున్న ప్రత్యేకతే వేరు. ఆ పరమార్ధమే వేరు. ఆడ, మగను ఆలుమగలుగా మార్చే పవిత్రకార్యం వివాహం. భార్యాభర్తలిద్దరూ జీవితాతం ఒకరికొకరు తోడునీడగా ఉండాలన్న ఉద్దేశంతో చేసేదే పెళ్లి. పెళ్లి అయ్యే వరకూ బాగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంతకాలం బాగానే ఉంటుంది. కానీ, రెండుమూడేళ్లు గడుస్తున్నాయో లేదో.. ప్రాబ్లం స్టార్ట్. ఒకప్పుడు భర్తలనుంచి ఎక్కువ సమస్యలు. కానీ, ఇప్పుడు భార్యల నుంచి వస్తున్నాయి. భర్తకు తగ్గ భార్యగానే మసలుకుంటూనే.. మరో బంధంలో చిక్కుకుంటోంది. కాదు కాదు.. కావాలనే దాని కోరుకొంటోంది.
పవిత్రబంధం ఉండగా.. అపవిత్ర బంధాన్ని ఎంచుకుంటున్నారు. భర్త ఉండగానే .. మరో మగాడిని కోరుకుంటున్నారు. నేటి మహిళల్లో కొంతమంది ఎంచుకుంటున్న కొత్త బంధమిది. చిన్నపాటి పరిచయాలతో మొదలయ్యే సంబంధాలు.. ఎక్కడెక్కడివరకో తీసుకువెళ్లిపోతున్నాయి. గీతదాటేలా చేస్తున్నాయి. పరాయి పురుషుల మోజులో పడి.. సంసారాన్ని నిర్లక్ష్యం చేసుకునేలా చేస్తున్నాయి.
భర్త, పిల్లలు, సలక్షమైన కుటుంబం ఉన్నప్పటికీ, కొంతమంది మగువలు పరాయిపరం కావాలనుకొంటున్నారు. దానికోసం.. కుటుంబం మొత్తాన్ని వదిలేయడానికి సిద్ధపడుతున్నారు. పెళ్లయ్యాక, ఇలా మరొకరితో వెళ్లిపోతున్న కేసులు ఇటీవలికాలంలో విపరీతంగానే పెరిగాయి. పద్దతిగా విడాకులు తీసుకొని, మరో పెళ్లి చేసుకుంటే అందులో ఏ తప్పూ లేదు. దానికి ఎవరూ ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. కానీ, వివాహబంధాన్ని చట్టప్రకారం విడదీసుకోకుండానే, గడపదాటుతున్నారు కొంతమంది మహిళలు. మరొకరితో సెటిల్ అయిపోతున్నారు. పవిత్రబంధాన్ని అపహాస్యం చేస్తున్నారు..
నగరాలు, పట్టణాలకే ఇది పరిమితం అనుకోవడానికి లేదు. గ్రామాలు పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. పెళ్లైనా, పిల్లలున్నా.. మరొకడు నచ్చితే, ముందూ వెనుకా ఆలోచించకుండా వెళ్లిపోతున్నారు. మరో కాపురం పెట్టేస్తున్నారు. లోక్లాస్ నుంచి హైక్లాస్ వరకూ అన్ని వర్గాల్లోనూ ఈ తరహా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచానికే ఆదర్శప్రాయమని మనం చెప్పుకునే భారతీయ విలువలను పతనం దిశగా నడిపిస్తున్నాయి. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి..? తప్పు ఎవరిలో ఉంది..? ఆడవాళ్లలోనా..? మగవాళ్లలోనా..? లేక, తప్పుగా చూస్తున్న సమాజంలోనా..?
కారణం ఏమిటి?
మహిళలు గీతదాటుతున్నారు. కానీ , దాటడానికి కారణం ఏమిటి? ఇంట్లో భర్త ఉన్నా, మరో మగాడిపై మనసు పడాల్సిన అవసరం ఏమిటి?
వాస్తవానికి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంలో మగాళ్లదే పైచేయి. చాలామంది భర్తలు తమ భార్యలను మోసం చేస్తూనే ఉన్నారు. తరతరాలుగా, యుగయుగాలుగా ఇది జరుగుతూనే ఉంది. పెళ్లి చేసుకున్నా, ఇద్దరు ముగ్గరితో శారీరక సంబంధాలు కలిగిన మగాళ్లు ఇప్పటికీ మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు. ఆ స్థాయిలో కాకపోయినా, స్త్రీలల్లోనూ ఇలాంటి మార్పే వస్తోంది. భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నవారూ క్రమంగా పెరుగుతున్నారు.
వివాహేతర సంబంధాలపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలోనూ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీ వందమంది మగాళ్లలో 28 మందికి, ప్రతీ వందమంది స్త్రీలల్లో 18 మందికి వివాహేతర సంబంధాలున్నాయని బ్రిటన్లో ఇటీవల జరిగిన ఓ అధ్యయనం బయటపెట్టింది. మూడు దశాబ్ధాల్లో ఇదే అత్యధికమట. మన దేశంలోనూ ఇదే స్థాయిలో అక్రమబంధాలుంటాయన్నది అంచనా.
వివాహేతర సంబంధాలవైపు మహిళలు మొగ్గుచూపడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో మొదటిది ఎంజాయ్మెంట్. సెక్స్ను మొక్కుబడి వ్యవహారంగా వారు భావించడం లేదు. పైగా, ఒకప్పటిలా పురుషుడి ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదు. కానీ, బెడ్రూంలో చాలా వరకూ భర్తదే ఆధిపత్యం. అంతా ఆయనకు నచ్చినట్లే జరగాలి. ఇది సహజంగానే ఆమెకు నచ్చదు. అలాగని, అక్కడ ఫ్రీగానూ ఉండలేదు. భర్త దగ్గర ముడుచుకుపోయి ఉండే భార్య.. ప్రియుడి దగ్గర మాత్రం చాలా ఫ్రీగా ఉంటుందట. పైగా, వెరైటీని ఎక్కువగా కోరుకునేవాళ్లూ ఈ తరహా బంధాలపై మోజు పెంచుకుంటున్నారు.
భర్తతో పడకసుఖం సరిగా పొందలేని సందర్భాల్లోనూ మహిళలు పక్కదారులు వెదుక్కుంటున్నారు. తమకు నచ్చినవారితో కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా చేయడానికి భయపడేవారేమో కానీ, ఇప్పుడు మాత్రం ధైర్యంగా తోడును వెదుక్కుంటున్నారు. ఉమ్మడి కుటుంబాలు పోయి.. చిన్నకుటుంబాలు ఏర్పడడంతో, స్త్రీని నియంత్రించేవారూ ఉండరు. భర్త జాబ్కు వెళితే.. భార్య ఒంటరిగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే కొత్త వ్యక్తులు.. వారిని లొంగదీసుకుంటున్నారు. మాటల్లో ముంచి, వారి మనసు దోచుకొని.. ముగ్గులోకి దించుతున్నారు. భార్యా భర్తల మధ్య సరైన అవగాహన లేకపోయినా, భర్తంటే భార్యకు ఇష్టం లేకపోయినా కొత్త బంధాలకోసం వెదుక్కుంటారు. ఇంట్లో అన్నీ ఉన్నా, భర్త బాగా చూసుకుంటున్నా, గీత దాటే మహిళలూ ఉన్నారు. సెక్స్ కోసం వెంపర్లాడే కొంతమంది ఇలా పక్కదారి పడుతున్నారు. హైఫై సొసైటీలో ఈ తరహా మహిళలు ఎక్కువగా తారసపడుతుంటారు.
వరసగా కేసులు
భార్య మోసం చేస్తోంది.. తాను కూడా మోసపోతోంది. వివాహేతర బంధాల్లో చిక్కుకొని సర్వం కోల్పోతోంది. పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని మరిచిపోయినందుకు ఫలితాన్ని అనుభవిస్తోంది. తొందరపడినందుకు... పవిత్రమైన బంధాన్ని వద్దనుకున్నందుకు జీవితాన్ని కోల్పోతోంది. ఇలా చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ, అందుకు సాక్షాలున్నాయి. మన కళ్లముందే చోటుచేసుకున్న సంఘటనలున్నాయి. విశాఖపట్నంలో ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా బయటకొచ్చాయి.
దివ్యది సాలూరు. ఈడు రాగానే, మేనమామతో పెళ్లయ్యింది. కానీ, ఆమె మరొకరిని కోరుకొంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మళ్లీ మనసు మారింది. మరొకరిపై మోజు పడింది. భర్తను,కన్నబిడ్డలను వదిలి అతనితో వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి సీన్ మారింది. పెళ్లిచేసుకోనని అతను తెగేసిచెప్పేసరికి.. హంతకురాలిగా మారింది. నిద్రపోతున్నప్పుడు చున్నీని మెడకు బిగించి ప్రాణం తీసింది. ఇప్పుడు జైలుపాలయ్యింది. రెండు పెళ్లిళ్లు.. ముగ్గురు మగాళ్లు.. కానీ, ఇప్పుడు మాత్రం ఆమె ఒంటరిగానే మిగిలింది. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంటే.. కన్నీరుపెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. గాడి తప్పినందుకు ఫలితం అనుభవిస్తోంది.
ఇది మరో విషాధగాధ. పెళ్లై చక్కగా ఉంటున్న వరలక్ష్మి అనే మహిళ జీవితంలోకి మరో యువకుడు వచ్చాడు. పిన్నీ అంటూ పిలిచి వరసకలుపుకున్నాడు. వరసను మర్చిపోయి లొంగదీసుకున్నాడు. ఆమె కూడా క్రమంగా అతని మాయలో పడింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త బయటకు గెంటేశాడు. చేరదీస్తాడనుకున్న ప్రియుడు చేయిచ్చాడు. మరో పెళ్లి చేసుకున్నాడు. మరి.. ఈమెను సాకేదెవరు.. ? తనకు న్యాయం చేయమంటూ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది.
తనకు నచ్చినట్లుగా బతకాలనుకొంది మరో మహిళ. ప్రేమించి పెళ్లి చేసుకుంది విశాఖకు చెందిన రత్నం. ఎనిమిదేళ్లు కాపురం చేసింది. ఇద్దరు పిల్లల్ని కనింది. కానీ ఆమెకు మరో యువకుడు పరిచయం అయ్యాడు. భర్తపై నుంచి మనసు అతనిపైకి మళ్లింది. భర్తను అడ్డుగా భావించిన ఆమె.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. భర్త ప్రాణం తీసింది.
హైదరాబాద్లోనూ ఇలాంటిదే మరో కేసు. ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిన ఓ ఇల్లాలు అత్తను చంపేసింది. ఇంట్లో బంగారం, డబ్బు తీసుకుని వెళ్లిపోవడానికి ప్లాన్ చేసి, భర్త, అత్తకు మత్తుమందు ఇచ్చింది. వారు స్పృహలో లేని సమయంలో ప్రియుడితో కలిసి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యింది. కానీ, అత్తకు మెలకువ రావడంతో.. ఆమెను హత్య చేసింది. ఇద్దరూ జైలుగోడలపాలయ్యారు.
గుణపాఠాలు
ఒకరు నచ్చక మరొకరిని మార్చిన దివ్య.. మూడో మనిషి చేతిలో ఘోరంగా మోసపోయింది. అప్పుడు గానీ, ఆమె చేసిన తప్పేమిటో తెలియలేదు. అందుకే.. హంతకురాలిగా మారింది. ఇక ప్రియుడి కోసం భర్తలను, కుటుంబ సభ్యులను కడతేర్చుతున్న ఆడవాళ్లూ ఉన్నారు. ఈ తప్పు ఆడవాళ్లదేనా..? ఆడవాళ్లనే మనం నిందించడం కరెక్టేనా..? వారి పాత్ర ఎక్కువగానే ఉన్నా.. ఈ పరిస్థితికి మగాళ్లు కూడా బాధ్యులే. భార్యను బొమ్మగానే చూస్తే ఇలాంటివే జరుగుతాయి. భర్తగా అజమాయిషీ చేయడం కాదు.. ప్రేమను పంచాలి. అప్పుడు.. మరో మగాడి గురించి ఆలోచించే అవకాశమే ఏ మహిళకూ ఉండదు.
తాత్కాలిక సుఖంకోసం వెంపర్లాడే స్త్రీలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. వివాహబంధమంత బలమైంది.. ఏదీ లేదు. కేవలం శారీరక కోర్కెలు తీర్చుకోవడానికే మహిళలను ప్రలోభ పెట్టే మగాళ్లుంటారు. మోజు తీరగానే వదిలేస్తారు. అలాంటి వారి కోసం కుటుంబాన్ని, భర్తను వదిలివెళ్లాల్సిన అవసరం లేదు. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుని, భర్తను మోసం చేయాల్సిన పనిలేదు. ఇటు భర్తను మోసం చేసి. .అటు ప్రియుడి చేతిలో మోసపోయి.. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
ఒకవేళ భర్త నచ్చకపోయినా, అతనితో సుఖపడలేకపోతున్నా, చట్టప్రకారం విడిపోవడానికి మార్గాలున్నాయి. ఆ తర్వాత నచ్చినవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. అంతేగానీ, వివాహబంధంలో ఉండగానే.. మరో తోడును వెదుక్కోకూడదు. అది లేనిపోని సమస్యలను సృష్టిస్తుంది. మీ పరువు ప్రతిష్టలను దిగజార్చుతుంది. అంతేకాదు.. ఇలా వివాహేతర బంధాల్లో చిక్కుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మహిళల పిల్లలూ అనాధలుగా మిగిలిపోతున్నారు. అటు భర్త..ఇటు ప్రియుడు ఎవరూ వారిని ఆదరించరు. మరి వారి పరిస్థితి ఏమిటి? అందుకే.. తప్పు చేసేముందు ఒక్కసారి ఆలోచించండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇక్కడ వివాహేతర సంబంధాలు ఎంత మందికి ఉన్నాయనేది ప్రశ్న కాదు. ఇక్కడ డబల్ స్టాండర్డ్స్ని ప్రశ్నించాలి. మగవాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే రంకు అనుకునే హిపోక్రిటిక్ సమాజం ఇది.
అవును ప్రస్తుత సమాజములో ముళ్ళెల్లి ఆకు మీద పడ్డా, ఆకెల్లి ముళ్ళు మీద పడ్డా విరిగేది ముళ్ళే .. తప్పు మగడిదే. మగాడు అక్రమ సంభంధము పెట్టుకుంటే నేమో.. సలక్షణమైన భార్యను ఇంట్లో పెట్టుకుని తప్పుడు దార్లు తొక్కుతావా అని మగాడిని కడిగేయాలి. ఒక వేల స్త్రీ అక్రమ సంభందం పెట్టుకుంటే.. భర్త సరిగా చూడలేదు కాబట్టి, పురుషాహంకారాన్ని భరించలేక పోయింది కాబట్టి అక్రమ సంభందం పెట్టుకుంది అని భావించాలి, భర్తల్ని కడిగి పారేయాలి. అలా బ్రైన్ వాష్ చేయబడ్డాం మనం. ఆడవారి తప్పులన్నీ పరిష్తితుల ప్రభావాలు, మగాడి తప్పులన్నీ అతని దౌర్భల్యాలు అనుకునే స్థాయికి మనము ఎదిగాం. నవ సమాజం ఎంతో దూరములో లేదు. జస్ట్ కొంత దూరం ఉంది అంతే.
A study shows WOMEN are the biggest cheats - they're just better at lying about it
http://www.dailymail.co.uk/femail/article-1211104/Think-men-unfaithful-sex-A-study-shows-WOMEN-biggest-cheats--theyre-just-better-lying-it.html
సామాజిక శాస్త్రవేత్తలు ఈ రుగ్మత గురించి లోతుగా అధ్యయనం చేయాలి. మొగుడూ పెళ్ళాల మధ్య ఆరోగ్యకరమైన మానసిక శారీరక బంధం ఉంటే ఇలా జరగడం తగ్గుతుందేమో?
ఇక్కడ శ్రీకాంతుగారి అభిప్రాయమే నాదీనూ.
ఒక మగాడు పెట్టుకునే అక్రమసంబధాలకేమో చట్టప్రకారం శిక్ష. అదే ఆడది పెట్టుకుంటే కేవలం మందలింపు. ఇదెక్కడి సమానత్వం అని ప్రశ్నిస్తే వాడు మగపశువు. స్త్రీవాదం అంటూ మీద పడిపోతారు. ఎలాంటి విలువలైనా సమయంతోబాటు మారక తప్పదు. సాక్షాత్తూ ధర్మం అయినా మారక తప్పదని హిందూమతం చెబుతుంది. తప్పును తప్పుగానే నిర్వచించాలి, అలాగే శిక్ష ఎవరికైనా సమానంగానే ఉండాలి. ఒక తప్పును మరో తప్పుతో సరిచేయాల్సిన అవసరంలేదు.
అధోగతి..! అధోగతి..! అధోగతి..! రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు అధోగతి..! అనాదరణకు గురి..! వారి లేతమెదడులో తొలిచే పురుగులు....? రెండు కుటుంబాలకు చెందిన యువతీ యువకుల భవితపై మచ్చ, కష్టపడి పైకి వద్దామనుకునే దగ్గరి చుట్టాల పిల్లలకు ఈ వార్త సృష్టించే తలవంపులతో ఏకాగ్రత భగ్నమౌతుంది, అవమానానికి, అపహస్యానికి కారణమౌతుంది! గౌరవంగా బ్రతికి, కోరికలను చంపుకుని పొదుపుచేసి, కూడూ గుడ్డా సమకూర్చి, పెద్దచేసి, గూడు ఏర్పరచి, నలుగురిలో మాటకు విలువ కలిగిఉన్న ఇరు కుటుంబాలకు చెందిన పెద్దతరం వారి పెద్ద హృదయాలకు తూట్లు, గాట్లు, పోట్లు...! హృదయభారంతో ముద్ద కూడా ముట్టబుద్దికాని చిత్రవధ..? తాము చేయని తప్పుకు శిక్ష...? భగ్న హృదయులౌతారా...? ఆప్యాయతలు అంతమై, ఆత్మీయతలు అడుగంటి, ప్రేమలు కరువై...! లెక్కలేనన్ని దుష్పరిణామాలు...! ఆపై...? ధూర్తుల రంగప్రవేశం...! వారి పాచిక పారిందిగా...! వికటాట్టహాసం...! చీకటి ప్రపంచంలోనికి సకుటుంబ సమేతంగా రమ్మని, వెకిలి హృదయంతో అహ్వానించి, దుర్గుణగణ సభ్యులుగా నమోదు చేసి, నంగనాచిబుద్దులు నేర్పి....! పాపకూపంలో పడవేసి, వికృతమైన ఆనందాన్ని పొందడం...! అధోలోకం...! బురద, రొచ్చు, రొంపి, ఊబి, పాకుడు రాళ్ళు, మాయని మచ్చ..? మకిలి... ఒకే...? ప్రొసీడ్...!