27, మే 2011, శుక్రవారం
నాగం మనసులో ఏముంది?
Categories :
నాగంపై వేటు పడుతుందా లేదా అన్న సందిగ్ధానికి తెరపడింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు ముందే, నిర్ణయం వెలువడింది. దీనిద్వారా, మహానాడుకు రానివ్వకుండా నాగంను నిరోధించగలిగారు చంద్రబాబు. మరి ఇప్పుడు నాగం మనసులో ఏముంది..? నాగం ఏ పార్టీలో చేరతారు..? సొంత పార్టీ ప్రయత్నాలు చేస్తారా..?
వైఎస్ జగన్తో నాగం సన్నిహితంగా ఉంటున్నారని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. ఇప్పుడు బహిష్కరించడానికి టీడీపీ తెలంగాణ నేతలు చూపిస్తున్న సాకు కూడా అదే. తెలంగాణ ముసుగులో తెలుగుదేశం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాన్ని నాగం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే.. జగన్ పార్టీలో చేరే విషయాన్ని మాత్రం నాగం ఖండిస్తూ వచ్చారు.
ప్రస్తుతానికి నాగం మైండ్లో పెద్ద ప్లానే ఉంది. ఇతర పార్టీల్లో చేరి ఒకరి కింద పనిచేయడం నాగంకు ఏమాత్రం ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమాన్నిఊతంగా చేసుకొని రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలనుకొంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా పార్టీని పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పార్టీ పెట్టాల్సి వస్తే తన వెంట ఎంతమంది ఉంటారన్నదానిపై ఇప్పటికే నాగంకు అవగాహన ఉంది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ ద్వితీయ శ్రేణిని లక్ష్యంగా చేసుకొనే నాగం అడుగులు వేయవచ్చు. తెలంగాణ ఉద్యమంలో పార్టీల జెండాలు పక్కన పెట్టి, ఉద్యమం సాగించాలంటున్న నాగం... మరికొంత కాలం పాటు అదే మార్గంలో ప్రయాణించవచ్చు. తెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యమ సంస్థలను, సంఘాలను కలుపుకొని పోరాటాన్ని చేయొచ్చు.
పార్టీ జెండా లేకుండా వెళితేనే, తన నాయకత్వానికి ఎక్కువ మద్దతు లభిస్తుందన్నది నాగం విశ్వాసం. ఇప్పుడు, టీడీపీ అధినాయకత్వాన్ని ధిక్కరించి చేస్తున్న నగారాలనే మరింతగా నిర్వహించాలని నాగం అనుకుంటున్నారు. తెలంగాణ అంతటా పర్యటించి, జనం మద్దతును కూడగట్టాలనుకుంటున్నారు. అంతేకాదు.. తెలంగాణ విమోచన దినోత్సవం అయిన సెప్టెంబర్ 17 నాటికి, సొంత పార్టీని కూడా ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు నాగం జనార్ధనరెడ్డి.
నాగం నిలబడతారా..?
తెలంగాణ వాదం.. మిగిలిన పార్టీలకన్నా తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా ఇరుకున పెడుతూ వస్తోంది. పదేళ్లుగా తెలంగాణ దెబ్బకు, టీడీపీ దెబ్బతింటూనే ఉంది. కేసీఆర్ రూపంలో తొలిసారి టీడీపీకి షాక్ తగిలింది. తెలంగాణ నినాదంతో.. చంద్రబాబు నాయకత్వాన్ని ఎదిరించి కేసీఆర్ టీడీపీకి గుడ్బై చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి మరోసారి జీవం పోశారు. పోరాటాన్ని పతాకస్థాయికి చేర్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి, కాంగ్రెస్ టీడీపీలకు దీటుగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని గ్రామగ్రామాన పార్టీని విస్తరించగలిగారు. తెలుగుదేశాన్ని వదిలి రావడం ద్వారా, సమున్నతస్థాయికి చేరుకోగలిగారు KCR.
కేసీఆర్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, దేవేందర్గౌడ్ కూడా అదే బాటను ఎంచుకున్నారు. టీడీపీలో నెంబర్ టు స్థానాన్ని వదులుకొని, నవ తెలంగాణ పేరిట సొంతపార్టీని పెట్టుకున్నారు. మొదట్లో కాస్త హడావిడి చేసినా.. కేసీఆర్లా నిలబడలేకపోయారు దేవేందర్. ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలో పార్టీని విలీనం చేశారు. ఎంపీగా,ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన ఆశలు పేకమేడల్లా కూలిపోయాయి. దీంతో.. తిరిగి తెలుగుదేశంలోనే చేరారు. కానీ, అప్పటి వైభవం, ఆ స్థాయి ఇప్పుడు దేవేందర్గౌడ్కు లేవనే చెప్పొచ్చు.
ఇప్పుడు నాగం వంతొచ్చింది. నాగం మరో కేసీఆర్ అవుతారా..? లేక మరో దేవేందర్గా మిగిలిపోతారా అన్నదే ఇప్పుడు ఆసక్తి కరం. పార్టీనే సస్పెండ్ చేసింది కాబట్టి, తెలంగాణ సెంటిమెంట్ను వీలైనంత ఎక్కువగా క్యాష్ చేసుకునే అవకాశం నాగం ముందుంది. పైగా, కేసీఆర్ అంటే పడని వర్గాలు నాగంకు మద్దతు ఇవ్వొచ్చు. దీనికి తోడు టీడీపీ తెలంగాణ ఫోరం నేతగా క్రియాశీలకంగా వ్యవహరించారు జనార్థనరెడ్డి. చంద్రబాబును ధిక్కరించి మరీ పోరాటం చేశారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి కేడర్లో పట్టుసంపాదించుకున్నారు. టీడీపీలోనే అసంతృప్తితో ఉన్నవారందరినీ నాగం తనవైపు తిప్పుకోవచ్చు. కేసీఆర్కు, చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా ఎదగాలన్నదే నాగం ఉద్దేశం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి