17, మే 2011, మంగళవారం
గన్ సిటీ
Categories :
తుపాకులు పేలుతున్నాయి.. తూటాలు దూసుకువస్తున్నాయి. అనుకున్న పనిని చేసి పెడుతున్నాయి. ఇది తుపాకీ రాజ్యం. గన్ ఉన్నవాడే ఇప్పుడు మొనగాడు.. పిస్టల్ చేతిలో ఉంటే.. ఏ పనైనా చేయించుకోవచ్చు.. తేడా వస్తే.. ప్రత్యర్థి అంతు చూడొచ్చు. ఒకటీ రెండు కాదు.. వరసగా సంఘటనలు.. ఎన్నో ఘోరాలు.. అన్నింటికీ కారణం తుపాకులే. విచక్షణారహిత కాల్పులే. అందుకే, హైదరాబాద్ ఇక హైటెక్ సిటీ ఏమాత్రం కాదు.. గన్సిటీ.
ఏప్రిల్ 30, 2011
హైదరాబాద్ బార్కాస్ వద్ద మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై కాల్పులు.
అక్బరుద్దీన్కు, మహమ్మద్ పహిల్వాన్కు మధ్య ఉన్న విబేధాలు కాల్పులకు దారితీశాయి. అక్బర్ను అడ్డుతొలిగించుకోవడం కోసం స్కెచ్ వేసిన పహిల్వాన్ అనుచరులు ఈ దాడికి ఒడిగట్టారు. పాదయాత్ర చేసి వచ్చిన అక్బరుద్దీన్పై కాల్పులకు జరిపారు. మరో ఎమ్మెల్యే గన్మెన్ వెంటనే కాల్పులు జరపడంతో, అక్బరుద్దీన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నారంటే, పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడిలో అత్యాధునిక గన్ వాడినట్లు సమాచారం.
జనవరి 3, 2011
మద్దెలచెర్వు సూరి హత్య.
సూరిని బలితీసుకొంది కూడా తుపాకులే. సూరిని వెన్నంటి ఉండే భానుకిరణే ఈ హత్యకు తెగించాడు. కారులో వెళుతుండగా, పాయింట్ బ్లాక్ రేంజ్లో ఫైర్ చేశాడు. సూరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. సూరిపై కాల్పులు జరిపిన భానుకిరణ్ను ఇంతవరకూ పోలీసులు పట్టుకోలేకపోయారు.
డిసెంబర్ 2, 2007
ఐ.ఎస్.సదన్ చౌరస్తాలో తుపాకులు పేలాయి. మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్ట్ వికారుద్దీన్.. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యాడు.
మే 18, 2009..
ఫలక్నామా పోలీస్ పికెట్పై కాల్పులు. ఇదీ వికారుద్దీన్ పనే. ఈ కాల్పుల్లో హోంగార్డ్ బాలస్వామి చనిపోగా, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు.
మే 14, 2010
శాలిబండ పోలీస్ పికెట్పై మళ్లీ కాల్పులు. ఈ సారి దాడి చేసిందీ వికారుద్దీన్ గ్యాంగే. ఈ కాల్పుల్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేశ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సంఘటలన్నీ దాదాపుగా పట్టపగలు జరిగినవే. ఇవే కాదు.. ఎన్నో సంఘటనల్లో తుపాకులు బయటకు వస్తున్నాయి. దోపిడీలు, దొంగతనాల్లోనూ గన్స్ వాడకం ఈ మధ్య విపరీతంగా పెరిగింది. తాజాగా.. హైటెక్ సిటీ సమీపంలో తుపాకీతో బెదిరించి కారును దుండగులు దొంగిలించారు..రౌడీషీటర్లు, గుండాలు, పోకిరీలు, ఈ తుపాకులను ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తరచూ తుపాకులను బయటకు తీస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అసలు.. ఇంతగా తుపాకులు రాజధానిలోకి ఎలా వచ్చాయి. ? హైదరాబాద్ ముంబైలా మారిపోతోందా..? మాఫియా ముఠాలకు కేంద్రమవుతోందా..? ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు..? గన్ కల్చర్కు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు?
జస్ట్ 5 వేలు..
హైదరాబాద్లో గన్ సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త ఖర్చు పెట్టగలిగితే చాలు రివాల్వర్ను దక్కించుకోవచ్చు. వాస్తవానికి పోలీస్ డిపార్ట్మెంట్కు దరఖాస్తు చేసుకుని, వారు అనుమతిస్తేనే తుపాకీ కొనుక్కోవాలి. ప్రాణరక్షణకు అత్యంత అవసరమైతేనే ఈ లైసెన్స్ లభిస్తుంది. కానీ, హైదరాబాద్లో ఉంటే.. ఇవేమీ అక్కర్లేదు. లైసెన్స్ లేకుండా, మీకు గన్ సంపాదించుకోవచ్చు. ఆయుధాల వాడకం హైదరాబాద్లో విపరీతంగా పెరిగింది. ఐదేళ్ల క్రితంతో పోల్చితే రెండుమూడింతలు అయిపోయింది. రాజధానిని కేంద్రంగా చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారంతా, ఆయుధాలను సంపాదించుకొంటున్నారు. సక్రమంగా లైసెన్స్ వస్తే సరే, లేదంటే, అక్రమ ఆయుధాలను కొనేస్తున్నారు. ఇక, గుండాలు, రౌడీషీటర్లు, చోటామోటా నేతలైతే.. పూర్తిగా అక్రమ ఆయుధాలనే ఉపయోగిస్తున్నారు. ఇల్లీగల్ వెపన్స్ వల్ల వారికి కలిగే లాభాలు చాలానే ఉంటాయి. కాల్పులు జరిపినా, ఎవరు చేశారో గుర్తించడం పోలీసులకు కష్టమవుతుంది. అందుకే, వీటిని కొనుగోలు చేయడానికే మాఫియా ముఠాలు మొగ్గు చూపుతున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4900 గన్ లైసెన్స్లుంటే.. దాదాపు పదిహేను వేల వరకూ అక్రమ తుపాకులు ఉంటాయని అంచనా. పైగా, ఈ వెపన్స్ను ఉపయోగిస్తున్నదెవరో, ఎక్కడ ఉన్నారో తెలియదు. సరిగ్గా ఇదే సాకుతో గుండాలు, రౌడీషీటర్లు ఆయుధాలను విపరీతంగా కొంటున్నారు. ఈ మధ్య వరసగా తుపాకుల అలజడితో కలవరపడ్డ పోలీస్ యంత్రాంగం, వెరిఫికేషన్ బాట పట్టింది. ఇందులోనూ అవాక్కయ్యే విషయాలు తెలిశాయి. 4900 లైసెన్సులకు గాను, 6500 వెపన్స్ ఉన్నట్లు బయటపడింది. ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్లో అక్రమఆయుధాలు చాలాసార్లు బయటపడ్డాయి. మాఫియాముఠాలు పట్టుబడ్డ ప్రతీసారి పెద్ద ఎత్తున ఆయుధాలను దొరుకుతున్నాయి. ఇక అంతరాష్ట్ర దొంగలు, అరాచక శక్తులను అరెస్ట్ చేసినప్పుడు కంట్రీమేడ్ వెపన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్లోనూ కొన్ని చోట్ల నాటు తుపాకులు తయారవుతున్నా, ఎక్కువ భాగం మాత్రం ఇతర ప్రాంతాలనుంచే దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, బీహార్లోని ధన్బాద్ నుంచి అక్రమాయుధాలు హైదరాబాద్కు సరఫరా అవుతున్నాయి.
ఇక విదేశాల నుంచి వచ్చే ఆయుధాలు నేపాల్ నుంచి దండకారణ్యం మీదుగా, పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ సరిహద్దుల గుండా మనదేశంలో వస్తున్నాయి. అక్రమ ఆయుధ వ్యాపారాలు చేసే ముఠాలు, అత్యంత రహస్యంగా వీటిని తరలిస్తున్నాయి. హైదరాబాద్లో ఆయుధాలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో, ఇక్కడ అమ్మకాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. నమ్మకమైన ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వీటిని విక్రయిస్తుంటారు.
పిస్టల్, రివాల్వర్ లాంటి చిన్న చిన్న తుపాకులు హైదరాబాద్ బ్లాక్ మార్కెట్లో 5 వేల నుంచి 10 వేల మధ్య దొరుకుతున్నాయి. పార్టీని బట్టి, రిస్క్ను బట్టి రేటు మారుతుంది. వీటిల్లోనూ రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇవికాక బ్యారెల్ గన్స్ను కూడా ఎక్కువగానే అమ్ముతున్నారు. వీటి ధర పదివేల పైనే ఉంటుంది. నాటు తుపాకులైతే రెండుమూడు వేలకే అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు తపంచాలు ఎక్కువగా అమ్ముడైనా, ఇప్పుడు మాత్రం అటోమెటిక్స్ వెపన్స్నే ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు. లైసెన్స్డ్ వెపన్స్తో పోల్చితే, వీటి ధర కూడా తక్కువే. పాయింట్ 32 వెపన్ లైసెన్స్తో కొనుగోలు చేయాలంటే కనీసం పాతికవేలు ఖర్చు పెట్టాలి. అదే బ్లాక్మార్కెట్లో అయితే.. 5 వేలు పడేస్తే చాలు. అందుకే, అక్రమఆయుధాల అమ్మకాలు ప్రతీ ఏటా వృద్ధి చెందుతున్నాయి. ప్రతీ ఒక్కరికీ గన్ను అందుబాటులోకి తెస్తున్నాయి.
అమెరికా స్థాయికి వెళతామా..?
హైదరాబాద్లో గన్కల్చర్ పెరిగిపోతోంది. ఆయుధాల వాడకం విస్తృతమవుతోంది. చిన్నచిన్న దొంగలు సైతం గన్స్ పట్టుకొనే పొజిషన్ వచ్చేసింది. చూస్తుంటే.. మనం కూడా అమెరికా స్థాయికి ఎదిగిపోతామేమో అనిపిస్తోంది. గన్కల్చర్ అనగానే అమెరికానే గుర్తొస్తుంది. తుపాకీ చేతిలో పట్టుకోవడం, కోపం వస్తే కాల్చేయడం అక్కడ కామన్. అక్కడ తుపాకీ ఉన్నవాడిదే రాజ్యం. వాడు చెప్పింది చేయకపోతే.. ఇలాగే జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకూ కాల్చేసుకోవడం అమెరికన్లకే చెల్లుతుంది. కావాలంటే.. చూడండి.. ఓ బార్లో గొడవ. ఒకడికి కోపం వచ్చింది. గన్ తీసి కాల్చడం మొదలుపెట్టాడు. అవతలివాడు తక్కువ తిన్నాడా.. వాడూ కాల్చాడు. తుపాకుల మోతతో.. బార్ కాస్తా బోర్డర్ను తలపించింది.
ఈ ఏడాది జనవరిలో డెట్రాయిట్ పోలీస్ట్స్టేషన్లోకి ఓ అంగతకుడు ప్రవేశించాడు. వస్తూనే పోలీసులపైనే కాల్పులు జరిపాడు. పోలీసులూ కాల్పులు జరుపుతున్నా పారిపోకుండా, వారిపై తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో నలుగురు ఆఫీసర్స్ తీవ్రంగా గాయపడ్డారు. చివరకు అగంతుడు పోలీస్ తూటాకు ప్రాణం వదిలాడు. ఇలా పోలీస్ స్టేషన్లోకే చొరబడి కాల్పులు జరపాడంటే.. అక్కడ గన్కల్చర్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫ్లోరిడాలోని ఓ స్కూల్ బోర్డ్ మీటింగ్ జరుగుతుండగా, ఓ వ్యక్తి పోడియం వైపు దూసుకొచ్చాడు. గన్ చేతిలో పట్టుకొని కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. బోర్డ్ మెంబర్లు ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. చివరకు.. సెక్యూరిటీ ఆఫీసర్ కాల్పులు మొదలుపెట్టడంతో, దుండగుడు తనను కాల్చుకుని చనిపోయాడు.
అమెరికన్ స్కూల్స్, యూనివర్సిటీల్లో గన్స్ తరచూ దర్శనమిస్తుంటాయి. గన్ ఎలా వాడాలో తెలియకపోయినా, అమెరికన్ స్టూడెంట్స్ వాటిని స్కూళ్లకు తెస్తుంటారు. చాలా సార్లు ఇలానే కాల్పులకు తెగబడి, తమ తోటి పిల్లలను హతమార్చారు. యూనివర్సిటీల్లో అయితే, ఎన్నో విషాధ సంఘటనలు. కాస్త కోపం వచ్చినా, స్నేహితులపై కాల్పులు జరపడం పరిపాటిగా మారిపోయింది. 2007లో వర్జీనియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఏకంగా 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 37 సార్లు, అమెరికన్ స్కూల్స్, యూనివర్సిటీల్లో కాల్పులు జరిగాయి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా.. అమెరికన్ సర్కార్ మాత్రం పెద్దగా పట్టించుకోదు. ప్రాణరక్షణ కోసం గన్ కొనుక్కోవడం అక్కడ ప్రాథమిక హక్కు.
ఉన్నతవిద్యకోసం, ఉద్యోగావకాశాల కోసం అమెరికాకు వెళ్తున్న మన తెలుగువాళ్లూ.. అక్కడి తుపాకులకు ప్రాణాలు బలివ్వాల్సి వస్తోంది. పెట్రోల్ బంక్లు, మెడికల్షాపులు, వాణిజ్యసంస్థలు, యూనివర్సిటీల్లో జరిగిన కాల్పుల్లో ఎంతోమంది తెలుగువాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్లో తుపాకుల వాడకం పెరుగడం చూస్తుంటే.. మనదగ్గరా అదే తరహా పరిస్థితులు తలెత్తుతాయోమోనన్న అనుమానాలు కలగకమానవు.
పోలీసులు ఏం చేస్తున్నారు..?
మాఫియా ముఠాలకు, డాన్లకు, అండర్గ్రౌండ్ సెటిల్మెంట్లకు ముంబై పెట్టింది పేరు. ఇప్పుడు ఈ విషయంలో ముంబైకు దీటుగా ఎదుగుతోంది హైదరాబాద్. టెర్రరిస్టులకు, స్లీపర్సెల్స్కు అడ్డాగామారిన భాగ్యనగరంలో, రౌడీమూకలు, మాఫియా ముఠాలు పాగా వేశాయి. సెటిల్మెంట్లతో హడలెత్తిస్తున్నాయి. దాడులు హత్యలతో దారుణాలకు ఒడిగడుతున్నాయి. ఆయుధాల వాడకమూ ఈ నేపథ్యంలోనే పెరిగింది. కానీ, వీటిపై పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో నిఘాను పెట్టలేకపోయారు. పోలీసుల నిర్లక్ష్యంతో, అక్రమ ఆయుధాలు నగరంలోకి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. లైసెన్సులు తీసుకున్నవాళ్లు కూడా రెన్యువల్స్ చేయించుకోకుండా, ఇష్టారీతిన వాడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అక్బరుద్దీన్పై కాల్పుల తర్వాత, ఉలిక్కిపడ్డ పోలీసులు హడావిడిగా తనిఖీలు మొదలుపెట్టారు. సిటీలో అరాచకాలు సృష్టిస్తున్న 11 గ్యాంగ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ఆయుధాలను, వాటి లైసెన్స్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం పోలీసుల విధి. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో వెపన్ లైసెన్స్లున్నవారి వివరాలు ఉండాలి. కానీ, హైదరాబాద్లో మాత్రం ఇవేవీ ఉండవు. అసలు లైసెన్స్లు తీసుకున్నవారి అడ్రస్లు ఏమిటో కూడా చాలావరకూ తెలియదు. రాజకీయ పలుకుబడులతో, పరిచయాలతో లైసెన్సులు సంపాదిస్తున్నవారు, వాటిని అక్రమంగా వాడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్కు తలనొప్పిగా మారింది.
ఆయుధాల విషయంలో మన ప్రభుత్వం తీరులోనూ మార్పు రావాల్సి ఉంది. ఇండియన్ ఆర్మ్ యాక్ట్ను తక్షణం సవరించాలి. ఎప్పుడో బ్రిటిష్ పాలనలో రూపొందించిన చట్టంలో ఒక్కో వ్యక్తి మూడు ఆయుధాలను కలిగి ఉండొచ్చని పేర్కొన్నారు. ఒకటి .32 పిస్టల్, మరొకటి డబుల్ బ్యారెల్ గన్, మూడోది రైఫిల్. ప్రాణ రక్షణ కోసం అయితే .32 పిస్టల్ సరిపోతుంది. మిగిలిన సాధారణ పౌరులకు ఏమాత్రం అవసరం లేదు. పైగా, చట్టంలోని లోపాలను సాకుగా చేసుకొని, ఒకే లైసెన్సులపై రెండు మూడు పిస్టల్స్ను కొంటున్నవారూ ఉన్నారు. అందుకే చట్టాన్ని సవరించాలి. అత్యవసరం అయితే తప్ప లైసెన్స్లు ఇవ్వకూడదు. అది కూడా పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లైసెన్స్ ఇవ్వాలి. ఆయుధాలు అమ్మే ఏజెన్సీలపైనా పూర్తిస్థాయి నిఘా ఉండాలి. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆయుధాలు ఎలా వస్తున్నాయో పోలీసులకు తెలియంది కాదు. ఆ మార్గాలనూ మూసేయాలి. అప్పుడే హైదరాబాద్లో ప్రశాంతత నెలకొంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి