2, మే 2011, సోమవారం
చేపలకు చిక్కిన లాడెన్
Categories :
పకడ్బందీ ప్రణాళికతో లాడెన్ను హతమార్చిన అమెరికా, అతని ఆనవాళ్లు కూడా మిగలకూడదని భావించింది. అందుకే, లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో పడేసింది. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారమే అంత్యక్రియలను నిర్వహించామని అమెరికన్ అధికారులు ప్రకటించారు. అయితే.. ఖననం చేయకుండా సముద్రంలో ఎందుకు పడేశారన్నదానికి రెండు కారణాలను చెప్పారు. అవేమిటంటే...
లాడెన్ శవాన్ని సముద్రం పాలు చేయడానికి అమెరికన్ అధికారులు పెద్ద వివరణే ఇచ్చారు. ఇందులో అమెరికా భయమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. లాడెన్ శవాన్ని భూమిమీద ఖననం చేస్తే, దాన్ని అతని మద్దతుదారులు మసీదు కిందో, మహాసమాధి కిందో మార్చేస్తారని అమెరికా భయపడింది. లాడెన్ అనుచరులు, జిహాదీ గ్రూపులకు ఇదో పుణ్యస్థలం అయిపోవడంతో పాటు, లాడెన్ సమాధిని చూసి చాలామంది జిహాదీ బాట పడతారన్న అనుమానం కూడా వచ్చింది. అదే లాడెన్ శవాన్ని లేకుండా చేసేస్తే సమస్యన్నదే ఉండదు. పైగా, ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఖననం చేసిన చోట పెద్ద టోంబ్ను కట్టి, దాన్నో పవిత్ర స్థలంగా ఆయన అనుచరులు మార్చేశారు. అందుకే లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో పడేసేలా చేసింది. ఇక రెండోకారణం లాడెన్ శవాన్ని ఏ దేశం స్వీకరిస్తుందన్న అనుమానం. లాడెన్ సొంత దేశమైన సౌదీలో అతని పౌరసత్వం రద్దయ్యింది. ప్రస్తుతం లాడెన్ దొరికిన పాకిస్తాన్ కూడా తన పౌరుడిగా స్వీకరించదు. శవాన్ని పెట్టుకొని ఎవరు తీసుకుంటారని ఎదురు చూసే బదులు, మాయం చేస్తేనే మేలన్న నిర్ణయానికి అమెరికా సైన్యం వచ్చింది. అందుకే సముద్రంలో పడేసింది. ప్రపంచదేశాలను తీవ్రవాదంతో గడగడలాడించిన లాడెన్ చివరకు చేపలకు ఆహారం అయిపోయాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి