17, ఫిబ్రవరి 2011, గురువారం
కాసుల క్రికెట్
Categories :
క్రికెట్ అంటే మనకు పిచ్చి.. పిచ్పై భారత బ్యాట్స్మెన్ విజృంభించి.. ఫోర్లు, సిక్స్లు బాదుతుంటే.. మనం మనల్నే మర్చిపోయేంత పిచ్చి. ఆ పిచ్చే ఇప్పుడు చాలామందికి వరంగా మారింది. కోట్లాది రూపాయలను సంపాదించే మార్గాన్ని చూపిస్తోంది. క్రికెట్ వరల్డ్కప్ జరిగే కొన్ని రోజుల్లోనే.. వేల కోట్లను సంపాదించే వ్యూహాలు... ఇప్పటికే సిద్ధమైపోయాయి..
ఒక్కో సిక్స్ విలువ ఎంతో చెప్పగలరా...? పోనీ ఒక్క ఫోర్ వాల్యూ మీరు గెస్ చేయగలరా..?
సిక్స్ అంటే.. ఆరు పరుగులు.. ఫోర్ అంటే నాలుగు పరుగులు అంటారా..? అది ఆటవరకే... కానీ, క్రికెట్ గ్రౌండ్ను దాటి బయటకు వస్తే వాటిపై జరిగే బిజినెస్ విలువ చాలా ఎక్కువ.. వాటి వాల్యూ తెలిస్తే.. మీకు కళ్లు తిరగడం ఖాయం. అవును.. యూసఫ్ కొట్టబోయే సిక్స్ వాల్యూ.. అక్షరాలా 15 వేల కోట్లు.. అదే ఫోర్ కొడితే.. దాని విలువ వేయి కోట్ల రూపాయలు.
ఇక హర్భజన్ బౌలింగ్లో బ్యాట్స్మెన్ స్టంప్ ఔట్ అయితే.. దాని వాల్యూ 2 కోట్ల రూపాయలు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను జహీర్ ఖాన్ బౌల్డ్ చేస్తే దాని విలువ 5 కోట్లు.. వరల్డ్కప్లో మనవాళ్ల ప్రదర్శనకు ఇది బీసీసీఐ ఇచ్చే రివార్డు కాదు... కనీసం కేంద్రప్రభుత్వమో... క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన నజరానా అంతకన్నా కాదు. మరేమిటి..? బెట్టింగ్.. అవును.. ప్రతీ మ్యాచ్లోనూ ప్లేయర్స్పై జోరుగా బెట్టింగ్స్ మొదలయ్యాయి. వాటివిలువే ఇది..
ఈ బెట్టింగ్ వెనుకున్నది.. చీకటి సామ్రాజ్యాధిపతి దావూద్ ఇబ్రహీం. వరల్డ్కప్ ను బేస్ చేసుకొని కోట్లాది రూపాయల బెట్టింగ్కు సిద్దమయ్యింది డీ-గ్యాంగ్. వరల్డ్కప్ ముగిసేలోగా.. దాదాపు 50 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ను జరపాలనుకొంటోంది. ఇప్పటికే ఢిల్లీ,ముంబై, చెన్నై,కోల్కతా, హైదరాబాద్ లాంటి నగరాల్లో బెట్టింగ్స్ మొదలయ్యాయి. సెల్ఫోన్స్, ఇంటర్నెట్ ఆధారంగా ఈ బెట్టింగ్లను జోరుగా నిర్వహిస్తున్నారు.
ఒక్కో టీంకు ఒక్కో రేటు
ఈ వరల్డ్కప్లో అందరిలానే.. బెట్టింగ్ ముఠాల ఫేవరేట్ కూడా టీంఇండియానే. అందుకే, టీంఇండియా వాల్యూను అతితక్కువగా చూపిస్తున్నారు. టీం ఇండియా బెట్ కాయాలనుకునేవారికి ప్రతీ రూపాయికి 3 రూపాయల 20 పైసలు ఆశ చూపిస్తున్నారు. శ్రీలంకపై ప్రతీ రూపాయికి 4 రూపాయల 90 పైసల విలువకట్టారు. దక్షిణాఫ్రికాకు ప్రతీ రూపాయికి 5 రూపాయల 50 పైసలు ఇస్తారట. ఆస్ట్రేలియాపై బెట్ కడితే.. ప్రతీ రూపాయికి 5 రూపాయల 70 పైసలు ఇస్తారు. ఇంగ్లాండ్ విషయంలో రూపాయికి 5 రూపాయల 85 పైసలు అందుతాయి. పాకిస్తాన్పై డబ్బులు కుమ్మరిస్తే.. ప్రతీ రూపాయికి 10 రూపాయల 50 పైసలు అందుతుంది. ఇక వెస్టిండీస్పై కాయాలనుకుంటే.. ప్రతీ రూపాయికి 21 రూపాయిలు పంటర్కు అందుతాయి. కెన్యా, నెదర్లాండ్స్, కెనడా, జింబాబ్వేలపై బెట్ కడితే.. వారికి 30 రూపాయల పైనే అందుతుంది. టోర్నీ ఇంకా మొదలుకాలేదు కాబట్టి.. ఈ ఎమౌంట్స్ ఫిక్స్ అయ్యాయి. ఒక్కసారి మ్యాచ్లు మొదలై క్వార్టర్స్ మొదలైతే .. ఈ రేట్స్ మారిపోవచ్చు.
ప్రపంచకప్ను ఎవరు గెలుచుకుంటారని మాత్రమే కాదు.. ఏ మ్యాచ్లో ఎవరు ఎలా ఆడతారన్నదానిపైనా జోరుగానే బెట్టింగ్లు సాగుతున్నాయి. పంటర్ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే.. భారీగా డబ్బు చేతికి అందుతుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభం అన్న సూత్రాన్ని బాగా ప్రచారం చేసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు... క్రికెట్ ఫ్యాన్స్ను భారీగా ఆకర్షిస్తున్నారు. క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ ఇటీవలే వెలుగు చూడడంతో.. బుకీల జోరుకు అడ్డుకట్టవేయడానికి ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్లేయర్స్ ఎవరూ ట్విట్టర్లో ట్వీట్స్ ఇవ్వకూడదని ఇప్పటికే నిషేధం విధించింది. ప్రతీ ఆటగాడిపైనా కన్నేసి ఉంచింది. అందుకే బుకీలు తమ బిజినెస్ను పెంచుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. క్వార్టర్స్, సెమీస్కు ఊహించని జట్లు చేరితే.. బెట్టింగ్ బిజినెస్ మరింత పెరగవచ్చు.
క్రికెట్ పైనే ఆశలు..
మన క్రికెట్ జట్టు మళ్లీ ప్రపంచకప్ను దక్కించుకోవాలన్న కోరిక ప్రతీ భారతీయుడిది. ఇది పద్దెనిమిదేళ్ల కల.. 1983లో కపిల్ డెవిల్స్ సాధించిన ఘనతను ఇప్పుడు ధోనీసేన అందుకుంటుందన్న విశ్వాసం ప్రత ఒక్కరిది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. మొదటిది మన దేశంలోనే వరల్డ్కప్ జరుగుతుండడం.. టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడూ లేనంత బలంగా ఉండడం.. ఈ మధ్య వరసగా విజయాలు సాధిస్తుండడం.. అందుకే.. ఈ ప్రపంచకప్ను ఎలాగైనా మనమే దక్కించుకుంటామన్న నమ్మకం అందరిలోనూ కనిపిస్తోంది.
ఎంతో కీలకమైన ఈ వరల్డ్కప్ను చూడకపోతే ఎలా..? అసలే మన నరనరాన క్రికెట్ జీర్ణించుకుపోయి ఉంటుంది. క్రికెట్ సూత్రాలు తెలియకపోయినా, క్రికెట్ ఆడకపోయినా.. క్రికెట్ చూడకుండా ఉండలేనివారు మనదేశంలో కోట్లల్లోనే ఉంటారు. అందుకే.. మనకు క్రికెట్ ఓ ఫ్యాషన్. ఇతర దేశాల సంగతి అలా ఉంచితే.. మన టీం ఆడే ప్రతీ మ్యాచ్నూ మిస్ అవకుండా అంతా చూస్తారు. ఇప్పటికే టీం ఇండియా మ్యాచ్ల టికెట్లు పూర్తిగా అయిపోయాయి. అన్ని స్టేడియాల్లోనూ ఇదే పరిస్థితి. ఆన్లైన్లోనూ టికెట్లు దొరకడం లేదు. పైగా.. వందకోట్ల జనాభాకు.. ఎన్నిస్టేడియాలు సరిపోతాయి.. అందుకే.. కోట్లాది మంది ప్రిఫరెన్స్ టెలివిజన్కే. హాయిగా.. ఇంట్లో కూర్చుని క్రికెట్ చూడడంలో ఉండే మజనే వారు. ఇంటికి వెళ్లే వీలు లేకపోతే.. రోడ్డుపై నిలబడి అయినా చూస్తుంటారు. క్రికెట్ వరల్డ్కప్ను చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునేవారంతా ఇప్పుడు టెలివిజన్స్ కొనడంపై దృష్టిపెట్టారు. పాత టీవీలు ఉన్నవారు వాటిని వదిలించుకుంటూ.. బిగ్ స్క్రీన్, వీడియో క్వాలిటీ ఎక్కువగా ఉండే ఎల్సీడీలు, ఎల్ఈడీలను కొంటున్నారు.
క్రికెట్ ఫ్యాన్స్ను ఆకర్షించడం కోసం.. టెలివిజన్ కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ను ప్రకటించాయి. వరల్డ్కప్ పిరియడ్లో రెండున్నర లక్షల టీవీసెట్లను అమ్మాలని సోనీ లక్ష్యాన్ని విధించుకుంది. సాంసంగ్,పానాసోనిక్, ఎల్.జిలు 50 నుంచి వంద శాతం సేల్స్ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పైగా ఈసారి క్రికెట్ లైవ్ హెచ్డీ క్వాలిటీనూ ప్రసారమవుతుండడంతో.. ఆ ఫార్మాట్ను సపోర్ట్ చేసే టీవీలకే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. టీవీలకు అనుబంధంగా అమ్ముడయ్యే డైరెక్ట్ టు హోం సేల్స్ కూడా క్రికెట్ పుణ్యమా అని బాగానే పెరిగాయి. వరల్డ్కప్నే టార్గెట్ చేసుకుంటూ.. క్రికెట్ లైవ్ అందచేసే ఛానళ్లను అందిస్తూ.. ప్రత్యేక ఆఫర్లను డీటీహెచ్ కంపెనీలు అందిస్తున్నాయి. కేబుల్ ప్రసారాలతో పోల్చితే, డీటీహెచ్ ప్రసారాల క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. క్రికెట్ను ఎంజాయ్ చేయాలనుకునేవారంతా.. డీటీహెచ్ సర్వీసులకే మొగ్గుచూపుతున్నారు. క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా డీటీహెచ్ అమ్మకాల్లో 20శాతానికి పైగా వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయి. దేశంలో అతిపెద్ద డీటీహెచ్ ఆపరేటర్ అయిన డిష్ టీవీ అయితే.. వందశాతం అమ్మకాల వృద్ధిని టార్గెట్గా పెట్టుకొంది. టీవీ కంపెనీలతో టైఅప్ అయ్యి.. కాంబో ఆఫర్లను కూడా డీటీహెచ్ కంపెనీలు అందిస్తున్నాయి.
అటు టెలివిజన్స్.. ఇటు డిటీహెచ్ల రూపేణా దేశవ్యాప్తంగా మూడువేల కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందన్నది మార్గెట్ వర్గాల అంచనా. చెప్పాలంటే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ రంగానికి వరల్డ్ కప్ మంచి ఉత్సాహాన్నే అందిస్తోంది.
స్పోర్ట్స్ ఛానళ్లకు పంట
వరల్డ్కప్ క్రికెట్ అంటే సమ్థింగ్ స్పెషల్. వరల్డ్ ఛాంపియన్లు ఎవరో తేల్చే మహాసంగ్రామం. అందుకే, ప్రతీ మ్యాచ్ను క్రికెట్టీమ్స్ చాలా సీరియస్గా తీసుకొని ఆడతాయి. పైగా ఈసారి టీంఇండియా హాట్ ఫేవరేట్ కావడం... ఇండియాలోనే ఎక్కువమ్యాచ్లు జరుగుతుండడంతో వరల్డ్ కప్పై క్రేజ్ చాలా పెరిగింది. దేశం మొత్తం క్రికెట్కు ఫ్యాన్స్ ఉండడంతో వరల్డ్కప్ టెలివిజన్ రైట్స్ ఊహించని మొత్తాన్ని పలికాయి. ఈఎస్పీఎన్-స్టార్స్పోర్ట్స్ లు ఈ టెలికాస్ట్ రైట్స్ను రెండు వందల కోట్ల డాలర్లకు సొంతం చేసుకున్నాయి. మన కరెన్సీ చెప్పుకోవాలంటే.. ఈ మొత్తం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు సమానం. 220 దేశాల్లో ప్రసారం చేసుకునే హక్కు వీటికుంటుంది. కొన్ని దేశాల్లో ఈ రైట్స్ను ఇతర ఛానళ్లకు స్టార్స్పోర్ట్స్ అమ్మేసింది.
ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేయడానికి ఈసారి మరింత ఆకర్షణీయంగా క్రికెట్ ప్రసారాలు ఉండబోతున్నాయి. మొత్తం 27 కెమెరాలను మ్యాచ్ కవరేజ్ కోసం ఉపయోగిస్తున్నారు. 45 డిగ్రీల కోణంలో తీరిగేలా ఫీల్డ్ కెమెరాలను అమర్చారు. బ్యాట్స్మెన్ రన్నింగ్ను చూపించడానికి మిడ్వికెట్ కెమెరాను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ మ్యాచ్లతో పోల్చితే.. వరల్డ్కప్ కవరేజ్ కాస్త భిన్నంగానే ఉంటుంది.
ఇక టెలికాస్ట్ రైట్స్ కోసం భారీగా ఖర్చుపెట్టిన ఈఎస్పీఎన్-స్టార్స్పోర్ట్ వాటిని రికవరీ చేసుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ప్రతీ పది సెకన్ల ప్రకటనకు రెండు లక్షల నుంచి 20 లక్షల వరకూ వసూలు చేస్తోంది. క్రికెట్ మ్యాచ్లను ఎక్కువమంది చూస్తారు కాబట్టి, కంపెనీలు కూడా భారీగా చెల్లించి ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి. పెద్ద పెద్ద టీమ్ల మధ్య జరిగే మ్యాచ్లకు యాడ్ రేట్స్ మారిపోతాయి.ఇక ఇండియా సెమీస్లోకి చేరిందంటే చాలు.. స్పోర్ట్స్ ఛానళ్లకు పండగే. యాడ్ ఛార్జెస్ను మరింత పెంచుకోవచ్చు. త్రీజీ సర్వీసులు కూడా అందుబాటులోకి రావడంతో.. సెల్ఫోన్లకూ డిమాండ్ పెరిగింది. ఆఫీసుల్లో, టూర్స్లో ఉన్నవాళ్లు.. తమ మొబైల్స్లోనే లైవ్ టీవిని చూసే అవకాశాన్ని త్రీజీ టెక్నాలజీ కల్పిస్తోంది. అందుకే.. ఈ టెక్నాలజీ ఉన్న ఫోన్స్ను ఎక్కువమంది కొనుగోలుచేస్తున్నారు. తమ మొబైల్స్నే క్రికెట్ను చూసి ఎంజాయ్ చేయబోతున్నారు. టెలికాం కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోబోతున్నాయి. ఛానళ్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఓ రకంగా తక్కువ కాల్ రేట్లతో ఆదాయాన్ని పెద్దగా సంపాదించలేకపోతున్న టెలికాం కంపెనీలకు ఈ వరల్డ్కప్ కాసులు కురిపించబోతోంది. లైవ్ అప్డేట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, క్విజ్ కాంపటీషన్స్తో కోట్లను సంపాదించే అవకాశాన్ని వరల్డ్కప్ అందుబాటులోకి తెచ్చింది.
దేశానికీ లాభమే..
ఇంట్లో కూర్చుని ఎల్సీడీ స్క్రీన్లో క్రికెంట్ చూసే అవకాశం ఉన్నా... కొంతమందికి మాత్రం స్టేడియంకు వెళ్లి చూస్తే తప్ప ఎంజాయ్ చేయలేరు. అందుకే, కీలకమైన మ్యాచ్ల టికెట్స్ హాట్కేక్స్లా అమ్ముడైపోతాయి. మ్యాచ్ను నేరుగా చూడడం కోసం.. ఎంతదూరమైనా వెళ్లడానికి ఏమాత్రం వెనుకాడరు. వరల్డ్కప్ మనదేశంలో జరుగుతుండడంతో.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ల నుంచి భారీ ఎత్తున టూరిస్ట్లు వస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 2 మధ్య.. మన దేశంలోకి విదేశీయులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. మన టూరిజాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, మన చారిత్రక సంపదను ప్రపంచానికి చూపించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. అందుకే టూరిజం డిపార్ట్మెంట్ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను చూపెడుతోంది. ముఖ్యంగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ను ఎక్కువమంది సందర్శించవచ్చు.
క్రికెట్ వరల్డ్కప్తో మన హోటల్ ఇండస్ట్రీకీ లాభాలు దక్కనున్నాయి. ప్రధాన నగరాల్లో, మ్యాచ్లు జరిగే ప్రాంతాల్లో హోటల్ రూమ్స్ చాలావరకూ బుక్ అయిపోయాయి. ఇప్పటికీ చాలా హోటల్స్కు కాల్స్ వస్తూనే ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఉండే ఛార్జెస్ను చాలాచోట్ల రెట్టింపు చేసేశారు. అయినా ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. మ్యాచ్లు జరిగే నగరాలను మినహాయిస్తే.. మిగిలిన ప్రాంతాల్లోని హోటల్స్ కూడా వరల్డ్కప్ను వరంగానే భావిస్తున్నాయి. లార్జ్ స్క్రీన్స్ను ఏర్పాటు చేసి మ్యాచ్లను టెలికాస్ట్ చేయడం ద్వారా.. కస్టమర్లను ఆకట్టుకోబోతున్నాయి.
క్రికెట్ టీం జెర్సీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. క్రికెట్ టీమ్స్ను సపోర్ట్ చేయడం కోసం వీటిని ఫ్యాన్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. షాపింగ్మాల్స్తో పాటు ఆన్లైన్లోనూ ఈ జెర్సీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ కంపెనీలు వీటికోసం 250 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తుంటే.. ఐసీసీ అఫీషియల్ మర్చెండైజెస్ మాత్రం కాస్త ఎక్కువే వసూలు చేస్తున్నాయి. ఒక్కో జెర్సీని 25 డాలర్లకు అమ్ముతున్నాయి. అన్ని టీమ్స్ జెర్సీలూ ఐసీసీ ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. క్యాప్స్, విజిల్స్, బ్యాడ్జెస్, బ్యాండ్స్ను కూడా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. క్రికెట్ వరల్డ్కప్తో మన మార్కెట్ స్వరూపమే మారిపోతుంది. సమ్మర్ సేల్స్కన్నా ముందే.. క్రికెట్ సేల్స్ అన్ని కంపెనీలకు విపరీతమైన బిజినెస్ను సృష్టించబోతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి