24, ఫిబ్రవరి 2011, గురువారం
అక్షరశిల్పికి నివాళి
సెగట్రీ! ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ?, ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల.ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
తెలుగునాట ఈ డైలాగ్ ఓ సంచలనం. విలనిజానికే సరికొత్త భాష్యాన్ని చెప్పింది. తెలుగు సినిమాలో విలన్ అంటే కరుడుగట్టి ఉండక్కర్లేదని నిరూపించింది. దాన్ని నిరూపించిన వ్యక్తి ముళ్లపూడి వెంకటరమణ. సంభాషణలను ఎంత బాగా రాయగలడో చెప్పడానికి ఇదో మచ్చుతునక మాత్రమే.
తెలుగంటే రమణకు ప్రాణం. అందుకే... ఆయన రాసే ప్రతీ సంభాషణలో తెలుగుదనం పరిమళిస్తుంటుంది. కఠిన పదాలు వాటిల్లో ఉండనే ఉండవు. సామాన్యుడు మాట్లాడే భాషే ముళ్లపూడి రచనలో కనిపిస్తుంది. తెలుగు సినిమా కథలు ఎన్నో రమణ చేతిలో పడి జీవం పోసుకున్నాయి. సినిమాలకు పనికిరాదని తేల్చిసిన కథలను సైతం రమణ, తన కలం పదునుతో రక్తికట్టించారు. తెలుగు సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మూగమనసులు ఇలా తయారయ్యిందే.
తాను రచయితను కాబట్టి ఏది రాసినా చెల్లుబాటు అవుతుందని ముళ్లపూడి ఎప్పుడూ అనుకోలేదు. సినిమా విజువల్ మీడియం కాబట్టి.. సంభాషణలు ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిదనేవారు. అన్నట్లే... తన సినిమాల్లో డైలాగ్స్ను పొదుపుగానే రాసేవారు. అందుకే.. రమణ రచనలో వచ్చిన సినిమాలు ఎప్పుడూ ఎక్కడా బోరు కొట్టించవు.
సినిమాల్లో సహజంగానే నాటకీయత ఎక్కువ. కానీ రమణ సినిమాల్లో మాత్రం నాటకీయత ఓ పాలు తగ్గి.. సహజత్వం పాలు ఎక్కువవుతుంది. సన్నివేశానికి తగ్గట్లుగానే మాటలు ఉంటాయి తప్ప.. మాటల కోసం సన్నివేశాలు ఎక్కడా ఉండవు. అదే రమణ ప్రత్యేకత.
బుడుగుకు జీవం
తెలుగువారి నోళ్లలో బుడుగు ఇప్పటికీ నానుతోందంటే దానికి కారణం ముళ్లపూడి. బుడుగును సృష్టించింది బాపూ కావచ్చు కానీ.. దాని ప్రాణం పోసి, మాటనేర్పింది మాత్రం ముళ్లపూడే. అంతేకాదు.. అడుగైనాలేని బుడుగుతో అరమీటరు డైలాగులు చెప్పించి.. హారి పిడుగా అనేలానూ చేశాడు.. బుడుగు కోసం రాసిన రమణ రాసిన ప్రతీ పదం.. హాయిగా నవ్వుకునేలా చేస్తుంది..
ఈ కార్టూన్ చూడండి.. ఇదీ బుడుగు స్టైల్. బుడుగు ముందు ఎంతటివాడైనా దిగదుడుపే. నోటికి వచ్చింది వచ్చినట్టు మాట్లాడేయడమే. తల్లైనా.. తండ్రైనా.. మాస్టారైనా.. బుడుగు మాటలకు బలికావాల్సిందే..
బుడుగు మాటల్లో పసితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిజంగా మన కళ్లముందు బుడుగు ఉన్నాడేమో అనిపిస్తుంది. బుడగు కార్టూన్లు చూసినా.. బుడుగు స్టోరీ చదివినా.. బుడుగే మాట్లాడుతున్నాడనుకుంటాం తప్ప... ఆ మాటలను రమణ రాసాడనుకోలేం. అదే రమణ రచనాశైలికి నిదర్శనం. అలా రాయగలగడమే ముళ్లపూడి గొప్పదనం.
అంతెందుకు.. ఓ సారి బుడుగు కళ్లు మూసుకుని అద్దంలో చూసుకుంటుంటాడు.. కళ్లుమూసుకుని ఏం చేస్తున్నావురా అని అమ్మ అడుగుతుంది. నిద్దరోతున్నప్పుడు ఎంత ముద్దొస్తున్నానో చూసుకుందామని అంటాడు బుడుగు.. పసితనంలోని అమాయకత్వం అది. అసలు మనం ఊహించగలమా..
బడి అంటేనే బుడుగు మా చెడ్డ చిరాకు. అది చదువు నేర్పే పాఠశాలైనా.. బుడుగుకు మాత్రం అదో చెరశాల. అందుకే.. ఛాన్స్ వస్తే చాలు.. టీచర్నే భయపెట్టాలనుకుంటాడు.
స్కూల్ సంగతి అలా ఉంచితే.. ప్రైవేట్ల సమస్య బుడుగును ఎంత ఇబ్బంది పెట్టిందో రమణ భలే చమత్కారంగా చెబుతారు. మాష్టార్లు చెప్పే ప్రైవేటుకు... ఇంట్లో బామ్మ చెప్పే ప్రైవేటుకు.. అమ్మానాన్నల మధ్య ప్రైవేటుకు మధ్య తేడా ఏంటో అర్థం కాదు. అమ్మ చెప్పేదానికి, నాన్న చెప్పేదానికి, బాబాయ్ చెప్పేదానికి పొంతనే ఉండదాయే. పైగా, తనకేమో మాస్టారొచ్చి లెక్కలో ఏవో చెబుతుంటాడు. మరి అమ్మకు నాన్న దగ్గర, బామ్మ దగ్గర లెక్కలు నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటో... పాపం బుడుగుకు అర్థం కాదు.
బుడుగు మాటతీరు అర్థం చేసుకోవడం కోసం పదాల్లోనే వింత ప్రయోగాలు చేశారు రమణ. పిల్లలు వత్తి పలికినట్లు అర్థం కావడానికి పదాలనే మార్చి రాశారు. పెద్దల మాటలను తిరిగి బుడుగు చెబితే ఏమవుతుందో చదివితే మనకు నవ్వాగదు. నిజం అని రాయడానికి నిఝం అని రాస్తారు రమణ. ఒట్టును ఒఠ్ఠు అంటారు. ఇక ఎవరినైనా ఒరేయ్ అనడం బుడుగు అలవాటు.
బుడుగును బాపూ సృష్టిస్తే.. బుడుగుతో పాటు మరికొన్ని క్యారెక్టర్లను జనంపైకి వదిలాడు రమణ. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీగానప్రసూనాంబ. బుడగు లైన్ వేసే పిల్ల. సీగానప్రసూనాంబ అంటే.. ఎందుకో బుడుగుకు పిచ్చి. ఆమె కోసం ఎదైనా చేద్దామనుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్నది బుడుగు లక్ష్యం. రమణ పిల్లాడిలా మారిపోయి ఈ రచన చేశారనడానికి నిదర్శనం సీగానప్రసూనాంబ పేరే. అసలు పేరు సి.జ్ఞాన ప్రసూనాంబ. పిల్లలకు నోరు తిరగదు కదా మరి.. అందుకే సిగానప్రసూనాంబ అయిపోయిందన్నమాట..
అసలు బుడుగు మాట్లాడడం మొదలుపెడితే.. మనం వింటూ ఉండాల్సిందే. ఒక విషయంలో నుంచి మరో విషయంలోకి అవలీలగా చొచ్చుకుపోతుంటాడు. ఏమన్నా అంటే ఇంసల్టు అంటాడు.. లోకువ కట్టేస్తారని భయపడతాడు.. అఫ్కోర్స్.. లోకువంటే బుడుగుకు అర్థం తేలీదనుకో.. అయినా సరే.. బాబాయ్ను చూసి అన్నీ నేర్చుసుకుంటాడు. పాపం, బాబాయేమో.. బుడుగుతో తన పనులు చేయించుకోవాలనుకుంటాడు. సీతకు లవ్ లెటర్ను బుడుగుతో పంపిస్తాడు. అదికాస్తా సీత తండ్రి చేతికందుతుంది. బాబాయ్ను రచ్చించడం కోసం అబద్ధం ఆడేస్తాడు. తన గురించి చెబుతూనే... మధ్యలో బాబాయి గురించి.. బాబాయి లైనేసే సీత గురించి చెబుతాడు. సీత వచ్చిందో లేదో చెప్పమని బాబాయి పురమాయిస్తే.. పాపం బుడుగు పడే ఇబ్బంది రమణ రాతల్లో... బాపు బొమ్మలో చూసి అర్థం చేసుకోవాల్సిందే..
ఇంకా బుడుగు బామ్మ గురించి, సీత తండ్రి గురించి, జట్కావాడి గురించి.. కొత్త ట్యూషన్ మాస్టర్ గురించి.. చెబుతా ఉంటే.. మనకు టైమే తెలియదు. అంత అద్భుతంగా బుడుగుతో మాట్లాడించారు రమణ. బుడుగు అనే క్యారెక్టర్కు ప్రాణం పోశారు. ప్రతీ ఇంటిలోనూ జీవించేలా చేశారు.
స్నేహశీలి
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం బాపు-రమణలది. బాపూ బొమ్మలానే ఎంతో అదంగా, అద్భుతంగా ఉంటుంది ఆయన తీసే సినిమా కూడా. ప్రతీ ఫ్రేమూ ఓ కళాఖండాన్ని తలపిస్తుంటుంది. అయితే.. అది బాపూ ఒక్కడి ప్రతిభే కాదు. దాని వెనుక, రమణ సహకారం ఎంతో ఉంది. అసలు రమణే లేకపోతే.. బాపూ ఉండేవాడే కాదు. బాపూ నుంచి ఇన్ని సినిమాలు వచ్చేవే కాదు.
ఏదో బాపూ కార్టూన్లా బతికేస్తున్న బుడుగుకు మాటలు నేర్పి, ఓ కుటుంబాన్నిచ్చిన రమణ... బాపూకు కూడా సినీలైఫ్ను అందించారు. తాను రాసిన సాక్షి సినిమా స్టోరీకి డైరెక్టర్ను చేశారు. సాక్షి సినిమాను అద్భుతంగా తీసి అందరి ప్రశంసలను ఈ మిత్రద్వయం అందుకొంది. అప్పటినుంచి వీరి జోడు ప్రయాణం మొదలయ్యింది. బాపూ లేకుండా రమణ సినిమా కథలను అందించారేమో గానీ... రమణ సహకారం లేకుండా, బాపూ సినిమాను మాత్రం తీయలేదు. అదే రమణ గొప్పదనం.
బాపూకన్నా ముందుగానే రమణ సినీప్రస్థానం మొదలయ్యింది. సినీ విమర్శకుడిగా పత్రికల్లో వ్యాసాలు రాస్తుండేవారు ముళ్లపూడి. లోపాలను ఎత్తి చూపే విషయంలో ఏమాత్రం మొహమాటపడేవారు కాదు. అందుకే సద్విమర్శకుల్లో రమణదే అగ్రస్థానం అయ్యింది. అలా సినీరంగంతో పెరిగిన పరిచయం ఆయనకు సినిమాలకు పనిచేసే అవకాశాలను అందించింది. వరసగా డాక్టర్లవేస్తూ హీరోయిన్లను త్యాగం చేసే పాత్రలనే వరసగా చేస్తున్న అక్కినేని ఉద్దేశించి.. ఈ త్యాగరాజు పాత్రలను మానివేస్తే మంచిదేమో అని విమర్శించారట ముళ్లపూడివారు. అది తనకెంతో మేలు చేసిందంటారు అక్కినేని.
రామాయణం అంటే రమణకు ప్రాణం. రామాయణంలోని ప్రతీ పాయింటునూ ఔపాసన పట్టిన రమణ... తన రచనా జీవితానికి దాన్నే చుక్కానిగా చేసుకున్నారు. బాపూరమణలు తీసిన చాలా సినిమాల్లో అంతర్లీనంగా మనకు రామాయణ గాథ కనిపిస్తుంది. ముత్యాలముగ్గులో ప్రతీ సన్నివేశమూ రామాయణమే. ఇటీవల తీసిన సుందరకాండ అలాంటిదే. పురాణగాథనే నేటి నేటివిటీకి తగ్గట్లుగా తీయగలగడంలోనే బాపూరమణల ప్రతిభ మనకు కనిపిస్తుంది.
ఇక ప్రయోగాల సంగతి సరేసరి. సినిమాకు కీలకమైన హీరోహీరోయిన్లకు మాటలే లేకుండా సినిమా తీయడం సాధ్యమా...? సాధ్యం చేసి చూపించారు బాపూరమణలు. సీతాకళ్యాణం సినిమాలో హీరో శోభన్బాబుకు.. ప్రారంభంలో, ముగింపులో మాత్రమే మాట్లాడే అవకాశం వస్తుంది. హీరోయిన్ జయప్రదకైతే, ఆ అవకాశమూ లేదు. అయినా.. సినిమాలో వారు మాట్లాడలేదనే విషయమే మనకు ఎక్కడా అనిపించదు. మిగిలిన క్యారెక్టర్లతో మాట్లాడించి.. ప్రేకక్షులను మైమరిపింపచేశారు.
మానవసంబంధాలకు ఎంతో విలువిస్తారు రమణ. ఆయన రచించిన సినిమా కథలన్నింటిలోనూ మానవసంబంధాలకే ప్రాధాన్యం ఉంటుంది. ఇక క్యారెక్టర్ల విషయంలో రాధన్నా, గోపాళం అన్నా రమణకు ఎంతో ఇష్టం. ఆయన కథల్లో, సినిమాల్లో ఈ పాత్రలు మనకు కనిపిస్తూనే ఉంటాయి.
అస్తమించిన అక్షరశిల్పి
బాపు బొమ్మ గీయాలి... రమణ దానికి రాతలు రాయాలి. అప్పుడు దానికి పరిపూర్ణత్వం వస్తుంది. అది ఒక్క కార్టూన్ అయినా... సిరీస్ అయినా.. కార్టూన్ కథ అయినా... సరే. బాపూ బొమ్మ ఎంత అందంగా ఉంటుందో... దానికి రమణ వేసే చమక్కు అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. రమణ రాతల్లో ఏదో మహత్యం ఉంది. లేకపోతే.. తెలుగు ప్రపంచమంతా ఆయన కథలను ఎందుకు చదవాలనుకుంటుంది. ఎప్పుడో యాభై ఏళ్లక్రితం ఆయన రాసిపాడేసిన కథలను ఇప్పటికీ చదివి మురిసిపోతుంటుంది.. ఎందుకంటే.. ఆయనలా మరొకరు రాయరు.. రాయలేరు. కథను చెప్పే తీరులోనూ రమణ మార్క్ ప్రత్యేకం.
హాస్య కథకుడిగా రమణకు పేరుపడ్డప్పటికీ, నవరసాలను పండించడంలో ఆయన నైపుణ్యం వర్ణించలేనిది. సెంటిమెంట్ను కూడా ఎంతో చక్కగా ఆయన పండించగలరు. అంతేస్థాయిలో విషాధాన్ని పలికించగలరు. అందుకే.. హాస్యకథలు రాసేవాడంటూ ఎద్దేవా చేసినా.. రక్తసంబంధం సినిమా కథతో అందరికీ తన రచనా సామర్థ్యాన్ని చాటిచెప్పారు ముళ్లపూడి.
రమణ రచనాశైలి ఎంతో విలక్షణం. ఆయనలా ఆలోచించడం ఎవరికీ సాధ్యం కాదు. తెలుగు పదాలతో ఆడుకోవడమూ ముళ్లపూడికి చెల్లినంతగా ఎవరికీ చెల్లకపోవచ్చు. రమణ అందించినంత వైవిధ్యభరిత సాహిత్యాన్ని తెలుగుభాషకు ఎవరూ ఇవ్వకపోవచ్చు. రమణలా రాయాలని ఎంతో మంది ప్రయత్నించారు. సినిమాలను విమర్శించడానికి ముళ్లపూడి పాటించిన విధానం ఇప్పటికీ అందరికీ ఆదర్శనీయం.
సాక్షి సినిమాతో మొదలైన బాపూ,రమణల ప్రస్థానం ఇప్పుడు శ్రీరామరాజ్యంగా ఆగిపోయింది. బాపూను ఒంటరిని చేసి, రమణ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు బాపూ గీతలకు మాటలు నేర్పేది ఎవరు..? నిజమే.. రమణ లోటును బాపూ తట్టుకోలేకపోవచ్చు. బాపూనే కాదు.. తెలుగు సాహితీ పిపాసులెవరైనా సరే.. ముళ్లపూడి వెంకట రమణ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి