28, ఫిబ్రవరి 2011, సోమవారం
భలే బడ్జెట్..
అంతా మాయ. మనకు కనిపించేది ఒకటి.. జరిగేది మరొకటి. ప్రణబ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి సూక్ష్మంగా చెప్పుకోవాలంటే అంతే. లెక్కల మంత్రదండాన్ని తిప్పుతూ అందరినీ మాయ చేశారు. ఆమ్ఆద్మీ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న బిల్డప్ ఇచ్చి.. జనాన్నిదోచుకునే ప్లాన్ వేశారు. అసలు బడ్జెట్లో ఏముంది..? మనకు వచ్చి పడేదేమిటి..?
ఆదాయ పన్ను..
కొత్త బడ్జెట్లో ఇన్కం ట్యాక్స్ స్లాబులు మారాయి. అందరూ ఆశించినట్లు వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిధిని 2 లక్షల రూపాయలకు పెంచకపోయినా.. ఎక్కువ మంది ఊహించినట్లు లక్షా 80 వేలకు దాన్ని పరిమితం చేశారు. వచ్చే ఏడాది నుంచి డీటీసీని అమలు చేయాల్సి ఉండడంతోనే లక్షా 80 వేల వరకే ప్రణబ్ ముఖర్జీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. సాధారణ, మధ్యతరగతి ఉద్యోగులకు ఈ నిర్ణయం మేలు చేసేదే అయినప్పటికీ.. మహిళలను మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు బెంగాల్ దాదా. ఇప్పటివరకూ లక్షా 90 వేల రూపాయల మినహాయింపును పొందుతున్న మహిళలకు ఈ బడ్జెట్లో పరిమితి ఏ మాత్రం పెంచలేదు. సాధారణ ఉద్యోగులు.. మహిళలను కరుణించని ప్రణబ్ వృద్ధులపై మాత్రం అపారమైన ఆప్యాయతను కనబరిచారు. ఆదాయపన్ను పరంగా వృద్ధుల నిర్వచనాన్ని కూడా మార్చారు. ఇంతవరకూ 65 ఏళ్లు నిండినవారిని మాత్రమే వృద్ధులుగా పరిగణిస్తుండగా, ఇకపై 60 ఏళ్లు నిండిన వారందరినీ వృద్ధులుగా లెక్కిస్తారు. వీరి ఆదాయపన్ను మినహాయింపు పరిధిని రెండున్నర లక్షలకు పెంచారు. ఎంతోమందికి ఇది మేలు చేసే విషయమే. ఇక ఈ వృద్ధుల్లోనూ మరో స్లాబ్ను విడదీశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టారు. వారు 5 లక్షల రూపాయల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదు. అయితే.. ఇది కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడే నిర్ణయం కావడంతో ప్రణబ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. 80 ఏళ్లు పైబడి.. ఏడాదికి 5 లక్షలకు పైగా సంపాదించడం సాధారణ, మధ్యతరగతి జనాల వల్ల కానేకాదు. ప్రభుత్వానికి భారం కాదు..
బడ్జెట్లో కీలకాంశం వ్యవసాయం. దేశీయ ఆహార అవసరాలను గుర్తించిన ఆర్థికమంత్రి తన పద్దులో ఈసారి వ్యవసాయానికి పెద్దపీటే వేశారు. వ్యవసాయ రుణాలను భారీగా పెంచారు. గత ఏడాది బడ్జెట్లో 3 లక్షల 75 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, ఈ బడ్జెట్లో మాత్రం 4 లక్షల 75 వేల కోట్లు కేటాయించారు. నిరుడుతో పోల్చితే.. లక్ష కోట్లు ఈ సారి అదనంగా ఇవ్వబోతున్నారు. అంతేకాదు.. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు ఇప్పటివరకూ వడ్డీలో 2 శాతం రాయితీ ఇస్తుండగా, ఈ సారి దాన్ని 3 శాతానికి పెంచారు. అంటే, గడువులోపల బాకీ కట్టేస్తే.. కేవలం 4 శాతం వడ్డీకే రుణాన్ని రైతులు పొందొచ్చన్నమాట. దీంతోపాటు..రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద వ్యవసాయ రంగానికి 7860 కోట్లను కేటాయించారు. తృణధాన్యాల సాగును ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా 300 కోట్ల రూపాయలను ప్రణబ్ తన పద్దులో చూపించారు.
సరైన స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం వల్లే 40 శాతం కూరగాయలు వృథా అవుతున్నాయని పేర్కొన్న ఆర్థికమంత్రి, కోల్ట్ స్టోరేజీ యూనిట్స్ సామర్థ్యాన్ని 5 లక్షల టన్నులకు పెంచుతామని హామీ ఇచ్చారు. పండ్లు, కూరగాయల ధరల అదుపునకు ప్రత్యేకంగా 15 మెగా ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
విద్యారంగంపైనా ఈ బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రణబ్. తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తామన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 40 లక్షల విద్యార్థులకు లబ్ది చేకూరుతుందన్నారు. విద్యారంగానికి 52057 కోట్లు కేటాయించారు. సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ సిబ్బందికి ఈ బడ్జెట్లో వరమిచ్చారు ఆర్థికమంత్రి. ఇప్పటివరకూ నెలకు1500 రూపాయలు పొందుతున్న అంగన్వాడీ వర్కర్లకు ఇకపై 3 వేల రూపాయలు, 750 రూపాయలు పొందుతున్న హెల్పర్లకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. సంక్షేమపథకాల అమలుకోసం ప్రత్యేకా లక్షా 60 వేల కోట్లను కేటాయించారు. వయోవృద్ధుల పెన్షన్ అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు 500 రూపాయలను పెన్షన్గా అందజేయాలని నిర్ణయించారు. 15 లక్షల లోపు గృహరుణాలను తీసుకునే వారికి ఒక శాతం వడ్డీ రాయితీని ఇస్తామని ప్రణబ్ చెప్పారు. అయితే.. ఇంటి విలువ 25 లక్షల రూపాయలు దాటనప్పుడే దీనికి అర్హత ఉంటుంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కిరోసిన్, గ్యాస్, ఎరువులకు సంబంధించిన సబ్సిడీని నేరుగా లబ్దిదారులకే అందజేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే.. ఇది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే వర్తిస్తుందనడం కలవరం కలిగిస్తుంది. మధ్యతరగతి ప్రజలకూ దీన్ని వర్తించకపోతే, జనం నుంచి తీవ్ర ప్రతిఘటనను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది..
అన్నింటికీ ట్యాక్స్
2011-12 ఆర్థిక సంవత్సరానికి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే.. పైకి ఒకలా.. లోపల మరోలా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఎక్కడా కొత్తగా పన్నులు విధించినట్లు ఈ బడ్జెట్లో లేదు. కానీ, జనం నుంచి పరోక్షంగా వసూలు చేసే మొత్తాన్ని గణనీయంగా పెంచుకోవడానికి రంగం సిద్ధమయ్యింది. సర్వీస్ ట్యాక్స్ పరిధిని ఈ బడ్జెట్లో విస్తరించారు. విమాన ప్రయాణాలు చేసే వారిపై ప్రణబ్ కొరడా ఝలిపించారు. ఎకానమీ క్లాస్లో దేశీయ ప్రయాణానికి 50 రూపాయలు, విదేశీ ప్రయాణానికి 250 రూపాయలను ప్రత్యేకంగా వసూలు చేస్తారు. అదే బిజినెస్క్లాస్ ప్రయాణమైతే 10 శాతాన్ని కట్టి తీరాల్సిందే.
టూర్స్ ఎక్కువగా చేసేవారు.. హోటల్స్లో ఎక్కువగా బస చేసేవారి ఖర్చూ కొత్త బడ్జెట్లో పెరుగుతుంది. హోటల్ రూం రెంట్ 1000 రూపాయలు దాటిన పక్షంలో 5 శాతం సర్వీస్ ట్యాక్స్ను కట్టాల్సిందే. అంతేకాదు.. ఎండాకాలం వస్తోంది కదా అని ఏసీ బార్లోకి వెళ్లి మందు తాగినా.. 3 శాతం సర్వీస్ ట్యాక్స్ చెల్లించుకోవాలి. ఓ రకంగా, ఎయిర్ట్రావెల్, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ సేవలు ఖరీదు కాబోతున్నాయి.
ఇక కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఖరీదు కాబోతోంది. ఇప్పటికే రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్న హాస్పిటల్స్ కూడా కొత్త బడ్జెట్తో సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి. 25 బెడ్స్ దాటి.. ఏసీ సదుపాయం ఉన్న ప్రతీ హాస్పిటల్లోనూ, డయాగ్నోస్టిక్ సెంటర్స్లోనూ ఇకపై సర్వీస్ ఛార్జ్ను కూడా వసూలు చేస్తారు. అంతుపట్టని రోగాలు విజృంభిస్తున్న ఈ కాలంలో.. ప్రతీ ఒక్కరిపైనా దీని ఎఫెక్ట్ పడుతుంది.
బ్రాండెండ్ దుస్తులపై మనసుపారేసుకునేవారు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. బ్రాండెడ్ క్లోత్స్పై 10 శాతం ఎక్సైజ్ డ్యూటీని తప్పనిసరి చేశారు. దీంతో.. అన్నింటి ధరలూ పెరగనున్నాయి. ఇప్పటికే కాటన్ ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్నతయారీదారులు.. మొత్తం భారాన్ని జనంపైనే వేయడానికి సిద్ధం అవుతున్నారు.
ఎక్సైజ్ సుంకం మినహాయింపు పరిధిలోనుంచి 130 వస్తువులను తప్పించారు. ఆర్థికమాంద్యం కారణంగా ఇంతకాలం పన్ను మినహాయింపు ఇచ్చిన ఈ వస్తువులకు ఇకపై పన్ను భారం పడుతుంది. వ్యాపార సంస్థలకు అందించే న్యాయసలహాలను కూడా ప్రణబ్ ముఖర్జీ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఎన్నో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి లాయర్లపై ఆధారపడే కంపెనీలన్నీ.. ప్రత్యేకంగా ఈ ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్నూ ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో.., లక్షలాదిమంది పాలసీ హోల్డర్లపై భారం పడొచ్చన్న అనుమానాలున్నాయి.
బడాబాబులకు..
ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రణబ్ ముఖర్జీ. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకత్వాలను ఆర్బీఐ వెలువరిస్తుందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఎప్పటినుంచో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇది ఉత్సాహాన్నిచ్చే విషయం. దీనికి తోడు, మార్కెట్లో పెట్టుబడులను పెంచడం కోసం విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడులకు FIIలకు అనుమతులిచ్చారు.
ఎక్సైజ్ డ్యూటీని మార్చకపోవడంతో పారిశ్రామికరంగానికి బడ్జెట్ వల్ల పెద్దగా నష్టం జరగడం లేదు. పైగా, బడ్జెట్కు ముందు కార్లు, ఏసీ ధరలకు రెక్కలు రావడం ఖాయమనుకున్నప్పటికీ, ఎక్సైజ్ డ్యూటీని మార్చకపోవడంతో వాటి ధరలు యదాతథంగా కొనసాగనున్నాయి. కార్లు, ఏసీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ల్యాప్టాప్లు, మైక్రోఓవెన్లు, మొబైల్ ఫోన్స్, ప్రింటర్లు, ఫ్యాక్స్, మల్టీఫంక్షనల్ డివైజెస్ ధరలు తగ్గబోతున్నాయి. టీవీ ధరలు పెద్దగా మారకపోవచ్చు.
పర్యావరణ పరిరక్షణ పాలసీలో భాగంగా, భారతదేశంలో హైబ్రిడ్ కార్స్ తయారు చేయడానికి ముందుకువచ్చేవారికి ప్రత్యేక రాయితీలను అందిస్తామని ప్రణబ్ ప్రకటించారు. విదేశాలనుంచి ఎవరైనా ఈ హైబ్రిడ్ కార్లను దిగుమతి చేసుకున్నా పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. ఇదీ ఉన్నత వర్గాలకు ఉపయోగపడేదే. దీంతోపాటు దేశీయ కంపెనీలపై ప్రస్తుతం విధిస్తున్న సర్ఛార్జిని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇక ఆదాయపన్ను పరిధిలోకి 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వడమూ ఈ వర్గానికే మేలు చేసినట్లు.
లోపాలు..
ధరలు తగ్గించడానికి ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారో ఆర్థికమంత్రి వెల్లడించలేదు. వ్యవసాయానికి నిధులు పెంచామని, దానివల్లే అంతా సెట్ అయిపోతుందని అమాత్యులు భావించి ఉంటారు, కానీ సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడాన్ని మాత్రం పట్టించుకోలేదు. రుణపరిమితిని పెంచినప్పటికీ, బ్యాంకులు మాత్రం రైతులకు ఇవ్వవన్న అభిప్రాయమే రైతుల్లో వ్యక్తమవుతోంది. అందుకే.. ఈ బడ్డెట్ వల్ల రైతులకు పెద్గగా ఉపయోగం ఉండదంటున్నారు.
ఇటీవల మన దేశాన్ని కుదిపేస్తున్న అంశం నల్లధనం. విదేశీబ్యాంకుల్లో మూలుగుతున్న మన సొమ్మను వెనక్కిరప్పించడంపై కీలకమైన ప్రకటన ఈ బడ్జెట్ ప్రసంగంలో వెలువడుతుందని దేశమంతా ఆశించింది. కానీ, దానికి ఐదంచెల పద్ధతిని అనుసరిస్తామని మాటమాత్రంగానే ప్రణబ్ చెప్పారు తప్ప.. నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదు
కోట్లాదిమందికి ఉపయోగపడే ఆదాయపన్ను స్లాబ్ను నామమాత్రంగా సవరించారే తప్ప, రెండు లక్షలకు చేయలేదు. పైగా ఎన్నో పథకాలను ప్రతీసారి ప్రవేశపెడతారు. కానీ, అమల్లో మాత్రం ఏవీ సాధ్యం కావు. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ధరలకు అడ్డుకట్ట వేయడం మనవాళ్లకు సాధ్యం కావడం లేదు. ముందు మారాల్సింది అదే. ప్రణబ్ ముఖర్జీకూడా ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి